భారతీయ మార్కెట్లో అడుగెట్టనున్న 600 కిమీ రేంజ్ అందించే Mercedes Benz EQS: వివరాలు
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న సమయంలో ఇప్పటికే చాలా కంపెనీలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహన విభాగంలో విడుదల చేస్తున్నాయి, మరికొన్ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) తన 'ఈక్యూఎస్' (EQS) ఎలక్ట్రిక్ SUV విడుదల చేయటానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్' (Mercedes Benz EQS) గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో కంపెనీ తన ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ SUV ని 2022 ఆగష్టు 24 న అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇది దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. అయితే ఇది ఆధునిక డిజైన్ కలిగి అధునాతన పరికరాలతో రానుంది.

బెంజ్ కంపెనీ ఇదివరకే తెలిపిన సమాచారం ప్రకారం, 2025 - 2026 వ సంవత్సరం నాటికి భారతదేశంలో కంపెనీ విక్రయించే మొత్తం విక్రయాలలో 15 శాతం నుంచి 20 శాతం వరకు ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని ప్రకటించింది. కావున కంపెనీ దీనికోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ సంఖ్యలో విడుదల చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది.

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తగిన పట్టును సాధించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు EQS ఎలక్ట్రిక్ సెడాన్ విడుదలకు సిద్దమైంది. ఇది వచ్చే నెలలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. అయితే భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మెర్సిడెస్-బెంజ్ ఇతర లగ్జరీ కార్ల తయారీ సంస్థలతో పోటీపడనుంది. ఇందులో ఆడి, బిఎమ్డబ్ల్యూ, వోల్వో మరియు పోర్షే వంటి కంపెనీలు ఉన్నాయి.

భారతదేశంలో 'ఈక్యూఎస్' ఎలక్ట్రిక్ SUV ని పూణే ప్లాంట్లో స్థానికంగా అసెంబుల్ చేయనున్నారు. నిజానికి మొదట్లో సిబియు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దిగుమతి చేసుకోవడం జరిగేది. అయితే ఇప్పుడు స్థానికంగా అసెంబుల్ చేయబడిన EQS 580 లాంచ్ చేయబడుతుంది. కంపెనీ 'ఈక్యూఎస్' ని EQS 450+ మరియు 'EQS 580 4 మ్యాటిక్' అనే రెండు వేరియంట్లలో విక్రయించబోతోంది. కానీ ఈ రెండు వేరియంట్ల ధరలు, పవర్ మరియు రేంజ్ వంటివి చాలా వరకు భిన్నంగా ఉంటాయి.

మెర్సిడెస్ బెంజ్ యొక్క EQS అనేది భారతీయ మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఇది ఒక చార్జ్ తో గరిష్టంగా 600 కిమీ పరిధిని అందిస్తుంది. EQS 450+ వేరియంట్ అనేది బేస్ వేరియంట్ అవుతుంది, అదే సమయంలో EQS 580 4 మ్యాటిక్ టాప్ ఎండ్ వేరియంట్ అవుతుంది. ఈ రెండు వేరియంట్లు 108.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతాయి. అయితే బేస్ వేరియంట్ 324 బిహెచ్పి పవర్ మరియు 550 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇక టాప్ ఎండ్ వేరియంట్ EQS 580 4 మ్యాటిక్ విషయానికి వస్తే, ఇది 509 బిహెచ్పి పవర్ మరియు 828 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.1 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఎకో మోడ్ లో గరిష్టంగా 600 కిమీ పరిధిని అందిస్తుంది. కావున ఎక్కువ రేంజ్ అందించే వాహనాల కోసం ఎదురు చూసే వారికి ఇది తప్పకుండా అనుకూలంగా ఉంటుంది.

త్వరలో విడుదలకానున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ EQS అద్భుతమైన ఏరోడైనమిక్ డిజైన్ కలిగి ఉంటుంది. కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త సెడాన్ లో కొత్త MBUX హైపర్స్క్రీన్ అందుబాటులో ఉంటుంది. ఈ హైపర్స్క్రీన్ మూడు వేర్వేరు స్క్రీన్లను కలిగి ఒక పెద్ద స్క్రీన్ని ఏర్పరుస్తుంది. ఈ స్క్రీన్ దాదాపు డాష్బోర్డ్ యొక్క మొత్తం వెడల్పులో ఉంటుంది. ఈ స్క్రీన్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గా మరియు ఎంటర్టైన్మెంట్ సిస్టమ్గా పనిచేస్తుంది. ఇవి ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కంపెనీ యొక్క ఈ కొత్త EQS ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. ఇది ఇప్పటికే యూరోపియన్ మరియు యుఎస్ వంట విదేశీ మార్కెట్లలో విక్రయించబడుతుంది. ఇది విదేశీ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందింది, కావున తప్పకుండా దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుంది అని ఆశిస్తున్నాము.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే మంచి ఉత్పత్తులను భారతీయ మార్కెట్లో విడుదల చేసి ప్రసిద్ధి చెందిన లగ్జరీ వాహన తయారీ సంస్థగా కీర్తి పొందుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా తన ఉనికిని చాటుకోవడానికి కంపెనీ ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సెడాన్ యొక్క ధరలు ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే బుకింగ్స్ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








