పెట్రోల్ కావాలా నాయనా..? అయితే పియూసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్ చూపించు..!
మీ వాహనం కోసం పెట్రోల్ కావాలా? అయితే, మీ వద్ద చెల్లుబాటు అయ్యే PUC (పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉందా? అది ఉంటేనే మీ బైక్ లేదా కారులో ఇంధనం నింపుతారు. పియూసి లేని వారికి ఇంధనం నింపరు. అదెక్కడ అనుకుంటున్నారా? మనదేశ రాజధాని ఢిల్లీలో. వాహనంలో ఇంధం నింపాలంటే, వాహన చాలకులు తప్పనిసరిగా పియూసి సర్టిఫికెట్ను పెట్రోల్ బంకుల్లో చూపించాలని ఢిల్లీ సర్కారు కొత్త రూల్ పాస్ చేసింది. వాహన కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను అమలు చేసింది.

నగరంలోని అన్ని రకాల వాహనాల యజమానులు ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి తప్పనిసరిగా PUC సర్టిఫికేట్ను చూపించాలని పేర్కొంది. అదే సమయంలో, పియూసి సర్టిఫికేట్ లేకుండా టూవీలర్ రైడింగ్ లేదా ఇతర వాహనాలను డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో కాలుష్యం కూడా ఒకటి. ఇది ఇప్పటికే అక్కడ తీవ్రస్థాయిలో ఉంది.
ఢిల్లీ-ఎన్సిఆర్ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలలో ఒకటి. కాబట్టి, ఇక్కడ వాహనాల వినియోగం కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా ఈ ప్రాంతంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది.

ఢిల్లీ ప్రభుత్వం మరియు రవాణా శాఖలు వాహన కాలుష్యాన్ని అదుపులోకి తీసుకురావడానికి గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టగా, ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రణాళికను అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఢిల్లీ రవాణా శాఖ ప్రకారం, చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్ లేకుండా సుమారు 17 లక్షల వాహనాలు నగరంలోని రోడ్లపై తిరుగుతున్నాయని, ఇలాంటి వాహనాలు పర్యావరణాన్ని ఎంత కలుషితం చేస్తున్నాయో ట్రాక్ చేయడం అసాధ్యమని ప్రభుత్వం తెలిపింది.

ఏదైనా వాహనం యొక్క కాలుష్య స్థాయి నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవడానికి, దానికి చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్ ఎంతో అవసరం. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం, భారత రోడ్లపై తిరిగే అన్ని రకాల పెట్రోల్/డీజిల్ ఇంధన ఆధారిత వాహనాలు తప్పనిసరిగా పియుసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్ను కలిగి ఉండాలి. భారత రోడ్లపై తిరిగే వాహనాలు ఎక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను విడుదల చేసి, పర్యావరణానికి హాని కల్పించకుండా నియంత్రించడంలో ఈ పియుసి సర్టిఫికెట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

వాహనానికి సంబంధించిన పత్రాలలో రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్ పత్రాలు ఎంత మఖ్యమో, దాని పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికెట్ కూడా అంతే ముఖ్యం. ట్రాఫిక్ స్టాప్స్ సమయంలో ట్రాఫిక్ అధికారులు తనిఖీ చేసే వాహన పత్రాలలో పియుసి సర్టిఫికెట్ కూడా తప్పనిసరిగా ఉండాలి, అలా లేకపోయినట్లయితే సదరు వాహన యజమానికి జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కానీ, చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో కూడా దేశ రాజధాని ఢిల్లీలో సరైన పియుసి సర్టిఫికెట్ లేని వాహనాలపై భారీ జరిమానాలు విధించారు. చెల్లుబాటు అయ్యే పియుసి లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై రూ. 10,000 వరకూ జరిమానాలను విధించిన ధాఖలాలు కూడా ఉన్నాయి. చెల్లుబాటు అయ్యే పియుసి లేకపోయినట్లయితే, సదరు వాహన యజమానికి కేవలం జరిమానా విధించడం మాత్రమే కాకుండా, 6 నెలల జైలు శిక్ష లేదా 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయటం కూడా చేసే అవకాశం ఉంది.

వాహన చాలకులు తమ వాహనాలకు ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేసుకోవాలన్నా కూడా పియూసి తప్పనిసరిగా ఉండాలి. కానీ, చాలా మంది ఇన్సూరెన్స్ బ్రోకర్లు ఈ విషయాన్ని చూసీచూడనట్లుగా వదిలేస్తుంటారు. అయితే, ఇది చట్టరీత్యా నేరం. గడచిన 2020లో దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం, వాహన భీమా పునరుద్ధరణ కోసం పియుసి తప్పనిసరి చేసింది. కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే వాహనాలను రోడ్లకు దూరంగా ఉంచాలన్నదే సుప్రీం కోర్టు ప్రధాన లక్ష్యం.

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డిఎఐ) ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్లో, సాధారణ బీమా కంపెనీలు ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఇప్పుడు, ఢిల్లీలో ఈ కొత్త రూల్ రాకతో, ఢిల్లీలోని వాహన యజమానులందరూ తమ వాహనాల కోసం ఇంధనం కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా పియుసి సర్టిఫికేట్ను కలిగి ఉండాలి. అక్టోబర్ 25 నుంచి పెట్రోల్ పంపుల వద్ద ఇంధనం కొనుగోలు చేసేందుకు ఢిల్లీలోని వాహన యజమానులందరూ కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

పర్యావరణ, రవాణా, ట్రాఫిక్ శాఖల అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సమావేశంలో ప్రణాళికను అమలు చేసే పద్ధతులపై కూడా చర్చించారు. ప్రభుత్వం చేపట్టనున్న తాజా వాయు కాలుష్య నిరోధక చర్యల్లో ఇది ఒక భాగంగా ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మరియు శీతాకాల ప్రణాళికను సరిగ్గా అమలు చేయడానికి తన 24x7 వార్ రూమ్ను కూడా ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరింది.


Click it and Unblock the Notifications








