ఇలా మొండిగా వ్యవహరిస్తే కష్టమే.. ప్రమాదాలను తగ్గించడానికి మీ సహకారం ఎంతో అవసరం: నితిన్ గడ్కరీ
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు వాహన తయారీ సంస్థలు ప్రపంచ భద్రతా నిబంధనలను అనుసరించాలని భారతదేశంలోని ఆటోమొబైల్ తయారీదారులను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ప్రమాదాలను తగ్గించడంలో ఆటోమొబైల్ పరిశ్రమ సహకారం ఎంతో అవసరమని ఆయన చెప్పారు.
Recommended Video
దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

గత బుధవారం ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) వార్షిక సెషన్ను ఉద్దేశించి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, భారతదేశంలోని మెజారిటీ ఆటోమొబైల్ తయారీదారులు ఇప్పటికే ఆరు ఎయిర్బ్యాగ్లతో కూడిన కార్లను ఎగుమతి చేస్తున్నారని, దేశంలోని కార్లకు ఇలాంటి భద్రతా నిబంధనలను అనుసరించాల్సిన అవసరం ఉందని, తయారీదారులు చిన్న ఎకానమీ కార్లను ఉపయోగించే ప్రజల భద్రత గురించి కూడా పెద్దగా ఆలోచించాలని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

"భారత్లోని మెజారిటీ ఆటోమొబైల్ తయారీదారులు ఆరు ఎయిర్బ్యాగ్లతో కూడిన కార్లను ఎగుమతి చేస్తున్నారు. కానీ భారతదేశంలో, ఆర్థిక నమూనా మరియు ధర కారణంగా, వారు వెనుకాడుతున్నారు" అని గడ్కరీ చెప్పారు. కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు గురించి గడ్కరీ వాహన తయారీదారుల కోరడం ఇదేం మొదటి సారి కాదు. గత కొన్ని నెలలుగా నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.

ప్రస్తుతం, భారతదేశంలో విక్రయించబడుతున్న బడ్జెట్ కార్లు కేవలం రెండు (ఫ్రంట్) ఎయిర్బ్యాగ్స్తో మాత్రేమ విక్రయించబడుతున్నాయి. అయితే, దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మరియు ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు (షోల్డర్ మరియు కర్టెన్ ఎయిర్బ్యాగ్స్తో కలిపి) తప్పనిసరిగా అందించాలని ఆయన వాహన తయారీదారులను కోరారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా వాహన భద్రతా ఫీచర్ల విషయంలో ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని భావిస్తోంది.

సాధారణంగా, ఒక కారులో ఒక్కో ఎయిర్బ్యాగ్ను అమర్చడానికి అయ్యే ఖరీదు కేవలం రూ.1000 మాత్రమే ఉంటుంది. కాబట్టి కారులో రూ.6,000 ఖర్చుతో ఆరు ఎయిర్బ్యాగ్లను సులువుగా అందించవ్చచు. ఇదే విషయాన్ని గడ్కరీ కూడా తయారీదారులకు వివరించారు. కారులో 6 ఎయిర్బ్యాగ్లు అమర్చడం వల్ల కారు తయారీ ఖర్చు మరియు దాని రిటైల్ ధర పెరుగుతుందన్న ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. కారు ధరల కన్నా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం మరింత ముఖ్యమని చెప్పారు.

దేశంలో ప్రతి ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాల జరుగుతున్నాయని, వాటిలో సుమారు 1.5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పుతున్నారని, మరో మూడు లక్షల మందికి పైగా గాయపడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి సూచించారు. ఎకానమీ కార్లను ఉపయోగించే మద్యతరగతి వ్యక్తుల జీవితాల గురించి ఆటోమొబైల్ తయారీదారులు ఎందుకు ఆలోచించడం లేదని తాను ఆశ్చర్యపోతున్నానని గడ్కరీ అన్నారు.

"ప్రమాదాలను తగ్గించడంలో మాకు ఆటోమొబైల్ పరిశ్రమ సహకారం ఎంతో అవసరం. సురక్షితమైన కార్లను ఉత్పత్తి చేయడానికి తయారీదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి" అని ACMA సెషన్లో మంత్రి చెప్పారు. రహదారి భద్రత మోడీ ప్రభుత్వానికి అత్యున్నత ఎజెండా అని, భారతదేశంలో సురక్షితమైన వాహనాల ఆవశ్యకత గురించి నితిన్ గడ్కరీ పదే పదే నొక్కి చెప్పారు.

అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి చేసే దిశగా మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రి చెప్పారు. వెనుక సీటుని ప్యాసింజర్లతో సహా వాహనంలోని ప్రయాణికులందరూ సీటు బెల్టులు ధరించడం తప్పనిసరి అని గడ్కరీ చెప్పారు. గత సంవత్సరం, భారతదేశంలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో 1.55 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే, సగటున రోజుకు 426 మంది లేదా ప్రతి గంటకు 18 మంది చొప్పున మరణించారు. ఇప్పటి వరకు ఏ క్యాలెండర్ సంవత్సరంలో ఇంత అధికంగా ప్రమాదాలు నమోదు కాలేదు.

కార్లలో అందించే ఎయిర్బ్యాగ్ అనేది వాహనంలో ప్రయాణించే వ్యక్తికి తీవ్రగాయాలు కాకుండా నివారించే ఓ సేఫ్టీ పరికరం. వాహనం ఢీకొన్న సమయంలో డ్రైవర్ మరియు వాహనం యొక్క డ్యాష్బోర్డ్ మధ్యలో ఇది జోక్యం చేసుకుంటుంది, తద్వారా తీవ్రమైన గాయాలను నివారిస్తుంది. అక్టోబర్ 2022 నుండి కార్ల తయారీదారులు ఎనిమిది సీట్ల వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్బ్యాగ్లను అందించడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

అధిక పన్నులు విధించడం మరియు వాహనాలకు కఠినమైన భద్రత మరియు ఉద్గార నిబంధనలు తమ ఉత్పత్తులను ఖరీదైనవిగా మార్చాయని ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళనలను లేవనెత్తుతున్న నేపథ్యంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, మోటారు వాహనంలో ప్రయాణించే వారి భద్రతను పెంచడానికి, కేంద్ర మోటారు వాహనాల నిబంధనలను (CMVR), 1989 సవరించడం ద్వారా భద్రతా లక్షణాలను మెరుగుపరచాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

సీట్ బెల్టులు ధరించకపోతే జరిమానా తప్పనిసరి
కారులో ప్రయాణించే వారందరూ సీటు బెల్ట్ను తప్పనిసరిగా ఉపయోగించాలని నిబంధన ఇప్పటికే అమలులో ఉందని, అయితే ప్రజలు దానిని పాటించడం లేదని గడ్కరీ అన్నారు. ఇకపై కారులో వెనుక సీటులో కూర్చున్న ప్రతిఒక్కరు కూడా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని, అలా చేయనట్లయితే భారీ జరిమానాలు విధించబడుతాయని ఆయన హెచ్చరించారు. కారులో ముందు సీట్లలో కూర్చున్న వారు సీటు బెల్టు పెట్టుకుంటారని, అయితే వెనుక సీటులో కూర్చున్న వారు సీటు బెల్ట్ను విస్మరిస్తున్నారని, ఇది ప్రమాద సమయంలో ప్రాణాంతకంగా మారుతుందని గడ్కరీ అన్నారు.


Click it and Unblock the Notifications








