నాలుగు రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎన్నికలు ముగిసాయిగా, ఇక బాదుడే బాదుడు!
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గతేడాది నవంబర్ నెల నుండి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, ఈ రాష్ట్రాలలో ఇటీవల ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తిరిగి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గమంటున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే మూడు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ మూడు రోజుల వ్యవధిలోనే పెట్రోల్ ధరలు రూ.2.40 పైసలు పెరిగాయి. ఇదిలానే కొనసాగితే మరికొద్ది రోజుల్లో లీటరు పెట్రోల్ ధర రూ.150 కి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గడచిన మంగళవారం లీటరు పెట్రోల్ మరియు డీజిల్ పై 80 పైసల చొప్పున ధర పెంచారు. ఆ తర్వాత వెంటనే బుధవారం నాడు కూడా మరో 80 పైసలు పెంచారు. తాజాగా ఇప్పుడు శుక్రవారం నాడు మరో 80 పైసల చొప్పున ధర పెంచారు. ఇలా నాలుగు రోజుల వ్యవధిలో మూడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. దీంతో ఇంధన ధరలు లీటరుపై రూ.2.40 పైసల చొప్పున పెరిగింది.

తెలుగు రాష్ట్రాలలలో ప్రస్తుత ఇంధన ధరలు!
ధర పెరుగుదల తర్వాత , తెలంగాణాలో లీటరు పెట్రోల్ ధర 110.91 మరియు లీటరు డీజిల్ ధర రూ.97.24 లకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో లీటరు పెట్రోల్ ధర రూ.112.37 మరియు లీటరు డీజిల్ ధర రూ.98.36 లకు చేరుకుంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.81, లీటరు డీజిల్ ధర రూ.89.07 గా ఉంటే, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 112.51 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 96.70 లకు చేరుకుంది.

అయిల్ కంపెనీలకు భారీ నష్టాలు, అందుకే ధరల పెంపు!
గడచిన ఏడాది నవంబర్ నుండి, ప్రభుత్వ యాజమాన్యంలోని రిఫైనింగ్ మరియు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను సవరించకపోవడం కారణంగా, చమురు కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్పై దాదాపు 2.25 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 17,000 కోట్లు) నష్టాన్ని చవిచూసినట్లు మూడీస్ నివేదిక పేర్కొంది. ఇప్పుడు ఆ నష్టాన్ని రికవరీ చేసేందుకు చమురు కంపెనీలు ధరల బాదుడుకు సిద్ధమయ్యాయి.

ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా, చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం ఒక్కో బ్యారెల్కు సుమారు 25 డాలర్లు (దాదాపు రూ. 1,900) మరియు పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలపై బ్యారెల్కు 24 డాలర్ల చొప్పున ఆదాయాన్ని కోల్పోతున్నాయని ఏజెన్సీ తన నివేదికలో తెలిపింది. CRISIL రీసెర్చ్ ప్రకారం, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను పూర్తిగా అధిగమించడానికి దేశంలో లీటరుకు రూ. 15-20 మేర ధరలను పెంచాల్సి ఉంటుంది.

ఇన్ని రోజులు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే ఆదుకున్నాయి!
గతేడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కేంద్రం మరియు రాష్ట్రాలు ఇంధన పన్నులను తగ్గించడంతో రిటైలర్లు నవంబర్ 4 నుండి పెట్రోల్ మరియు డీజిల్ ధరలను స్తంభింపజేసారు. ఇన్నిరోజుల ఈ అసెంబ్లీ ఎన్నికలే ఇంధన ధరలు పెరగకుండా ఆదుకున్నాయి. అయితే, ఇప్పుడు ఈ ఎన్నికలు ముగియడంతో రిటైల్ వ్యాపారులు మంగళవారం ధరల సవరణలను పునఃప్రారంభించారు. వరుసగా రెండు రోజులు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను లీటర్కు 80 పైసలు పెంచారు. కాగా, గురువారం విరామం ఇచ్చి, తిరిగి శుక్రవారం నాడు ధరలను పెంచడం ప్రారంభించారు.

కొత్త ఆర్థిక సంవత్సరంలో మరింత పెరిగే ఛాన్స్!
ఏప్రిల్ 2022 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వం భావించడం లేదు. కాబట్టి ఆయిల్ కంపెనీలు తమ రిఫైనింగ్ మార్జిన్లు మరియు ఇన్వెంటరీ లాభాలకు వ్యతిరేకంగా పెట్రోల్ మరియు డీజిల్పై అండర్ రికవరీలను ఆఫ్సెట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ ధరల పెరుగుదల నేటితో ముగుస్తుందనుకోవడం లేదు. రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ధరల పెరుగుదలను సమర్థించిన పెట్రోలియం శాఖా మంత్రి!
దేశంలో దాదాపు నాలుగైదు నెలల విరామం తర్వాత ఇంధన ధరలు పెరగడాన్ని కేంద్ర చమురు శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమర్థించారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా, భారతదేశంలో కూడా ఇంధన ధరలు పెంచాల్సి వస్తోందని అన్నారు. అయితే ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకే ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.

లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సమాధానమిస్తూ, ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు పోల్చితే అంతర్జాతీయ మార్కెట్లో ఎల్ఎన్జి ధరలు 37 శాతం కంటే ఎక్కువ పెరిగాయని, కోవిడ్ సంక్షోభం తర్వాత ఏర్పడిన అస్థిరమైన పరిస్థితులు మరియు సైనిక చర్య (ఉక్రెయిన్-రష్యా యుద్ధం) వంటి కారణాల వలన ఇంధన ధరలు పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.

సిఎన్జి (CNG) ధర కూడా పెరిగింది!
కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాదు అందుకు ప్రత్యామ్నయ ఇంధనంగా ఉన్న సిఎన్జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ధరలు కూడా పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సిఎన్జి ధరను కేజికి రూ. 1 మేర పెంచింది. దీంతో కేజి సిఎన్జి ధర రూ. 59.01 కి చేరుకుంది. పెరిగిన ధరలు గురువారం నుండే అమలులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications








