ఒకే రోజులో 101 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన టాటా మోటార్స్ (Tata Motors Delivers 101 EVs In a Day)
ప్రస్తుతం, భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా ఉన్న టాటా మోటార్స్ (Tata Motors) ఒకే రోజులో 101 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసి ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. తమిళనాడు రాష్ట్రంలో ఒకే రోజులో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయడం ద్వారా టాటా మోటార్స్ మరోసారి కొత్త మైలురాయిని సాధించింది. చెన్నైలో జరిగిన హ్యాండ్ఓవర్ వేడుకలో 70 టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)లు మరియు 31 టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV)లను తమ వినియోగదారులకు డెలివరీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

తమిళనాడు రాష్ట్రం యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ విజన్లో తాము ఈ విధంగా భాగమైనందకు సంతోషిస్తున్నామని టాటా మోటార్స్ ఓ ట్వీట్ లో తెలిపింది. టాటా మోటార్స్ ఇలాంటి రికార్డులు నెలకొల్పడం ఇదేం మొదటిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో టాటా మోటార్స్ మహారాష్ట్ర మరియు గోవాలోని వ్యక్తిగత కస్టమర్లకు ఒక్క రోజులో 712 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయడం ద్వారా, దేశంలోనే అతిపెద్ద ఈవీ డెలివరీ ఈవెంట్ను సాధించిన నాలుగు చక్రాల OEM (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యాన్యుఫాక్చరర్) కంపెనీ రికార్డును కలిగి ఉంది.

టాటా మోటార్స్ ప్రస్తుతం భారతదేశంలో అమ్మకాల పరంగా మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ కంపెనీల తర్వాత మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరించింది. ఈ బ్రాండ్ త్వరలోనే హ్యుందాయ్ని ఓవర్టేక్ చేసి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గ్యాసోలీన్ వాహనాల సేల్స్ విషయంలోనే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ విషయంలో కూడా టాటా మోటార్స్ దూసుకుపోతోంది. ప్రస్తుతం, దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న కంపెనీ కూడా టాటా మోటార్స్ కావడం విశేషం.

ఇటీవలి కాలంలో, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అదే స్థాయిలో పెరుగుతోంది. దేశంలో నిరంతరాయంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, కొనుగోలుదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారి సంఖ్య కూడా అధికమైంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ (Tata Motors) దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి తమ ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎస్యూవీల ఉత్పత్తిని పెంచనున్నట్లు ధృవీకరించింది.

టాటా మోటార్స్ నుండి ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటిది టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) సెడాన్ కాగా, రెండవది టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) ఎస్యూవీ. ఈ రెండింటికీ తోడుగా కంపెనీ కేవలం ఫ్లీట్ ఆపరేటర్ల కోసం మాత్రమే టాటా ఎక్స్ప్రెస్-టి (Tata Xpress-T) ఎలక్ట్రిక్ కారును కూడా విక్రయిస్తోంది (ఇది టిగోర్ ఈవీ యొక్క టాక్సీ వెర్షన్).

టాటా మోటార్స్ ప్రతి నెలా తమ ఈవీ లైనప్ కోసం సగటున 5,500 నుండి 6,000 బుకింగ్లను స్వీకరిస్తోంది. అయితే, ఈ బుకింగ్ల సంఖ్య ప్రస్తుతం టాటా మోటార్స్ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య కన్నాదాదాపు రెట్టింపుగా ఉంటోంది. టాటా మోటార్స్ ప్రతి నెలా సగటున 3,300 నుండి 3,400 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. అయితే, వీటికి డిమాండ్ మాత్రం ఉత్పత్తి కన్నా రెట్టింపు సంఖ్యలో ఉండటంతో వీటి వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటోంది. సాంప్రదాయ వాహనాలతో పోలిస్తే, ఈవీలు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుండటంతో కస్టమర్లు కూడా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) గురించి క్లుప్తంగా..
భారత మార్కెట్లో టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవీని మూడు వేరియంట్లలో (XM, XZ+, XZ+ Lux) విక్రయిస్తోంది. వీటితో పాటుగా కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త డార్క్ ఎడిషన్ (Dark Edition) ను కూడా విడుదల చేసింది. ఈ డార్క్ కూడా రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొత్తంగా నెక్సాన్ ఈవీ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ.14.54 లక్షల నుండి రూ.17.15 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉంటాయి.

టాటా నెక్సాన్ ఈవీలో 30.2 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 127.23 బిహెచ్పి గరిష్ట పవర్ మరియు 245 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేసే 3 ఫేజ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ను ఉపయోగించారు. ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఆప్షన్ తో కూడిన టాటా నెక్సాన్ ఈవీ కేవలం 9.14 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారును 25 kW ఫాస్ట్ డిసి ఛార్జింగ్ సాయంతో కేవలం ఒక గంటలోనే 0 నుండి 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ 3.3 kW ఏసి ఛార్జింగ్ను కూడా సపోర్ట్ చేస్తుంది.

టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) గురించి క్లుప్తంగా..
టాటా టిగోర్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. వీటిలో XE, XM, XZ+ మరియు XZ+ DT వేరియంట్లు ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీని తయారు చేసిన పాపులర్ జిప్ట్రాన్ (Ziptron) ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ కొత్త అప్డేటెడ్ టాటా టిగోర్ ఈవీని కంపెనీ తయారు చేసింది. ఈ టెక్నాలజీ కారణంగా దీని రేంజ్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ మునుపటి కన్నా అనేక రెట్లు మెరుగ్గా ఉంటాయి. మార్కెట్లో టిగోర్ ఈవీ ధరలు రూ.12.24 లక్షల నుండి రూ.13.39 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉన్నాయి.

గతంలో ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జ్పై 90 నుండి 100 కిమీ రేంజ్ ని మాత్రమే ఆఫర్ చేసేది. అయితే, ఇప్పుడు ఇందులో జిప్ట్రాన్ టెక్నాలజీని ఉపయోగించిన కారణంగా, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కిమీ రేంజ్ను (స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్ వద్ద ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో IP67 రేటెడ్ 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 55 kW శక్తిని మరియు 170 ఎన్ఎమ్ ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications








