వచ్చే ఏడాదిలో 80,000 టాటా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి! కొత్త వాహనాల తయారీ కోసం భారీ పెట్టుబడులు!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ మరియు విక్రయాలలో అగ్రగామిగా ఉన్న దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors), రానున్న రోజుల్లో తన మార్కెట్ లీడర్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ వచ్చే ఏడాదిలో ఏకంగా 80,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అవి: టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) మరియు టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV). ఇవి కాకుండా, ప్యాసింజర్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో, కంపెనీ టాటా టిగోర్ ఈవీ ఆధారిత టాటా ఎక్స్ప్రెస్-టి ఈవీ (Tata XPress-T EV)ని కూడా విక్రయిస్తోంది.

రాయిటర్స్ మీడియా నివేదిక ప్రకారం, టాటా మోటార్స్ వచ్చే ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) వార్షిక ఉత్పత్తిని 80,000 యూనిట్లకు పెంచుతుందని భావిస్తున్నారు. అంతకు ముందు సవంత్సరంతో పోలిస్తే, కంపెనీ గత ఏడాది భారత మార్కెట్లో మొత్తం 19,000 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఈ ఉత్పత్తి పెంపు గురించి వ్యాఖ్యానించేందుకు భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థలలో ఒకటైన టాటా మోటార్స్ నిరాకరించినప్పటికీ, టాటా ఈవీలకు సరఫరాకు మించిన డిమాండ్ ఉండటంతో ఈవీ విక్రయాలు వేగంగా పుంజుకుంటున్నాయని మాత్రం పేర్కొంది.

ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు చాలా వేగంగా ఉండటంతో, దాదాపు దేశంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసేందుకు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈవీ మార్కెట్లో పోటీ తారాస్థాయికి చేరుకునే లోపే, ఈ విభాగంలో తనదైన బ్రాండ్ ఇమేజ్ను ఏర్పాటు చేసుకోవాలని టాటా మోటార్స్ చూస్తోంది. టాటా మోటార్స్ వచ్చే 2026 నాటికి 10 ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు గడచిన మార్చచి నెలలో ప్రకటించిన సంగతి తెలిసినదే.

టాటా మోటార్స్ ఇప్పటికే టాటా కర్వ్ (Tata Curve) మరియు టాటా అవిన్య (Tata Avinya) రెండు కాన్సెప్ట్ వాహనాలను ఆవిష్కరించింది. ఈ రెండింటిలో ముందుగా టాటా కర్వ్ క్రాసోవర్ మార్కెట్లోకి రానుంది. ఆ తర్వాత 2023 నాటికి టాటా అవిన్య లగ్జరీ ఎమ్పివి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం, టాటా మోటార్స్ భారతదేశ ఈవీ అమ్మకాలలో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉంది. దేశం యొక్క మొత్తం వార్షిక వాహనాల అమ్మకాలతో (దాదాపు 3 మిలియన్ వాహనాలతో) పోలిస్తే, ఇది 1 శాతం మాత్రమే. అయినప్పటికీ, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, కొత్త వాహనాల నిర్మాణం, సంబంధిత సాంకేతికత మరియు మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం టాటా మోటార్స్ సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. తాజాగా, తమ మూడవ తరం ఈవీ (Gen 3 EV)ల కోసం ప్యూర్ ఈవీ (Pure EV) ఆర్కిటెక్చర్ అనే అధునాతన ప్లాట్ఫారమ్పై నిర్మించిన మొదటి కారు టాటా అవిన్య ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ప్లాట్ఫామ్ పై తయారయ్యే సరికొత్త కార్లు కేవలం భారత మార్కెట్లోనే కాకుండా గ్లోబల్ మార్కెట్లలో కూడా విడుదల చేయబడతాయి.

కొత్త ప్లాట్ఫారమ్ గత సంవత్సరం ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPG నుండి 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో టాటా యొక్క మూడవ దశ విద్యుదీకరణ ప్రణాళికల (థర్డ్ స్టేజ్ ఎలక్ట్రిఫికేషన్ ప్లాన్స్)ను సూచిస్తుంది. మొదటి దశలో ప్యాసింజర్ సెగ్మెంట్లో రెండు ఈవీలు (నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ) మరియు ఫ్లీట్ కోసం మరొక మోడల్ను ప్రారంభించడం. ఇది ఇప్పటికే కంపెనీ విక్రయిస్తున్న దహన (IC) ఇంజన్ ప్లాట్ఫారమ్ను ఉపయోగించి నిర్మించబడుతోంది. కాగా, రెండవ దశలో పెద్ద బ్యాటరీలు మరియు ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ తో కూడిన ఈవీలను ఉత్పత్తి చేయడానికి దహన ఇంజన్ ప్లాట్ఫారమ్ను సవరించాలని కంపనీ యోచిస్తోంది. అంటే, టాటా మోటార్స్ నుండి రాబోయే లాంగ్ రేంజ్ నెక్సాన్ ఈవీ లాంటి వాహనాలు అన్నమాట.

ఇక మూడవ దశలో కంపెనీ పూర్తిగా ఈవీ ప్లాట్ఫామ్ పైనే వాహనాలను తయారు చేయనుంది. ఈ అధునాతన కార్లు మార్కెట్లోకి రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టవచ్చని అంచనా. ఇదిలా ఉంటే, టాటా గ్రూపుకు చెందిన ఎలక్ట్రిక్ యుటిలిటీ కంపెనీ టాటా పవర్ మహారాష్ట్రలోని తమ సభ్యుల డెవలపర్ ప్రాపర్టీలలో 5,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయడానికి నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO)తో కంపెనీ అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నట్లు తెలిపింది.

ముంబైలో జరిగిన రియల్ ఎస్టేట్ ఫోరమ్, 2022లో మహారాష్ట్ర పర్యాటక, పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేసినట్లు టాటా పవర్ తెలిపింది. ఈ ఛార్జర్లు ప్రాంగణ స్వభావాన్ని బట్టి పబ్లిక్/సెమీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లుగా అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా టాటా పవర్ యొక్క CEO మరియు MD ప్రవీర్ సిన్హా మాట్లాడుతూ, "రాష్ట్రవ్యాప్తంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణను వేగవంతం చేయడానికి టాటా పవర్ మరియు NAREDCO సహకారాన్ని ప్రారంభించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము" అని అన్నారు.


Click it and Unblock the Notifications








