భారత మార్కెట్లో విడుదల కాబోతున్న టాప్ 5 డీజిల్ కార్లు, ఇంజన్ వివరాలు!
ఒకప్పుడు భారతదేశంలో పెట్రోల్ కార్ల కన్నా డీజిల్ కార్లే అత్యధికంగా అమ్ముడయ్యేవి. పెట్రోల్ కార్లతో పోలిస్తే, డీజిల్ కార్ల ధరలు అధికంగా ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇందుకు ప్రధాన కారణం అవి పెట్రోల్ కార్ల కన్నా ఎక్కువ మైలేజీని అందించడం మరోవైపు పెట్రోల్ ఇంధనంతో పోల్చుకుంటే, డీజిల్ ఇంధనం ధరలు తక్కువగా ఉండటం. అయితే, భారతదేశంలో ఎప్పుడైతే కొత్త బిఎస్6 ఉద్గార నిబంధనలను ప్రవేశపెట్టారో, అప్పటి నుండి సీన్ రివర్స్ అయింది.

దేశంలో వాహన కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం కొత్త బిఎస్6 ఉద్గార నిబంధనలు ప్రవేశపెట్టింది. దీంతో కార్ల తయారీ సంస్థలు మెల్లిమెల్లిగా డీజిల్ కార్ల తయారీని తగ్గిస్తూ వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం, కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా డీజిల్ కార్లను తయారు చేయడం మరింత ఖరీదైన పనిగా మారింది. మారుతి సుజుకి, ఫోక్స్వ్యాగన్ మరియు స్కోడా లాంటి కంపెనీలు డీజిల్ కార్ల తయారీకి పూర్తిగా స్వస్తి పలికాయి. ప్రస్తుతం, కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే తయారు చేస్తున్నాయి.

ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ, దేశంలోని కొన్ని కంపెనీలు ఇంకా డీజిల్ కార్లను తయారు చేస్తూనే ఉన్నాయి మరియు ఇప్పటికీ డీజిల్ కార్లను కోరుకునే కస్టమర్లు అలాంటి తయారీదారులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని కంపెనీలు తమ పెద్ద కార్లలో కేవలం డీజిల్ ఇంజన్లనే ఉపయోగిస్తున్నాయి. మరి ఈనాటి కథనంలో, మనదేశంలో విడుదల కాబోయే టాప్ 5 కొత్త డీజిల్ కార్లకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

1. టొయోటా హైలక్స్ (Toyota Hilux)
జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో టొయోటా హైలక్స్ కూడా ఒకటి. ఇదొక పికప్ ట్రక్కు, అయితే ఇది వాణిజ్య ప్రయోజనం కన్నా కూడా లైఫ్ స్టైల్ యుటిలిటీ వెహికల్ విభాగంలో ప్రవేశపెట్టబడిన ప్రీమియం మోడల్. టొయోటా హిలక్స్ పికప్ ట్రక్కును కంపెనీ ఈ ఏడాది జనవరి 20న భారతదేశంలో ఆవిష్కరించబడింది. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో ఉండొచ్చని అంచనా.

టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు విషయానికి వస్తే, కంపెనీ ఇందులో శక్తివంతమైన 2.8 లీటర్ డి-4డి టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ను ఉపయోగించింది. ఈ ఇంజన్ 201 బిహెచ్పి పవర్ ను మరియు 500 న్యూటన్ మీటర్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. టొయోటా హైలక్స్ భారతదేశంలో 4X4 డ్రైవ్ట్రెయిన్లో అందుబాటులోకి రానుంది. ఇది ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లను కలగి ఉంటుంది. ఇది ఈ విభాగంలో ఇసుజు వి-క్రాస్ వంటి పిక్-అప్ మోడళ్లతో పోటీపడుతుంది.

2. జీప్ మెరిడియన్ (Jeep Meridian)
అమెరికన్ ఐకానిక్ యుటిలిటీ వెహికల్ బ్రాండ్ జీప్ నుండి రాబోయే సరికొత్త 7-సీటర్ ఎస్యూవీ జీప్ మెరిడియన్. సమాచారం ప్రకారం, జీప్ ఇండియా ఈ ఏడాది మేలో తమ జీప్ మెరిడియన్ ప్రీమియం ఎస్యూవీని భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. జీప్ మెరిడియన్ ను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న 5-సీటర్ జీప్ కంపాస్ ఆధారంగా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇది జీప్ కంపాస్ మాదిరిగానే అదే డీజిల్ ఇంజన్ మరియు గేర్బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఇంజన్ విషయానికి వస్తే, జీప్ మెరిడియన్ ఎస్యూవీలో కూడా జీప్ కంపాస్ ఎస్యూవీలో ఉపయోగించిన అదే 2.0-లీటర్ మల్టీ-జెట్ డీజిల్ ఇంజన్ నే ఉపయోగించనున్నారు. కంపాస్ లోని ఈ ఇంజన్ 173 బిహెచ్పి పవర్ ను మరియు 350 న్యూటన్ మీటర్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. జీప్ మెరిడియన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారు పెట్రోల్ ఇంజన్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్తో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

3. 2022 హ్యుందాయ్ క్రెటా (2022 Hyundai Creta)
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి బెస్ట్ సెల్లింగ్ మిడ్-సైజ్ ఎస్యూవీగా ఉన్న క్రెటాలో కంపెనీ ఓ కొత్త 2022 మోడల్ ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్ ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త క్రెటా ఎస్యూవీ 1.5 సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ను కలిగి ఉండనుంది.

ఈ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్పి శక్తిని మరియు 250 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్బాక్స్లతో లభ్యం కానుంది. ధర విషయానికి వస్తే, కొత్త 2022 హ్యుందాయ్ క్రెటాను కంపెనీ రూ. 11 లక్షల నుండి రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో విక్రయించే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో కియా సెల్టోస్, సుజుకి ఎస్-క్రాస్, స్కోడా కుషాక్, ఫోక్స్వ్యాగన్ టైగన్ మరియు ఎమ్జి ఆస్టర్ వంటి మోడళ్లతో పోటీపడే అవకాశం ఉంది.

4. హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson)
హ్యుందాయ్ నుండి రాబోయే మరొక కొత్త ఉత్పత్తి, అప్డేటెడ్ టూసాన్ ప్రీమియం ఎస్యూవీ. మరికొద్ది నెలల్లోనే కంపెనీ భారత మార్కెట్లో టూసాన్ యొక్క నాల్గవ తరం మోడల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కొత్త తరం హ్యుందాయ్ టూసాన్ ఎస్యూవీ పూర్తిగా సరికొత్త డిజైన్ను కలిగి ఉంటుంది. కంపెనీ ఇందులో రీఫైన్డ్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 182 బిహెచ్పి పవర్ ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు హైబ్రిడ్ పవర్ట్రెయిన్ ఆప్షన్లతో అందించబడుతుందని సమాచారం.

5. మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio)
ఎస్యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ కూడా తమ కొత్త తరం స్కార్పియో ఎస్యూవీపై గత కొంత కాలంగా పనిచేస్తోంది. ఇటీవలే ఈ కొత్త తరం మహీంద్రా స్కార్పియో యొక్క రోడ్ టెస్టింగ్ దశ కూడా ప్రారంభమైంది. ఇటీవల వెల్లడైన స్పై చిత్రాలను గమనిస్తే, కొత్త స్కార్పియో పూర్తిగా కొత్త ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొత్త డిజైన్ ఫ్రంట్ గ్రిల్, హెడ్ల్యాంప్స్ మరియు సైడ్ ప్యానెల్స్ మొదలైనవి ఉన్నాయి.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త స్కార్పియోలో కంపెనీ ఓ పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను అందించనుంది. ఇంకా ఇందులో నిలువుగా ఉండే ఏసి వెంట్స్ మరియు ఎక్స్యూవీ700 లో ఉపయోగించిన కొన్ని ఫీచర్లను కూడా ఆశించవచ్చు. ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 2.2 లీటర్ ఎమ్హాక్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 155 బిహెచ్పి పవర్ ను మరియు 360 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎంపిక చేసిన వేరియంట్లలో ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా లభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








