టొయోటా ఇన్నోవా డీజిల్ వెర్షన్ డిస్కంటిన్యూ అయిందా? ఉద్గార పరీక్షల్లో విఫలమైనందుకేనా!?
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటా (Toyota) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎమ్పివి ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) లో డీజిల్ వెర్షన్ను కంపెనీ డిస్కంటిన్యూ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా, టొయోటా ఇన్నోవా డీజిల్ వేరియంట్ల కోసం బుకింగ్లు కూడా నిలిపివేయబడ్డాయి.
Recommended Video
అసలు టొయోటా ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో తెలుసుకుందా రండి.

ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఉన్న టొయోటా డీలర్షిప్లు మరియు ఆన్లైన్లో కూడా టొయోటా ఇన్నోవా డీజిల్ కోసం బుకింగ్లను స్వీకరించడాన్ని నిలిపివేయడం జరిగింది. అధిక డిమాండ్ కారణంగా ఇన్నోవా డీజిల్ బుకింగ్లను తాత్కాలికంగా మాత్రమే నిలిపివేసినట్లు టొయోటా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, టొయోటా ఇన్నోవా డీజిల్ కాలుష్య ఉద్గార పరీక్షల్లో విఫలమైనందునే తాత్కాలికంగా నిలిపివేయబడిందని పేర్కొంటూ కొత్త నివేదికలు వెలువడ్డాయి.

భారతీయులు అత్యధికంగా ఇష్టపడే ఎమ్పివిలో టొయోటా ఇన్నోవా అగ్రస్థానంలో ఉంటుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. టాక్సీ ఆపరేటర్ల నుండి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖల వరకూ అందరూ మెచ్చిన ప్రీమియం ఎమ్పివి ఇది. టొయోటా ఇన్నోవా మొదటిసారిగా 2005లో భారతదేశంలో ప్రారంభించబడింది. అప్పటి నుండి ఇది భారతదేశంలో లక్షలాధి కుటుంబాలకు చేరువైంది. టొయోటా బ్రాండ్ పట్ల విశ్వసనీయత మరియు ఇన్నోవా అందించిన కంఫర్ట్తో ఇది దేశంలో ఇప్పటికీ తిరుగులేని ఎమ్పివిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

భారతదేశంలో గో-టు మల్టీ యుటిలిటి వెహికల్ అయిన టొయోటా ఇన్నోవా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, భారతదేశంలోని టొయోటా డీలర్షిప్లు ఇందులో డీజిల్ వేరియంట్ల కోసం బుకింగ్లు తీసుకోవడం ఆపివేసాయి. టొయోటా ఇన్నోవా పెట్రోల్ ఇంజన్తో కూడా లభిస్తున్నప్పటికీ, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నవి మాత్రం డీజిల్ వేరియంట్లే. ఈ నేపథ్యంలో, టొయోటా అకస్మాత్తుగా ఇన్నోవా డీజిల్ వేరియంట్ల అమ్మకాలను నిలిపివేయడం ఆటో పరిశ్రమను మరియు కస్టమర్లను షాక్ కు గురయ్యేలా చేసింది.

ఇదే విషయంపై టొయోటా జారీ చేసిన వివరణలో, "ఇన్నోవా క్రిస్టా యొక్క డీజిల్ వేరియంట్ల కోసం చాలా ఎక్కువ డిమాండ్ ఉంటోంది, ఫలితంగా వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో, పెండింగ్ ఆర్డర్లను క్లియర్ చేసే వరకూ డీజిల్ వేరియంట్ కోసం కొత్త ఆర్డర్లను తీసుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. అయితే, టొయోటా ఇన్నోవా క్రిస్టా యొక్క పెట్రోల్ వేరియంట్ కోసం ఆర్డర్లు తీసుకోవడం మాత్రం కొనసాగుతుంది" అని పేర్కొంది.

కానీ, తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, ఇన్నోవా డీజిల్ వేరియంట్ల ఉత్పత్తిని మరొక కారణం వల్ల తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. డీజిల్ ఇంజన్ తో నడిచే టొయోటా ఇన్నోవా క్రిస్టా ఇటీవలి COP (కన్ఫార్మిటీ ఆఫ్ ప్రొడక్షన్) రౌండ్ పరీక్షల్లో విఫలమైందని నివేదికలు వస్తున్నాయి. ఇవి ఆటోమేకర్లు తయారు చేసే వాహనాలు ఆమోదయోగ్యమైన ఉద్గార స్థాయిలు మరియు హోమోలోగేషన్కు కట్టుబడి ఉన్నాయో లేదో ధృవీకరించడానికి ICAT లేదా ARAI ద్వారా నిర్వహించబడే పరీక్షలు.

ప్రస్తుతానికి ఇవి ఊహాగానాలు మరియు పుకార్లు మాత్రమే. అయితే, టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా మాత్రం ఈ పుకార్లను ఖండించలేదు అలాగని ఇదే విషయాన్ని అంగీరిస్తున్నట్లు ధృవీకరించలేదు. ఏదేమైనప్పటికీ, టొయోటా డీజిల్ వేరియంట్ల కోసం ఉన్న అధిక డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటే, కంపెనీ ఈ డీజిల్ ఇంజన్ను డిస్కంటిన్యూ చేసే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ టొయోటా తిరిగి తమ డీజిల్ ఇన్నోవా కోసం బుకింగ్ లను ప్రారంభించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, టొయోటా ఇన్నోవా డీజిల్ వేరియంట్ల బుకింగ్ లను నిలిపివేసిన నేపథ్యంలో, దాని పెట్రోల్ వేరియంట్ల అమ్మకాలను పెంచుకునేందుకు మరియు కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు టొయోటా ఇన్నోవా క్రిస్టాలో కంపెనీ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. స్టాండర్డ్ మోడల్తో పోల్చుకుంటే ఇది అదనపు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్గ్రేడ్ లను కలిగి ఉంటుంది. అయితే, ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్తో మాత్రమే లభిస్తుంది. రానున్న పండుగ సీజన్ లో లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

డీలర్షిప్ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం, కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 17.45 లక్షలు కాగా మరియు పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 19.02 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ గతంలో డీలర్ స్థాయిలో అదనపు ధర వద్ద అందుబాటులో ఉండే కొన్ని ప్రీమియం యాక్ససరీలను కేవలం GX వేరియంట్ ధరకే కలిగి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్లలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ మరియు హెడ్స్-అప్ డిస్ప్లేలు ఉన్నాయి. డీలర్ల ప్రకారం, ఈ అదనపు ఫీచర్లను కస్టమర్లు విడిగా కొనుగోలు చేయాలంటే, సుమారు రూ. 55,000 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








