ఆగస్టు 22న కార్ల వినియోగదారులకు తీపి కబురు.. ఇకపై దేశంలోనే కార్లకు సేఫ్టీ రేటింగ్!!
కొత్త కారు కొనుగోలు చేసే ముందు కస్టమర్లు ముందుగా ఆలోచించేది అందులో భద్రతా ఫీచర్ల గురించి. ఆ కారు తమకు ఎంత భద్రతనిస్తుందనే విషయం నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకుంటారు. కారు పనితీరు, భద్రత ఆధారంగా ఇప్పటివరకు గ్లోబల్ NCAP ద్వారా 1 నుంచి 5 వరకు రేటింగ్ ఇచ్చేవారు.
ఈ రేటింగ్ ఆధారంగా కస్టమర్లు కారు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఆటోమేకర్లు తమ కార్లను క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ NCAP టెస్ట్ కోసం విదేశాలకు పంపించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్వదేశంలోనే క్రాష్ టెస్ట్ చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..

కార్ల భద్రతా రేటింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం రేపటి (ఆగస్టు 22) నుంచి భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP)ని అమలు చేయనుంది. కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత్ NCAPని అధికారికంగా ప్రారంభించనున్నారు.
3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న దేశ, విదేశాల్లో ఉత్పత్తి అయ్యే పెట్రోల్, డీజిల్ సీఎన్జీ, ఎలక్ట్రిక్ పవర్డ్ వాహనాలను పరీక్షించనున్నట్లు సమాచారం. భారత్ NCAP కింద, వాహన తయారీ కంపెనీలు స్వచ్ఛందంగా తమ కార్లను పరీక్షించుకోవచ్చని రవాణా మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

టెస్ట్ లో కారు పనితీరు ఆధారంగా, గ్లోబల్ NCAP కేటగిరీలో పెద్దల రక్షణ కేటగిరీ, పిల్లల రక్షణ విభాగంలో స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం, భారత్ NCAP ఇచ్చే సేఫ్టీ రేటింగ్ ఆధారంగా కస్టమర్లు తమకు ఏ కారు సరిపోతుందో నిర్ణయించుకోవచ్చు. గ్లోబల్ NCAP మాదిరిగానే, భారత్ NCAP క్రాష్ టెస్ట్ ద్వారా వాహన తయారీదారులు తమ కార్లను స్వచ్ఛందంగా టెస్ట్ చేసుకోవచ్చు.
రానున్న రోజుల్లో అన్ని కార్లకు భారత్ NCAPక్రాష్ టెస్ట్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసే అవకాశం ఉంది. భారత్ NCAP టెస్ట్ నిబంధనలు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ ప్రొటోకాల్లకు దాదాపు సమానంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం గతంలో వెల్లడించింది. అందుకు అనుగుణంగా క్రాష్ టెస్ట్ అనంతరం, 1-5 స్టార్ రేటింగ్ ఇస్తారు.

కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనున్న భారత్ ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, టయోటా, స్కోడా, కియా, మహీంద్రా వంటి సంస్థలు స్వాగతించాయి. గ్లోబల్ NCAP ద్వారా కార్ల భద్రతలో టాప్ 5 రేటింగ్ పొందిన టాటా మోటార్స్, స్కోడా, మహీంద్రా కంపెనీ మరియు 1 - 2 స్టార్ రేటింగ్ పొందిన మారుతీ సుజుకీ అంగీకరించడం శుభపరిణామం.

ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారతదేశంలో, భద్రతా కారణాల దృష్ట్యా కస్టమర్లు తమకు నచ్చిన కారును ఎంచుకోవడానికి భారత్ NCAP దోహదపడుతుంది. తమ కార్ల గురించి కస్టమర్లలో మరింత నమ్మకాన్ని సాధించడానికి, సేల్స్ రెట్టింపు చేసుకోవడానికి స్వదేశీ మరియు విదేశాలకు చెందిన ప్రధాన కంపెనీలు స్వచ్ఛందంగా భారత్ NCAP పరీక్ష చేయించుకోవచ్చు.

రేపటి నుంచి భారత్ NCAP అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరీక్ష అన్ని వాహనాలను తప్పనిసరి అయ్యేంత వరకు చాలా మంది కార్ల తయారీదారులు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని కంపెనీలు మాత్రమే ఇప్పటివరకు 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్నాయి. మొత్తం మీద, వాహన భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








