కార్ల సేఫ్టీపై కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కార్లకు కొత్త రూల్స్..
కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు సేఫ్టీ ఫీచర్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో కార్ల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. అక్టోబర్ 1 నుంచి, ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. మరి ఆ సిస్టమ్ ఏంటి.. అది ఎలా పనిచేస్తుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
దేశంలో కార్ల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు భారత ప్రభుత్వం భారత్ ఎన్క్యాప్ (Bharat- NCAP - భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్)ను ప్రవేశపెట్టనుంది. ఇది దేశంలోని కార్లకు సేఫ్టీ రేటింగ్ ఇవ్వనుంది. ఈ సిస్టమ్ ద్వారా ప్రస్తుత కార్ల కంటే భవిష్యత్తులో రానున్న కార్లు మరిన్ని భద్రతా ప్రమాణాలతో రానున్నాయి. భారత్ NCAP అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

భారత్ NCAP అమల్లోకి వస్తే కొత్త కారు కొనుగోలుదారులు తమ భద్రత గురించి మరింత అవగాహన కలిగి ఉండే అవకాశం ఉంది. భద్రతకు సంబంధించి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్ NCAP నిబంధనలు రూపొందించబడ్డాయి. వీటిలో పెద్దలు, పిల్లల రక్షణ, పాదచారులకు అనుకూలమైన డిజైన్, కారు సేఫ్టీ ఫీచర్స్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
భారత్ NCAP టెస్ట్ నిబంధనలు గ్లోబల్ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్ మాదిరిగానే ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్లోబల్ NCAP మాదిరిగానే వాహనాల్లో భద్రతా ప్రమాణాలను పరీక్షించి 1 నుంచి 5 స్టార్ రేటింగ్ను ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. క్రాష్ టెస్ట్, సేఫ్టీ రేటింగ్లు AIS-197 కి లోబడి ఉంటాయి.

ఆటోమేకర్లు తమ కార్ల కోసం స్వచ్ఛందంగా భారత్ NCAP పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతే కాకుండా, టెస్టింగ్ ఏజెన్సీకి కార్ మోడల్ను షోరూమ్ల నుంచి టెస్టింగ్ కోసం పంపించే వెసులుబాటు ఉంది. దేశీయ, విదేశీ తయారీ పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రైవర్ సీటుతో సహా 8 సీట్లు, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న కార్లు భారత్ NCAP పరీక్ష చేయించుకోవాలి.
టాటా మోటార్స్, మారుతీ సుజుకి, టయోటా, స్కోడా, కియా, మహీంద్రాతో సహా కంపెనీలు భారత్ NCAPని స్వాగతించాయి. భారత్ NCAP అమల్లోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చే స్టార్ రేటింగ్ ద్వారా వినియోగదారులు ఎలాంటి భయం లేకుండా తమకు నచ్చిన కారును కొనుగోలు చేసుకోవచ్చు. ఇక వినియోగదారులు భారత్ NCAP స్టార్ రేటెడ్ కార్లను చూడాలంటే మరి కొన్ని నెలలు వేచిచూడాల్సిందే.

భారత్ NCAP ద్వారా దేశంలో కార్ల తయారీదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రోగ్రామ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇకపై గ్లోబల్ NCAP వంటి విదేశీ సంస్థలకు వాహనాన్ని భద్రతా పరీక్ష కోసం పంపాల్సిన అవసరం లేదు. ఈ సిస్టమ్ ద్వారా కార్ల కంపెనీల ఉత్పత్తులను మరింత సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఈ నేపథ్యంలో మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీకి చెందిన వేలుసామి భారత్ NCAP పై స్పందించారు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని.. NCAPను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. XUV300, Scorpio N మరియు XUV700 వంటి మహీంద్రా ఫ్లాగ్షిప్ కార్లు భద్రత పరంగా గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ రేటింగ్ను పొందాయి.

ఇదిలా ఉండగా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లలో మారుతి సుజుకికి చెందిన అనేక కార్లు చాలా తక్కువ భద్రతా రేటింగ్లను పొందాయి. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకి సైతం భారత్ NCAP క్రాష్ టెస్ట్లను స్వాగతించింది. అదేవిధంగా, ప్రస్తుతం మారుతీ సుజుకీతో కలిసి పనిచేస్తున్న టయోటా సైతం భారత్ NCAP క్రాష్ టెస్ట్లను అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications








