కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా... న్యూ ఇయర్ ముందే కొనుగోలు చేసుకోండి.. లేకుంటే!
ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. కొత్త సంవత్సరం నుంచి కార్ల ధరలను (car prices hike) పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు మారుతి సుజుకి ఇప్పటికే వెల్లడించింది. ఇదే బాటలో టాటా, మహీంద్రా సంస్థలు కూడా కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపాయి. పెరిగిన ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎస్ఈ ఫైలింగ్కు తెలిపింది.
అధిక ద్రవ్యోల్బణం సహా పెరిగిన వ్యయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి సుజుకి (Maruti Suzuki) సంస్థ వెల్లడించింది. సాధ్యమైనంత వరకు వ్యయాలను తగ్గించుకొనేందుకు ప్రయత్నించడం ద్వారా కొనుగోలుదారులపై భారాన్ని తగ్గించాలనుకుంటున్నాం. అయినా కొంత భారాన్ని వినియోగదారులపై మోపాల్సి వస్తోందని మారుతి సుజుకి సంస్థ తెలిపింది.

మారుతి సుజుకి సంస్థ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ల నుంచి ఇన్విక్టో వరకు అనేక రకాల కార్లను ఈ అందిస్తోంది. ఈ కార్ల ధరలు రూ.3.54 లక్షల నుంచి రూ.28.52 లక్షల (ఎక్స్షోరూం) వరకు ఉన్నాయి. అయితే కచ్చితంగా ఎంత శాతం పెంచుతున్నారనే దానిపై మారుతి సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి సంస్థ 0.8 శాతం ధరలను పెంచింది. అదే గత ఆర్థిక సంవత్సరం మారుతి సంస్థ 2.4 శాతం ధరలను పెంచింది. మరో ప్రముఖ సంస్థ ఆడి సైతం ఇదే తరహా ప్రకటన చేసింది. 2024 జనవరి నుంచి భారత్లో తమ వాహనాల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు సంస్థ సోమవారం ప్రకటన చేసింది. ఇన్పుట్, నిర్వహణ ఖర్చుల కారణంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

టాటా మోటార్స్ సంస్థ (Tata Motors) కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. జనవరి నుంచి ప్రయాణికులు, విద్యుత్ వాహనాల ధరలను పెంచే ఆలోచన ఉందని, అయితే త్వరలో దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని పేర్కొంది. టాటా సంస్థ హ్యాచ్బ్యాక్ టియాగో నుంచి ఎస్యూవీ సఫారీ వరకు ఎన్నో వాహనాలను విక్రయిస్తోంది.
మహీంద్రా సంస్థ కూడా ధరల పెంపుపై ప్రకటన చేసింది. ద్రోవ్యోల్బణం సహా ఇతర కారణాలతో వాహనాల ధరలను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని సంస్థ ప్రకటన చేసింది. మెర్సిడెస్ సంస్థ కూడా ధరల పెంచు ఆలోచన ఉందని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని వెల్లడించింది. ధరల పెంపుపై మిగిలిన కార్ల తయారీ సంస్థలు ఎటువంటి ప్రకటన చేయలేదు.
కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ధరల పెంపు ప్రకటన వెలువడే ముందే వాహనాలను కొనుగోలు చేయడం వల్ల నగదు ఆదా చేసుకోవచ్చు. అయితే ఏయే సెగ్మెంట్లలో ధరల పెంపు ఉంటుందనే అంశంపై కార్ల తయారీ సంస్థలు స్పష్టత ఇవ్వలేదు. డిసెంబర్లో వాహనాల ధరల పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








