సేల్స్లో హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. ఆ కారుకు ఏకంగా లక్ష బుకింగ్లు, విజయ రహస్యం అదే.!!
భారత మార్కెట్లో ప్రముఖ కార్ల కంపెనీగా హ్యుందాయ్ మోటార్ ఇండియా పేరు గాంచింది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందుబాటులో ఉంటున్నాయి. అందుకే కస్టమర్లలో ఆదరణ పొందుతూ సేల్స్లో ప్రతి ఏటా హ్యుందాయ్ బ్రాండ్ కార్లు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది హ్యుందాయ్ రికార్డు స్థాయిలో విజయాలను సాధించింది.
ఈ ఏడాది హ్యుందాయ్ మార్కెట్కు సంబంధించి గణాంకాలను సంస్థ ప్రకటించింది. భారత మార్కెట్లో ఈ సంవత్సరం(2023) హ్యుందాయ్ మోటార్స్ ఆరు లక్షల యూనిట్ల కార్లను విక్రయించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. కాగా గతేడాది(2023) హ్యుందాయ్ మోటార్స్ 5.5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించగా.. ఈ సారి అంతకంటే ఎక్కువ సంఖ్యలో సేల్స్ను నమోదు చేసింది.

హ్యుందాయ్ కార్లకు కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో సంస్థ కార్ల తయారీ సామర్థ్యాన్ని పెంచింది. ఈ క్రమంలో తమిళనాడులో 50 వేల నుంచి ఏకంగా 8,20,000 యూనిట్లను తయారు చేసింది. ఈ ఏడాది భారత మార్కెట్లో హ్యుందాయ్.. ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు, ఎక్స్టర్ సబ్-కాంపాక్ట్ SUV ని విడుదల చేయడమే.. తమిళనాడులో ఉత్పత్తిని పెంచడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
అంతేకాకుండా హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెన్యూ (Hyundai Venue), క్రెటా (Hyundai Creta), అప్డేటెడ్ వెర్నా (New Verna) SUVలు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతుండటంతో ఈ స్థాయి విజయం సాధ్యమైనట్లుగా సంస్థ భావిస్తోంది. దీంతో పాటు ఇటీవల జూన్లో టాటా పంచ్కు పోటీగా ప్రవేశపెట్టిన Hyundai Exter కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్ను ఏర్పరుచుకుంది. ఈ కారు లక్షకు పైగా ఆర్డర్లను పొందింది.

హ్యుందాయ్ ఈ ఏడాది 6 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడానికి ఇది కూడా కారణంగా చెప్పుకోవచ్చు. హ్యుందాయ్ సంస్థకు చెందిన కార్లను చూడగానే ఆకట్టుకునే డిజైన్తో అద్భుతంగా రూపొందించారు. అంతే కాకుండా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లోనూ స్టార్ రేటింగ్ను సాధించింది. అడల్ట్, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలోనూ భేష్ అని నిరూపించుకుంది. సేఫ్టీ ఫీచర్ల విషయంలో తగ్గేదే లేదు అన్న విధంగా ప్రయాణికులకు భద్రత కల్పిస్తోంది.
భారత మార్కెట్లో హ్యుందాయ్ Exter వేరియంట్ల ప్రకారం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. ఈ కారును EX, S, SX, SX(O), మరియు SX(O) Connect అనే 5 వేరియంట్లలో ప్రవేశపెట్టింది. కస్టమర్లు హ్యుందాయ్ ఎక్స్టర్ను పెట్రోల్ మరియు CNG ఇంజిన్ ఆప్షన్లతో కూడా కొనుగోలు చేయవచ్చు.

హ్యుందాయ్ ఎక్స్టర్ పెట్రోల్ వేరియంట్ 19.2 kmpl మైలేజ్ను ఇస్తుంది. ఇక CNG వేరియంట్ అయితే 27.1 km/kg ఫ్యూయెల్ కెపాసిటీని కలిగి ఉంది. ఇందులో 8-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో ఆండ్రాయిడ్ ఆటో, ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లతో పాటు ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగులను పొందుపరిచారు.
ఇక హ్యుందాయ్ వెర్నా సెడాన్ను రూ. 10.96 లక్షల నుండి రూ. 17.38 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో సంస్థ విక్రయాలు చేస్తోంది. ఇది పెట్రోల్ ఇంజన్, మాన్యువల్/ ఆటోమేటిక్ గేర్బాక్స్తో కొనుగోలు చేయవచ్చు. మైలేజ్ విషయానికొస్తే ఈ కారు 18.6 - 20.6 kmpl మైలేజ్ను ఇస్తుంది.

హ్యుందాయ్కు చెందిన మరో కారు వెన్యూ.. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు రూ. 7.89 లక్షల నుండి రూ. 13.48 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో కొనుగోలు చేయవచ్చు. హ్యుందాయ్ క్రెటా రూ.10.87 లక్షల నుంచి రూ. 19.20 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరతో సంస్థ ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications








