రైతులకు శుభవార్త.. మహీంద్రా నుంచి CNG ట్రాక్టర్ ఆవిష్కరణ.. డబ్బు ఆదాతో పాటు మరెన్నో లాభాలు.!!
భారత మార్కెట్లో ప్రముఖ ట్రాక్టర్ బ్రాండ్ మహీంద్రా ట్రాక్టర్స్ తన మొదటి CNG మోనో ఫ్యూయెల్ ట్రాక్టర్(CNG Mono Fuel Tractor)ను తాజాగా ఆవిష్కరించింది. నాగ్పూర్లో అగ్రి సమ్మిట్ ఆగ్రో విజన్(Agro Vision) కార్యక్రమంలో ఈ ట్రాకర్ను ఆవిష్కరించారు. ప్రముఖ యువో ట్రాక్టర్ ప్లాట్ఫారమ్పై దీనిని రూపొందించారు.
నాగ్పూర్లో ఆగ్రో విజన్ నాలుగు రోజుల శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు.. మహీంద్రా తన మొదటి CNG మోనో ఫ్యూయల్ ట్రాక్టర్ను కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆవిష్కరించింది. డీజిల్తో నడిచే వాహనాల కంటే ఈ సీఎన్జీ ట్రాక్టర్ మరింత సమర్థవంతంగా పనిచేస్తూ రైతులకు డబ్బు ఆదా చేస్తుందని ఈ సందర్భంగా మహీంద్రా సంస్థ తెలిపింది.

CNG ఆధారిత వాహనాలను అభివృద్ధి చేయడంలో మహీంద్ర(Mahindra Tractors) కీలక పాత్ర పోషించిందని సంస్థ తెలిపింది. ఆధునిక పరిజ్ఞానంతో కర్బన నియంత్రణ, పనితీరుకు ప్రాధాన్యత ఇస్తూ సీఎన్జీ ట్రాక్టర్లను అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. అంతే కాకుండా ఈ ట్రాక్టర్ను చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో అభివృద్ధి చేసి పరీక్షించినట్లు సంస్థ స్పష్టం చేసింది.
కాగా డీజిల్తో నడిచే ట్రాక్టర్లతో పోలిస్తే కొత్త మహీంద్రా CNG ట్రాక్టర్లు సమానమైన శక్తి, పనితీరును అందిస్తాయని మహీంద్రా వెల్లడించింది. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ ఇంజిన్ టెక్నాలజీలో కొత్త ప్రమాణాలను సీఎన్జీ ట్రాక్టర్లు నిర్దేశిస్తుందని తెలిపింది. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే అసాధారణమైన పర్యావరణ అనుకూలమైన కర్బన ఉద్గారాలను సీఎన్జీ ట్రాక్టర్లు 70 శాతం గణనీయంగా తగ్గిస్తాయని పేర్కొంది.
కొత్త CNG ట్రాక్టర్ పనిచేసేటప్పుడు ఇంజిన్ వైబ్రేషన్, శబ్దం కూడా తక్కువగా ఉండనుంది. డీజిల్ ట్రాక్టర్ల కంటే ఇది 3.5 డెసిబల్స్ తక్కువగా ఉంటుందని మహీంద్రా కంపెనీ తెలిపింది. తద్వారా పని గంటలు పొడిగించవచ్చని పేర్కొంది. అంతే కాకుండా ఇంజిన్ జీవితకాలం కూడా పెరుగుతుందని స్పష్టం చేసింది. మహీంద్రా సీఎన్జీ ట్రాక్టర్ మెరుగైన ఆపరేటర్ సౌకర్యాన్ని అందిస్తుండటంతో దీనిని వ్యవసాయేతర పనులకు కూడా ఉపయోగించవచ్చని పేర్కొంది.
ఇంకా మహీంద్రా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం CNG పవర్తో నడిచే మహీంద్రా ట్రాక్టర్, ఇప్పటికే ఉన్న డీజిల్ ట్రాక్టర్ల సామర్థ్యాలకు సరిపోయే విధంగా వివిధ రకాల వ్యవసాయ మరియు రవాణా అవసరాలను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. మహీంద్రా CNG ట్రాక్టర్లో నాలుగు ట్యాంకులు ఉండగా.. ఒక్కొక్కటి 45 లీటర్లు లేదా 24కిలోల గ్యాస్ ఆన్-బోర్డ్ సామర్థ్యంతో ఉంటాయి. ఇవి 200-బార్ ప్రెజర్ను కలిగి ఉంటాయి.
ఇక డబ్బు ఆదా విషయానికొస్తే.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే సీఎన్జీ ట్రాక్టర్ ద్వారా గంటకు రూ.100 ఆదా చేయవచ్చని మహీంద్రా తెలిపింది. త్వరలోభారత మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఇక మహీంద్ర ట్రాక్టర్ల విషయానికొస్తే.. దాదాపు నలభై ఏళ్లుగా భారత మార్కెట్లో ప్రసిద్ధ ట్రాక్టర్ బ్రాండ్గా పేరు గాంచింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాక్టర్ తయారీ కంపెనీ.
2019 మార్చిలో, గ్లోబల్ సేల్స్తో సహా మూడు మిలియన్ల ట్రాక్టర్ అమ్మకాలను దాటిన మొదటి భారతీయ ట్రాక్టర్ బ్రాండ్గా మహీంద్రా నిలిచింది. భారత్తో పాటు 50కి పైగా ప్రపంచ మార్కెట్ల కోసం వీటిని రూపొందిస్తోంది. కఠినమైన భూభాగాల్లో సమర్థవంతంగా పనిచేసేలా అసాధారణ క్వాలిటీతో పాటు మెరుగైన పనితీరుకు మహీంద్రా ట్రాక్టర్లు ప్రసిద్ధి చెందాయి.


Click it and Unblock the Notifications








