Maruti Suzuki: మారుతీనా మజాకా..! విదేశాలకు ఏకంగా 2.5 మిలియన్ కార్ల ఎగుమతి
మారుతి సుజుకి ఈ బ్రాండ్ కి దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సామాన్య ప్రజలు అత్యంత అమితంగా ఇష్టపడే బ్రాండ్ లలో ఒకటిగా ఈ కంపెనీ నిలిచింది. ఇప్పటికీ ఈ కార్ల కంపెనీ ఇండియాలో అధికంగా సేల్స్ సాధిస్తూ మార్కెట్ ను ఏలుతుంది. అలాగే విదేశాల్లో కూడా ఈ బ్రాండ్కు విపరీతమైన డిమాండ్ ఉందని మీకు తెలుసా.. ఆ వివరాలు మీకోసం..
మారుతి సుజుకి రికార్డు స్థాయిలో వాహనాలను విదేశాలకు ఎగుమతి చేస్తూ తాజాగా సరికొత్త మైలురాయిని చేరుకుంది. మారుతీ సుజుకి 1986-87లో మొదటిసారిగా విదేశాలకు వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించింది. అప్పుడు ఉన్న వనరుల ఆధారంగా బంగ్లాదేశ్, నేపాల్ వంటి మార్కెట్లకు వాహనాలను రవాణా చేసింది. అంటే 1987లో హంగేరీకి తొలిసారిగా 500 కార్లను ఎగుమతి చేసి రికార్డు సృష్టించింది.

ఊహించని రీతిలో ఎగుమతులు..
తాజాగా సంస్థ మొత్తం విదేశాలకు2.5 మిలియన్లకు (25 లక్షలు)కార్లను ఎగుమతి చేసి సరికొత్త రికార్డ్ ను నెలకొల్పింది. మొత్తంగా, మారుతి సుజుకి 1986-2023 మధ్య మొత్తం 25 లక్షల కార్లను ఎగుమతి చేసింది. ప్రస్తుతం మారుతీ సుజుకి తయారీదారులు తమ వివిధ కార్ మోడళ్లను లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా తో పాటు మిడిల్ ఈస్ట్తో సహా దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
ఇటీవల భారతదేశంలో విడుదలైన మారుతి సుజుకి గ్రాండ్ విటారాకు విదేశాలలో కూడా అధిక డిమాండ్ ఏర్పడింది. ఎగుమతి చేయబడిన వాహనాల జాబితాలో గ్రాండ్ విటారా కూడా చేరింది. దీని మొదటి బ్యాచ్ లాటిన్ అమెరికాకు ఎగుమతి చేయబడింది. దీంతో విదేశాల్లో కూడా ఈ కారు తన మార్క్ సత్తాను చాటనుంది.

మేక్ ఇన్ ఇండియాతోనే సాధ్యం..
భారత ప్రభుత్వం ఫ్లాగ్షిప్ మేక్-ఇన్-ఇండియా చొరవతో ఈ మైలు రాయిని చేరుకోవడం సాధ్యమైందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో హిసాషి టేకుచి తెలిపారు. 2.5 మిలియన్ల వాహనాల మైలురాయి భారతదేశ తయారీ సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు. ఇది వాహన ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వ ప్రయత్నాలకు ఊతమిస్తుందని వివరించారు. విదేశాలలో మా బ్రాండ్ను విస్తరించడానికి కూడా సహాయపడుతుంది ఆయన పేర్కొన్నారు.
దీనిని చేరుకోవడానికి మా మాతృ సంస్థ, సుజుకి మోటార్ కార్పొరేషన్, బలమైన సాంకేతిక మద్దతును అందించిందని చెప్పారు. వారి బలమైన మద్దతు వల్లే ఇది సాధ్యమైంది. ఈ మైలురాయిని సాధించడానికి వారి విస్తారమైన గ్లోబల్ నెట్వర్క్ను ఉపయోగించుకోవడంలో కూడా వారు మాకు సహాయం చేశారని అన్నారు. మా గ్లోబల్ కస్టమర్లు, మా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు వారి మద్దతు నమ్మకానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భవిష్యత్ లోనూ టాప్..
గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు ఎగుమతి చేయబడిన మారుతి సుజుకి బాలెనో ద్వారా 2.5 మిలియన్ల మైలురాయి అందుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మారుతీ సుజుకీకి విదేశీ మార్కెట్లోనే కాకుండా దేశీయ మార్కెట్లోనూ మంచి స్పందన వస్తోంది. మారుతి కంపెనీ ప్రతి నెలా మొత్తం అమ్మకాల పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీ కొత్త మోడళ్లైన మారుతి జిమ్నీ ఫ్రాంక్స్ కి ఇప్పటికే అధిక డిమాండ్ వస్తోంది.
మారుతి సుజుకి ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్పోలో మారుతి జిమ్నీ, ఫ్రాంక్స్ మోడల్లను ఆవిష్కరించింది. ఈ రెండు మోడళ్లూ భారత్లో రికార్డు బుకింగ్లు సాధిస్తున్నాయి. ఈ రెండు మోడళ్ల డెలివరీ కోసం కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ ప్రకారం, మారుతి జిమ్నీ మోడల్కు 23,500పైగా బుకింగ్లు వచ్చాయి. అలానే మారుతి ఫ్రాంక్స్ మోడల్ 15,500పైగా బుకింగ్లను సాధించింది.


Click it and Unblock the Notifications








