అదనపు సేఫ్టి ఫీచర్లతో సరికొత్తగా మారుతి సియాజ్
కస్టమర్లను ఆకట్టకోవడంలో మారుతి సుజుకి పంథానే వేరు. సరసమైన ధరలతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులకు నిత్యం తమ సర్వీసులను అందిస్తుంటుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఆ కంపెనీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ డేట్ ని మారుతి సుజుకి నెక్సా వెల్లడించింది. 'సియాజ్' మోడల్ లో డ్యూయల్ టోన్ కలర్స్ ను మార్కెట్ లో కి తీసుకువచ్చినట్లు కంపెనీ పేర్కొంది.
తాజాగా విడుదల చేసిన మోడల్స్ లో ఆధునిక ఫీచర్లను జోడించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ లో మాన్యువల్ కారు వేరియంట్ ధర రూ.11.15 లక్షలుగా, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.12.35 లక్షలుగా (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) సంస్థ నిర్ణయించింది. మారుతి సుజుకి నెక్సా షోరూమ్ లల్లో ప్రస్తుతం 2023 కార్లు అందుబాటులో ఉంచినట్లు సంస్థ వివరించింది.

మధ్య స్థాయి సెడాన్ మోడల్ సియాజ్ మొత్తంగా 3 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని మారుతీ సుజుకి ఇది వరకే ప్రకటించింది. 2014లో కంపెనీ మొట్టమొదటిసారిగా ఈ కారును విడుదల చేసింది. ఆకర్షణీయమైన ఫీచర్స్ సరసమైన ధరలో కారు లభిస్తుండటంతో దేశ వ్యాప్తంగా సియాజ్ కార్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్స్ ఆసక్తి కనబరిచారు. అప్పటినుంచి అమ్మకాల్లో ఈ కారు జోరు కొనసాగుతోంది.
డ్యూయల్ టోన్ కలర్స్ లో అదిరిపోయే లుక్స్ తో సియాజ్..
కొత్త సియాజ్ మోడల్ మూడు డ్యూయల్ కలర్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి పెర్ల్ మెటాలిక్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, పెర్ల్ మెటాలిక్ గ్రాండియర్ గ్రే విత్ బ్లాక్ రూఫ్, డిగ్నిటీ బ్రౌన్ విత్ బ్లాక్ రూఫ్. ఇక భద్రత విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, స్టాండర్డ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, చైల్డ్ సేఫ్టీ ఐసోఫిక్స్ సీట్, రియర్ పార్కింగ్ సెన్సార్లను సంస్థ ఆధునీకరించింది.

దీంతో పాటు కారులోని ఫీచర్స్ పరంగా ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ని జతచేసింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఈ కారు కలిగి ఉంది. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్స్ ని మరింతగా ఆకట్టుకునేందుకు మార్పులు చేసింది.
1.5 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ తో కొత్త మారుతి సుజుకి సియాజ్ సెడాన్ పనిచేస్తుంది. ఇది 104.6 హార్స్ పవర్, 138 న్యూటన్ మీటర్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. సియాజ్ డ్యూయల్-టోన్ వేరియంట్ లో మాన్యూవల్ వేరియంట్ లీటర్ కి 20.65 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ లీటర్ కి 20.04 కిలోమీటర్లు మైలేజ్ ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మరింత మెరుగ్గా భద్రతా ప్రమాణాలు..
మూడు కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లతో పాటు అదనపు భద్రతా ఫీచర్లను జోడించి సరికొత్త సియాజ్ ను పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. భారత మార్కెట్లో సియాజ్ ఎనిమిదేళ్ళను పూర్తి చేసుకుని గణనీయమైన విజయాన్ని సాధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్ లో తన స్థానాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.
మరోవైపు మారుతి సుజుకి ఇండియాకు చెందిన కొన్ని కార్లపైన డిస్కౌంట్ కొనసాగుతోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అందులో మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis), మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz), మారుతి సుజుకి బలెనో (Maruti Suzuki Baleno)పై డిస్కౌంట్లును అందిస్తున్నాట్లు పేర్కొంది. ఈ మూడు కార్లు నెక్సా డీలర్షిప్ల నుంచి విక్రయించబడ్డాయి. కొన్ని మోడళ్లపై రూ.50,000 వరకు తగ్గింపు ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ఈ నెలఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








