జీఎస్టీ పెంపు వల్ల సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్కు ఏంటి ముప్పు..? వ్యాపారం ఎటు పోతుంది..?
ప్రస్తుతం ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. ఒకప్పుడు సొంత బైకును కలిగి ఉండటం చాలా మంది కోరికగా ఉండేది. కానీ ఇప్పుడు సొంతంగా కార్లను కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు ఆశ పడుతున్నారు. కుటుంబంతో కలిసి బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణాలు చేయడం కంటే కూడా ఒక కారు ఉంటే చాలు దానిలో అందరూ కలిసి హాయిగా ప్రయాణించవచ్చనే ఆలోచన చేస్తూ, మార్కెట్లో తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు కనుక్కొని అలాంటి వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే కొత్త కారును కొనగలిగే ఆర్థిక స్థోమత లేని వాళ్లు కనీసం సెకండ్ హ్యాండ్లో అయిన కొనుగోలు చేస్తున్నారు. యూజ్డ్ కార్ల సేల్స్ ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. వాడిన కార్లు కావడంతో అసలు ధర కంటే తక్కువకు అందుబాటులో ఉంటాయి. దీంతో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేస్తుంటారు.
భారత్లో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ భారీగా ఉంటుంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం వాడిన కార్ల సేల్స్పై 18 శాతం జీఎస్టీ(GST)ని పెంపుదల చేసింది. అంతకుముందు ఇది 12 శాతంగా ఉండగా, ఇప్పుడు జీఎస్టీ 6 శాతం పెరగడం గమనార్హం. అయితే ఇది జీఎస్టీ కింద నమోదు కాని వ్యక్తుల మధ్య కార్ల సేల్ జరిగితే వర్తించదు. జీఎస్టీ కింద నమోదు అయిన వారికి మాత్రమే వర్తిస్తుంది.

సెకండ్హ్యాండ్ కార్లు డీలర్షిప్ల ద్వారా కొనుగోలు చేసే వారు పెరిగిన పన్ను ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన డిసెంబర్ 21న రాజస్థాన్లోని జైసల్మేర్లో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సెకండ్హ్యాండ్ విక్రయంపై 18 శాతం జీఎస్టీ పెంపుదలకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెకండ్హ్యాండ్ కార్ డీలర్షిప్ల ద్వారా కార్లను కొనుగోలు చేసే వారికి ఇది షాక్ ఇచ్చే అంశం.
అయితే జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంతో పోలిస్తే ఇండియాలో వాడిన కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. జీఎస్టీ నమోదిత డీలర్షిప్ల ద్వారా అలాగే వ్యక్తుల మధ్య సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్ జరుగుతూనే ఉన్నాయి. జీఎస్టీ పెరగటం వలన డీలర్షిప్ల ద్వారా కాకుండా అనధికారిక మార్గాల ద్వారా కార్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువ జరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించడానికి స్పిన్నీ, కార్స్24 వంటి పలు ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభావితం అవుతున్నాయి. ఒక కారును డీలర్షిప్ ద్వారా కస్టమర్కు సేల్ చేసినప్పుడు RTO ఆఫీస్లో కారు ఓనర్ పేరు మార్పు, బీమా వంటి పత్రాలు తయారు చేసి అందించాలి. ఈ ఖర్చులకు పోను ఇప్పుడు అదనంగా పెరిగిన పన్ను చెల్లించడం వల్ల డీలర్లపై ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది.
తాజాగా డెక్కన్ హెరాల్డ్ ఒక సర్వేను ఉటంకిస్తూ పెరిగిన జీఎస్టీ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ అనధికార మార్గాల వైపు వెళ్తుందని తెలిపింది. ఇప్పటికే చాలా మంది అనధికారికంగా కార్లను సేల్ చేస్తుండగా, ఇకపై ఇది మరింత పెరుగుతుందని సర్వే పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది తమకు తెలిసిన వాళ్ల ద్వారా లేదా బ్రోకర్ల ద్వారా వాహనాలను సేల్ చేస్తున్నారని తెలిపింది.
సర్వే ప్రకారం చూసినట్లయితే 30 శాతం మంది కుటుంబం, ఫ్రెండ్స్, సహోద్యోగులు వంటి వారి ద్వారా కొనుగోలు చేయడం లేదా సేల్ చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాల సైట్ ఓఎల్ఎక్స్, ఇతర ప్లాట్ఫారమ్ల ద్వారా కేవలం 10 శాతం మంది లావాదేవీలు చేస్తున్నారు. 25 శాతం మంది మాత్రమే డీలర్షిప్లో సంప్రదిస్తున్నారు. పెరిగిన జీఎస్టీ ఫలితంగా షోరూమ్లలో యూజ్డ్ కార్ల ఎక్స్ఛేంజీల సంఖ్య తగ్గుతుందని అంచనా.


Click it and Unblock the Notifications








