ఆటోమోబైల్ ప్రేమికులారా.. అతిపెద్ద పండుగ రాబోతుంది.. ఆ తేదీలను ఇప్పుడే మార్క్ చేసుకుని పెట్టుకోండి!!
ఆటోమొబైల్ పరిశ్రమలో భారీ విప్లవాన్ని సృష్టించేందుకు భారత్ మొబిలిటీ ఎక్స్పో (Bharat Mobility Expo 2025) సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన తేదీని తాజాగా ప్రకటించారు. 2025 జనవరి 17 నుంచి 22 వరకు ఈ ఎక్స్పో జరగనుంది. ఢిల్లీలోని మూడు వేదికల్లో ఈ ఎక్స్పో జరగనుంది. భారత్ మండపం (ప్రగతి మైదాన్), ద్వారకాలోని యశోభూమి (ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్), నోయిడా మెట్రోపాలిటన్ ఏరియాలోని ఇండియా ఎక్స్పో మార్ట్స్లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలేంటో ఓ లుక్కేద్దాం..
గతంలో సియామ్ (SIAM), ఏసీఎంఏ (ACMA) సంస్థలు వేర్వేరుగా ఆటో, ఆటో విడిభాగాల ప్రదర్శనలు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో తొలిసారిగా భారత్ మొబిలిటీని వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ విజయంతో ఇప్పుడు భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో ఆటోమొబైక్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఒకే ఈవెంట్లో నిర్వహించాలని యోచిస్తున్నారు.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో ఈ రంగానికి చెందిన పెద్ద సంఖ్యలో కంపెనీలు పాల్గొనబోతున్నాయి. వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, టైర్లు, బ్యాటరీ స్టోరేజ్ పార్ట్స్, సాఫ్ట్వేర్, వాహన నిర్మాణ పరికరాలు, ఇతర ఆటోమొబైల్ సంబంధిత ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఆటోమొబైల్ పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నారు. ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ), ఇండియా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ASSOCHAM) కీలక పాత్ర పోషించనున్నాయి.

భారత్ మొబిలిటీ ఎక్స్పో ఇప్పుడు అన్ని బ్రాండ్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి విపుల్ బన్సాల్ చెప్పారు. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించిన అన్ని రకాల ఎగ్జిబిషన్లు ఇక్కడే నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భారత్ మొబిలిటీ ఎక్స్పో ద్వారా మొబిలిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించబోతున్నారని తెలిపారు. అందుకే ఈ ఎగ్జిబిషన్ని మూడు చోట్ల నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ద్వైవార్షిక ఆటో ఎక్స్పో, ఆటో పార్ట్స్ ఎక్స్పో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జరిగాయి. ఇటీవలి సంవత్సరాలలో ఈ ఎక్స్ పోకు వాహన తయారీదారుల నుంచి ఆశించిన ఆదరణ లభించలేదు. దీన్ని మార్పు చేసిన భారత్ మొబిలిటీ ఎక్స్పో పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఆటోమొబైల్ ఎక్స్పోకి మంచి స్పందన లభించింది.
ఒకేసారి ఆటో రంగంలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లు నిర్వహించడం, ఇందులో పాల్గొనేవారికి వెసులుబాటు కల్పించడం, 2-3 రంగాలను కలిపి విలీనం చేయాలనే ఆలోచనకు రావడం గొప్ప నిర్ణయంగా విశ్లేషకులు తెలిపారు. ఇది భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో భారీ ప్రోత్సాహకానికి దారి తీసిందని చెప్పవచ్చు.
ఇక భారత్ మొబిలిటీ ఎక్స్పో ఎగ్జిబిషన్ ప్రస్తుతం భారతదేశం అంతటా ఆటోమొబైల్ ఔత్సాహికుల దృష్టిని ఆకర్షిస్తోంది. 2025లో జరిగే ఈ ఎక్స్ పో తేదీల్లో పాల్గొనడం వల్ల తమకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆటోమొబైల్ ఔత్సాహికులు భావిస్తున్నారు. ఈ ఎక్స్ పోలో పాల్గొనేందుకు ఇప్పటికే పలు సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.
అన్ని రకాల ఆటోమొబైల్ సెక్టార్ ఎక్స్ పోలను ఒకే చోట నిర్వహించడం ద్వారా ఆటోమొబైల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, ఉత్పత్తులు వస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందుకు అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఎక్స్పో ముగిసిన అనంతరం 2025 మార్చిలో సమగ్ర సమాచారం విడుదల చేస్తామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications








