ఒకే రోజు 350 ఎలక్ట్రిక్ బస్సులు - భారత్లో మొదటి నగరంగా ఢిల్లీ రికార్డ్..
ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఒకే రోజు 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
ఫిబ్రవరి 14న ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ 'వినయ్ కుమార్ సక్సేనా' మరియు ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్' ఈ కొత్త బస్సులకు జెండా ఊపి స్వాగతించారు. కొత్త బస్సుల చేరడంతో ఢిల్లీలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య ఏకంగా 1650కు చేరింది. ఈ కార్యక్రమం సరాయ్ కాలే ఖాన్ బస్స్టాండ్లో జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా చేరిన అన్ని ఎలక్ట్రిక్ బస్సులు జేబీఎమ్ కంపెనీకి చెందినవని తెలుస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం 350 ఎలక్ట్రిక్ బస్సులను ఫ్లీట్లో చేర్చడంతో.. దేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులు కలిగిన నగరాల జాబితాలో ఢిల్లీ ప్రధమ స్థానం, ప్రపంచ వ్యాప్తంగా మూడవ స్థానం పొందింది. అయితే 2025 నాటికి దాదాపు రెట్టింపు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే ప్రపంచంలో ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు వినియోగించే నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఇక ఎలక్ట్రిక్ బస్సుల విషయానికి వస్తే.. JBM సంస్థ రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు చాలా వరకు ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఒక ఫుల్ చార్జితో 250కిమీ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ బస్సులు జీపీఎస్, సీసీటీవీ కెమెరాలు మరియు పానిక్ బటన్స్ వంటి వాటిని పొందుతాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం బస్సుల్లో 300 క్లస్టర్ బస్ ఫ్లీట్లో, మిగిలినవి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కింద పనిచేస్తాయి.

ఢిల్లీలో సుమారు 41 లక్షల మంది ప్రయాణికులు తమ ప్రయాణానికి బస్సులను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం బస్సుల సంఖ్యను పెంచడంతో అలాంటి వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి ఢిల్లీలో వాహన సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వల్ల కాలుష్యం తీవ్రత అధికమైంది, దీనిని నివారించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది.
పెట్రోల్ వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు జీరో ఉద్గారాలను రిలీజ్ చేస్తాయి. కాబట్టి వాతావరణంలో కాలుష్యం తీవ్రత భారీగా తగ్గుతుంది. రానున్న రోజుల్లో CNG వాహనాల స్థానంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే జరిగితే ఢిల్లీలో కాలుష్యం తగ్గుతుందని ఆశించవచ్చు. వాహన వినియోగదారులు కూడా వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించడంలో సహాయపడాలి.
ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం యొక్క ఫేమ్ 2 స్కీమ్ కింద కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 2012 నుంచి ఢిల్లీలో 1300 ఎలక్ట్రిక్ బస్సులు ఫ్లీట్లో అడుగుపెట్టాయి. ఇప్పటి వరకు ఆ ఎలక్ట్రిక్ బస్సులు 5.8 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించినట్లు, ఎలక్ట్రిక్ బస్సులు కావడం వల్ల ఏకంగా 47000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడ్డాయి. ఈ ఉద్గారాలు రానున్న రోజుల్లో మరింత తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








