జూన్ 2024లో తగ్గిన ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్.. కారణం ఏంటంటే?
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు సైతం తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహన విభాగంలో లాంచ్ చేస్తున్నాయి. మంచి అమ్మకాలను పొందుతున్నాయి. అయితే గత నెలలో మాత్రం ఈవీల అమ్మకాలు అంతకు ముందు ఏడాది కంటే తక్కువయ్యాయి. అయితే గత నెలలో ఏ బ్రాండ్ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి? అంతకు ముందు ఏడాది ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఎంత అనే మరిన్ని వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇప్పటికి విడుదలైన గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్, బీఎండబ్ల్యూ, ఆడి మరియు బెంజ్ మొదలైన బ్రాండ్స్ మొత్తం అమ్మకాలు కేవలం 5562 యూనిట్లు మాత్రమే అని గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందే ఏడాది ఇదే నెలలో ఈవీల సేల్స్ 6960 యూనిట్లు. అంటే గత నెల అమ్మకాలు ఏకంగా 20 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.

2024 మొదటి అర్ధభాగంలో ఈవీ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 40663 యూనిట్లు. టూ వీలర్స్, త్రీ వీలర్స్, ప్యాసింజర్ వాహనాలు మరియు వాణిజ్య వాహనాల మొత్తం రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది ప్రథమార్థంలో 16 శాతం పెరిగి 842217 యూనిట్లకు చేరుకుంది. అయితే ఒక్క జూన్ నెలలో మాత్రం ఈవీ సేల్స్ 108742 యూనిట్లు మాత్రమే. ఈ సంఖ్య అంతకు ముందు నెలలతో పోలిస్తే చాలా తక్కువని తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం.. 2024 మార్చి 31న ఫేమ్ 2 స్కీమ్ ఉపసంహరించుకోవడమనే తెలుస్తుంది. ఇది ఒక్క కార్ల అమాంకాలను మాత్రమే కాకుండా టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ అమ్మకాలను ప్రభావితం చేసింది. సబ్సిడీ అందుబాటులో లేకపోవడంతో వాహనాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది కస్టమర్ల మీద ప్రభావాన్ని చూపింది. హెచ్1 2024లో అన్ని విభాగాల అమ్మకాలు మొత్తం 791402 యూనిట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. 2024 మార్చి మధ్యలో ఫేమ్ 2 ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) వచ్చింది. ఇది ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు నాలుగు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈఎంపీఎస్ మొత్తం రూ. 500 కోట్లను కలిగి ఉంది. ఇది 333000 టూ వీలర్స్, 38828 త్రీ వీలర్స్ సహా 372000 ఈవీల కొనుగోలుకు మద్దతు ఇవ్వడానికి లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
2024 జూన్ నెలలో మాత్రమే.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 53151 యూనిట్లుగా కాగా, త్రీవీలర్ అమ్మకాలు 49186 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ వాహనాలు మొత్తం ఈవీ అమ్మకాలలో కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య నెలవారీగా పదహారు శాతం మరియు వార్షికంగా ఇరవై శాతం తగ్గినట్లు తెలుస్తోంది. మే అమ్మకాలతో పోలిస్తే జూన్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

భవిష్యత్తులో లేదా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి ప్రభుత్వం రాయితీలను అందిస్తుందని భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కొత్తగా ఏర్పడి ప్రభుత్వం ఫేమ్ 3 ప్రకటనకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తుందని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. అనుకున్న విధంగా అన్నీ జరిగితే మళ్ళీ ఈవీ అమ్మకాలు పెరుగుతాయని పలువురు భావిస్తున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








