రూ.1500 కోట్లు పెరిగిన ఫేమ్ 2 బడ్జెట్ - ఇప్పుడే తెలుసుకోండి
ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో 'ఫేమ్' (ఫాస్టర్ అడాప్టివ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని ప్రభుత్వం భారీగా పెంచుతూ ప్రకటించింది.
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రెండవ దశ ఎలక్ట్రిక్ వెహికల్ స్కీమ్ కోసం ఆర్ధిక వ్యయాన్ని రూ. 10000 కోట్ల నుంచి రూ. 11500 కోట్లకు పెంచింది. అంటే ఈ స్కీమ్ కోసం అదనంగా రూ. 1500 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్ వ్యయం 2024 మార్చి 31 వరకు లేదా నిధులు ఉండే వరకు, ఏది ముందుగా ఉంటే అది చెల్లుబాటు అవుతుంది.
ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్ మరియు ఫోర్ వీలర్లకు ఈ సబ్సిడీలు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం ప్రభుత్వం ఇప్పటికే రూ. 5884 కోట్ల సబ్సిడీలను అందించింది. అంటే ఫేమ్ 2 సబ్సిడీ నుంచి ప్రయోజనం పొందేందుకు వినియోగదారులకు మొత్తం రూ. 5615 కోట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ సబ్సిడీ ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదార్లకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఫేమ్ స్కీమ్ వల్ల ప్రయోజనం పొందిన వెహికల్స్ సంఖ్య
ఇప్పటి వరకు ఫేమ్ స్కీమ్ కింద ఏకంగా 12,11,843 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ప్రయోజనం పొందినట్లు సమాచారం. టూ వీలర్స్ మాత్రమే కాకుండా 1,42,713 ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ మరియు 17,301 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ కూడా ఈ సబ్సిడీ వల్ల ప్రయోజనం పొందాయి. నిజానికి ఫేమ్-2 స్కీమ్ ప్రారంభ లక్ష్యం 10 లక్షల ఎలక్ట్రిక్ టూ, 5లక్షల త్రీ వీలర్, 55000 ప్యాసింజర్ కార్లు, 7000 ఎలక్ట్రిక్ బస్సులు.
ఇంకా వివిధ నగరాలు, రాష్ట్ర రవాణా సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఇంట్రాసిటీ కార్యకలాపాల కోసం 6862 ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతే కాకుండా 7432 ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు చమురు మార్కెటింగ్ కంపెనీలకు మూలధన సబ్సిడీగా రూ. 800 కోట్లు మంజూరు చేసింది.

మధ్యంతర బడ్జెట్లో ఫేమ్..
ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్లో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి ఫేమ్ పథకం కోసం ప్రభుత్వం రూ. 2671 కోట్లు కేటాయించారు. అయితే మార్చి 31 తరువాత ఫేమ్ 2 సబ్సిడీ ఫేమ్ 3గా కొనసాగుతుందా? లేదా అనేదానికి సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే వచ్చే ఆర్ధిక సంవత్సరానికి ప్రోత్సాహాలను కొనసాగించాలని మాత్రం వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఫాడా ప్రెసిడెంట్ వ్యాఖ్యలు..
ఫేమ్ 2 స్కీమ్ పెంచడం మీద ఫాడా (FADA) ప్రెసిడెంట్ 'మనీష్ రాజ్ సింఘానియా' మాట్లాడుతూ.. ఫేమ్ ఇండియా.. స్కీమ్ 2 వ్యయానికి రూ.10000 కోట్ల నుంచి రూ.11500 కోట్లకు పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫాడా స్వాగతిస్తోందని, ఈ గణనీయమైన పెరుగుదల క్లీన్ మొబిలిటీకి ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెప్పడమే కాకుండా.. తయారీదారులు, డీలర్లు మరియు ముఖ్యంగా వినియోగదారులతో సహా పర్యావరణం మీద విశ్వాసం కలిగిస్తుందని అన్నారు.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు కొత్త బైకుల గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








