వాహన పరిశ్రమలో సంచలనం.. అమెరికా, చైనాను చావు దెబ్బ కొట్టేందుకు హోండా-నిస్సాన్ కంపెనీల విలీనం
వాహన పరిశ్రమలో మరో సంచలనం వార్త తెర పైకి వచ్చింది. జపాన్కు చెందిన ఆటొమొబైల్ తయారీ కంపెనీలు కలిసి ఒకే సంస్థగా మారడానికి సిద్ధం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా, చైనాకు దేశాల కంపెనీలకు గట్టి పోటీనిచ్చేందుకు హోండా(Honda), నిస్సాన్(Nissan) కంపెనీలు విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఈ డీల్ పూర్తి స్థాయిలో జరిగితే గనక వాహన పరిశ్రమలో ఇది అతిపెద్ద విలీనంగా నిలుస్తుంది. మొదటగా హోండా, నిస్సాన్ కంపెనీలు కలిసి ఒకే సంస్థగా మారడానికి చర్చలు జరిపాయి. ఇవి తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు విలీనానికి అంగీకరించాయి. అయితే ఆ తరువాత ఇప్పుడు ఈ డీల్లో మిత్సుబిషి(mitsubishi) సైతం చేరడానికి సిద్ధం అయింది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి మిత్సుబిషి కంపెనీ ఈ విలీన ఒప్పందంలో చేరే అవకాశం ఉంది. ప్రపంచంలోనే ఈ కంపెనీలు వాహన తయారీ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నాయి.
ఈ డీల్ విజయవంతంగా పూర్తయినట్లయితే ప్రపంచంలోనే వాహన పరిశ్రమ రంగంలో సరికొత్త విప్లవానికి దారీ తీస్తుంది. ఈ మూడు కంపెనీలు కలవడం ద్వారా అంతర్జాతీయంగా అమెరికా, చైనాకు చెందిన వాహన తయారీ కంపెనీలకు పోటీ తీవ్రతరం అవుతుంది. ప్రపంచ మార్కెట్లో హోండా, నిస్సాన్ కంపెనీల అధిపత్యం చాలా పెద్దగా అవుతుంది. సోమవారం ఈ రెండు దిగ్గజ కంపెనీలు తమ వ్యాపార నిర్వహణకు సంబంధించి అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి.

ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వాహన తయారీ కంపెనీలు ఈవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన టెస్లా, చైనాకు చెందిన BYD కంపెనీలు ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్పై ప్రధాన దృష్టి పెట్టి కొత్త ఈవీ కార్లను విడుదల చేస్తూ అంతర్జాతీయంగా ఎక్కువ మార్కెట్ను దక్కించుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విలీన ఒప్పందంతో వీటికి ఎదురుదెబ్బ తగులుతుంది.
విలీనం అవుతున్న అన్ని కంపెనీలు కూడా వాహన మార్కెట్లో మెజారిటీ వాటా కలిగినవే. దీంతో ఈవీ మార్కెట్లో ఈ కంపెనీల అధిపత్యం బాగా పెరుగుతుంది. టెస్లా, BYD వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు ఈ డీల్తో గట్టి షాక్ తగులుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇప్పటికే హోండా, నిస్సాన్ విడివిడిగా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టగా, విలీనం తర్వాత కలిసి పెద్ద మొత్తంలో ఈవీలపై పెట్టుబడులు పెడతాయి.
ఇప్పుడు విలీనంలో మిత్సుబిషి సైతం చేతులు కలపడానికి రెడీగా ఉండటంతో పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఈ డీల్కు సంబంధించిన చర్చలు జూన్ 2025 నాటికి కొనసాగుతాయి. ఆగస్టు 2026లో విలీనం అధికారికంగా పూర్తయ్యే అవకాశం ఉంది. డీల్ పూర్తయిన తర్వాత సంయుక్తంగా మొత్తం అమ్మకాలు రూ.1.62 లక్షల కోట్లకు చేరుతాయి. మార్చి 2024 నాటికి హోండా 1.382 ట్రిలియన్ యెన్, నిస్సాన్ 568.7 బిలియన్ యెన్ లాభాలను కలిగి ఉన్నాయి.
విలీనం ఆగస్టు 2026లో అమల్లోకి వచ్చేలా ప్లాన్ చేసిన నేపథ్యంలో సంబంధిత పేపర్ వర్కును వేగంగా పూర్తి చేయడానికి హోండా, నిస్సాన్ అధికారులు సిద్ధం అయ్యారు. ఈ రెండు కంపెనీల విలీనం తర్వాత సంయుక్తంగా వాహనాల సంవత్సరం ప్రాతిపదికన ఉత్పత్తి 74లక్షలకు పైనే ఉండే అవకాశం ఉంది. హోండా మోటార్ ప్రెసిడెంట్ తోషిహిరో మిబ్ మాట్లాడుతూ, జనవరి 2025 నాటికి చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
2025 మధ్య కాలంలో విలీనానికి సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు వెల్లడిస్తారు. గతంలోనే హోండా, నిస్సాన్ మధ్య విలీనం చర్చలు జరుగుతున్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు వీటిని అధికారికంగా ప్రకటించారు. మూలధనం వ్యయం, ఉద్యోగుల విభజన, పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఇంకా పూర్తి స్థాయిలో జరగనున్నాయి. ఈ డీల్తో ఇవి మూడో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా అవతరిస్తాయి.


Click it and Unblock the Notifications








