2024లో దూసుకెళ్లిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. దేశంలో అందరి చూపు వీటి మీదే.. ఏకంగా కొన్ని లక్షల సేల్స్
భారత్లో పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం క్రమంగా పెరుగుతుంది. కొత్తగా కారును కొనుగోలు చేసే వారు ముందుగా ఈవీల గురించి తెలుసుకుంటున్నారు. ఇంధన ధరలు అధికంగా ఉండటంతో తమ సంపాదనలో ఎక్కువ భాగం వీటికే ఖర్చు చేయాల్సి వస్తుందనే భావనతో ఎలక్ట్రిక్ కారు అయితే తక్కువ ఖర్చు అవుతుందని ఈవీల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ సెగ్మెంట్ వాహనాలు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. తయారీ కంపెనీలు వీటి సేల్స్ పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 2023 ఏడాదితో పోలిస్తే 2024లో ఆటో మొబైల్ పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల హావా ఓ రేంజ్లో పెరిగింది. తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) నుంచి విడుదలైన డేటా ప్రకారం, దేశంలో ఈవీ వాహనాల సేల్స్ 2024లో భారీగా పెరిగాయి.
2023 ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ 26.5 శాతం పెరిగాయని డేటా చూపించింది. ఇవి 2024 డిసెంబర్ 29 నాటికి 19.4లక్షల యూనిట్లకు చేరుకున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటాలో వెల్లడైంది. అదే సమయంలో ఈవీ వాటా మార్కెట్లో ఏడాది ప్రాతిపదికన 2023లో 6.39 శాతం నుంచి 2024లో 7.46 శాతానికి పెరిగింది. గత సంవత్సరం కంటే ఈవీలు దేశంలోని అన్ని ప్రాంతాలకు ఎక్కువగా విస్తరించాయి.

ప్రస్తుతం పెట్రోల్ వాహనాలు ఇప్పటికి మార్కెట్లో సేల్స్ పరంగా మొదటి స్థానంలో ఉన్నాయి. 2024 ఏడాదిలో అమ్ముడుపోయిన మొత్తం 2.604 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వాటా దాదాపు 73.69 శాతంగా ఉంది. తర్వాత డీజిల్ వాహనాల విక్రయాలు 10.05 శాతంగా ఉన్నాయి. 9.87 శాతం మాత్రం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), హైబ్రిడ్, పెట్రోల్-CNG వాహనాల సేల్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యల్లో గణనీయమైన మార్పులు రావచ్చు.
ఈవీ వాహనాల సేల్స్ పెరగడంతో రానున్న రోజుల్లో పొల్యూషన్ ఉద్గారాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వాహన్ డేటా ప్రకారం, 2024లో ఈవీ కార్లను పరిశీలించినట్లయితే ప్రతి EVకి సగటున 12.43 పెట్రోల్, హైబ్రిడ్, డీజిల్, CNG వాహనాలు సేల్ అయ్యాయి. 2022లో ఇది 21.05 ఉండగా, అది 2023 నాటికి మెరుగుపడి 15.67కి చేరింది. 2024లో మంచి ఆశించిన ఫలితాలను సాధించిన కంపెనీలు 2025పై భారీ ఆశలు పెట్టుకున్నాయి.

ఈ కార్ల అమ్మకాలను 2024 ప్రారంభం నుంచి చూసినట్లయితే జనవరి నెలలో 1,45,064, ఫిబ్రవరిలో 1,41,740 అమ్మకాలతో ఈ ఏడాది ప్రారంభంలోనే బలమైన పునాది పడింది. ఆ తర్వాత మార్చి నెలలో సేల్స్ మరింత పుంజుకుని ఏకంగా 2,13,068కి చేరుకున్నాయి. తిరిగి ఏప్రిల్లో తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫేమ్-2(FAME-II) సబ్సిడీ పథకం గడువు ముగిసిపోవడంతో ఈ నెలలో సేల్స్ 1,15,898 గా నమోదు అయ్యాయి.
ఆ తర్వాత పండుగ సీజన్ తిరిగి ఈవీ కార్ల సేల్స్ పెరగడానికి బాగా ఉపయోగపడింది. దసరా, దీపావళి సమయంలో వాహన తయారీ కంపెనీలు తమ ఈవీ కార్లపై పెద్ద ఎత్తున్న తగ్గింపులు, డిస్కౌంట్లను అందించాయి. దీంతో చాలా మంది ఈ తగ్గింపులను సద్వినియోగం చేసుకుని కొత్త ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. దాంతో అక్టోబర్లో ఈవీ కార్ల సేల్స్ 2,19,482గా నమోదై గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ముఖ్యంగా పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకాన్ని కేంద్రం తీసుకురావడం కూడా ఈ సీజన్లో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెరగడానికి దోహద పడింది. అక్టోబర్ తరువాత పండుగ ఆఫర్స్ అందుబాటులో లేకపోవడం వలన నవంబర్, డిసెంబర్ నెలలో సేల్స్ తగ్గిపోయాయి. అయినప్పటికి గత ఏడాది ఇవే నెలలతో పోలిస్తే ఈ సారి మెరుగైన సేల్స్ నమోదు అయ్యాయి.


Click it and Unblock the Notifications








