దసరా, దీపావళిలో దుమ్మురేపిన కియా కార్లు.. వామ్మో ఇది మామూలు డిమాండ్ కాదు బాబోయ్.. ఏకంగా 28 వేలకు పైనే
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ కంపెనీ కియా మోటార్స్(kia motors) భారత్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి నెలా తన అమ్మకాలను పెంచుకుంటూనే ఉంది. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రీమియం కార్ల తయారీదారులలో కియా ఇండియా ఒకటిగా అవతరించింది. ఇదిలా ఉంటే, కంపెనీ దసరా, దీపావళి సమయంలో అధిక మొత్తంలో వాహనాలను కస్టమర్లకు డెలివరీ చేసింది. డెలివరీ అయిన కార్లు అన్ని కూడా సరికొత్త డిజైన్తో లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉన్నవే. ముఖ్యంగా ఈ టైంలో వినియోగదారుల డిమాండ్ను బట్టి కియా మోటార్స్ పలు తగ్గింపులు, క్యాష్బ్యాక్లను ప్రకటించడం ద్వారా అక్టోబర్ నెలలో డిమాండ్కు అనుగుణంగా ఏడాది ప్రాతిపదికన డెలివరీ చేసే వాహనాల సంఖ్యలో మెరుగైన వృద్ధిని సాధించింది.
కియా ఇండియా తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం, అక్టోబర్ నెలలో 28,545 యూనిట్ల వాహనాలను డెలివరీ చేసింది. అక్టోబర్ 2023లో డెలివరీ చేసిన 21,941 యూనిట్లతో పోలిస్తే, ఇది సంవత్సరానికి 30 శాతం వృద్ధిని సాధించడం గమనార్హం. ముఖ్యంగా అక్టోబర్లో దీపావళి పండుగకు ముందు, 54 మంది కస్టమర్లు లగ్జరీ కియా కార్నివాల్ లిమోసిన్ ప్లస్ని కొనుగోలు చేసి లగ్జరీ కార్లపై తమ ఆసక్తిని తెలియజేశారు.

దేశీయ మార్కెట్తో పాటు, కియా మేడ్ ఇన్ ఇండియా కార్లకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని, భారత్ నుంచి విదేశాలకు 2,042 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక్కడ తయారవుతున్న కార్లు మంచి స్టాండర్డ్ బాడీని కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ఫెర్ఫామెన్స్పై అక్కడి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉండటం కారణంగా విదేశీ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.
కియా ఇండియా భారత మార్కెట్ పోర్ట్ఫోలియోలో సెల్టోస్, సోనెట్, కారెన్స్, EV6 వాహనాలు ఉన్నాయి. వీటితో పాటు ఇటీవల ప్రారంభించిన కార్నివాల్ లిమోసిన్ ప్లస్, కియా EV9 వేరియంట్లు కూడా ఉన్నాయి. వినియోగదారుల నుంచి ఎంపీవీ, కాంపాక్ట్ ఎస్యూవీలకు ఎక్కువ డిమాండ్ ఉంది. కియా సైతం వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ విభాగాల కార్లను అధికంగా లాంచ్ చేస్తుంది. వీటిలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

కంపెనీ తన అమ్మకాలు పెరగడంపై ఒక ప్రకటనలో వివరిస్తూ, ఆటోమొబైల్ రంగంలో విపరీతమైన పోటీ ఉంది. ఇలాంటి సమయంలో కియా కార్లు ఇతర కంపెనీలకు గట్టి పోటీని ఇస్తూ, అమ్మకాల్లో దూసుకుపోవడం కియా ఉనికిని మరింత బలోపేతం చేసినట్లయింది. కంపెనీ వృద్ధి రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని, భారత వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా మరిన్ని కొత్త కార్లను ప్రవేశపెడతామని కియా పేర్కొంది.
కియా అమ్మకాలపై సేల్స్, మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ, డీలర్ భాగస్వాములతో కలిసి ఇన్వెంటరీని నిర్వహించేందుకు పని చేస్తున్నాము. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కియా ఇండియా వేగవంతమైన వాహన డెలివరీకి ప్రాధాన్యత ఇస్తుంది. స్మార్ట్ ఇన్వెంటరీ నియంత్రణతో వేగవంతమైన డెలివరీని అందించడం ద్వారా కస్టమర్లకు తమకు ఇష్టమైన వాహనాన్ని సకాలంలో అందజేయడానికి వీలు కల్పించామని చెప్పారు.

కియా ప్రస్తుతం 3,00,000 వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఆగస్టు 2019లో భారీ ఉత్పత్తిని ప్రారంభించింది. రాబోయే నెలల్లో అనేక కొత్త వాహనాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కియా ఇండియా తన అనంతపురం ప్లాంట్ నుండి 10.5 లక్షలకు పైగా దేశీయ అమ్మకాలు, 2.5 లక్షల ఎగుమతులతో సహా 1.3 మిలియన్ వాహనాల సరఫరాను పూర్తి చేసింది. కంపెనీ 287 నగరాల్లో 640 టచ్పాయింట్ల నెట్వర్క్ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








