ముగిసిన ఎల్లో క్యాబ్స్ ప్రస్థానం.. దేశంలోనే అత్యంత పాపులారిటీ, ప్రాచీన టాక్సీలు ఇవే!
"పడి పడి లేచే మనసు" సినిమా గుర్తుందా? అందులో "కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే" అనే సాంగ్ చూశారా? కోల్కతా బ్యాక్డ్రాప్లో జరిగే ఆ మూవీలో మీకు ఎల్లో కలర్లో ఉండే అంబాసిడర్ ట్యాక్సీలు చాలానే కనిపిస్తాయి. అవి అంతలా కోల్కతాకు ఒక బ్రాండ్ మార్క్ను తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం, విద్య కోసం నగరంలో అడుగు పెట్టే వారికి.. ఈ పసుపు రంగు కారు, దాని పక్కనే ఉండి వెయిట్ చేసే డ్రైవరే స్వాగతం చెప్పేవారు. యమహానగరి అందాలను వాళ్లే పరిచయం చేసేవారు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఆ ఎల్లోకార్స్ ఇక కోల్కతాలో కనుమరుగయ్యే దశకు చేరాయి. అసలు దీనికి కారణం ఏంటి?
1960లలో ఈ ఎల్లో అంబాసిడర్ కార్స్ కోల్కతా నగరంలో పరిచయమయ్యాయి. అప్పటి నుంచి అనేక మంది ప్రయాణికులకు తమ గమ్యస్థానాలకు చేర్చాయి. ఎందరో డ్రైవర్లకు ఉపాధి కల్పించాయి. కోల్ కతా నగర జీవనంలో ఒక ముఖ్య భాగమయ్యాయి. అయితే.. ప్రభుత్వ నిబంధనలు, మార్కెట్ శక్తుల కారణంగా ప్రస్తుతం ఈ కార్లు తమ ప్రస్థానాన్ని ముగించక తప్పని పరిస్థితి నెలకొంది.

కోల్కతా నగరంలో ఈ టాక్సీ సేవలను 1962లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1994లో ఆనాటి ముఖ్యమంత్రి జ్యోతిబసు ప్రసాద్ ప్రభుత్వం ఈ టాక్సీలకు సంబంధించి "ఆల్ బెంగాల్ పర్మిట్" జారీ చేసింది. అంతేకాకుండా కోల్కతా క్యాబ్లకు సంబంధించి ఎల్లో కలర్ ఉండాలని నిశ్చయించింది. అప్పటినుంచి వంగదేశంలో ఈ కార్లు.. ప్రయాణికులకు తోడునీడయ్యాయి.
పతనం ఇలా: ఈ ట్యాక్సీల ప్రస్థానం 2009 నుంచి క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఆ ఏడాది సుప్రీంకోర్టు 15 ఏళ్లకు పైబడిన కమర్షియల్ వాహనాలను స్క్రాప్ గా మార్చాలని ఆదేశాలు జారీ చేయడంతో.. దీని పతనం మొదలైంది. న్యాయస్థానం ఆదేశాలతో ఎంతోమంది టాక్సీ ఆపరేటర్లు తమ వాహనాలను కొత్త మోడళ్లతో అప్గ్రేడ్ చేసుకున్నారు. ఆ రాష్ట్ర రవాణా శాఖ నివేదికల ప్రకారం దాదాపు 10,000కు పైగా డ్రైవర్లు తమ వాహనాలను ఆధునికీకరించారు.

అయితే పూర్తిగా సుప్రీంకోర్టు ఒక్కటి మాత్రమే కాదు అనేక కారణాలతో ఈ కార్లు తమ ఉనికిని కోల్పోయాయి. ఈ ఎల్లో క్యాబ్స్ కనుమరుగవడానికి మరో కారణం.. 2013లో ఆనాటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం.. కమర్షియల్ టాక్సీ క్యాబ్లకు సంబంధించి మారుతి స్విఫ్ట్ డిజైర్ కొత్త మోడల్ను ప్రామాణికంగా ఎంపిక చేసింది. అంతేకాకుండా పసుపు రంగు నుంచి కార్లను నీలం, తెలుపు రంగులో ఉండాలని నిర్దేశించింది.
ఈ నిర్ణయం తదుపరి... 2015లో హిందుస్థాన్ మోటార్స్ సంస్థ ఇక తమ అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో కోల్కతా టాక్సీ ఇండస్ట్రీలో ఒక అధ్యాయం ముగిసినట్లయింది. రెగ్యులేటరీ అంశాలు, మార్కెట్లో వచ్చే మార్పులు కాకుండా మరికొన్ని కారణాలు కూడా అంబాసిడర్ టాక్సీ సేవల పతనానికి కారణమయ్యాయి. అదేంటంటే ఈ అంబాసిడర్ కార్లు.. అధిక ఇంధనాన్ని తీసుకుంటాయి.

అసలే ఫ్యూయల్ ఖర్చులు భారీగా పెరుగుతున్న తరుణంలో ఈ కారును మెయింటెయిన్ చేయడం డ్రైవర్లకు ఇబ్బందిగా పరిగణించింది. అంతేకాకుండా ఇటీవల మొదలైన యాప్- బేస్డ్ ట్యాక్సీ సేవలు కూడా వినియోగదారుల ఎంపికలను మార్చివేశాయి. దీంతో ఈ సంప్రదాయ టాక్సీ లకు డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పటికే 5000కు పైగా ఎల్లో అంబాసిడర్ కార్స్ మూలనపడ్డాయి. మరో 2500 కార్లు కూడా త్వరలో తమ సేవలను ముగించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మార్పుల మూలంగా కోల్ కతా నగరానికి సంప్రదాయక హాల్ మార్క్ గగా నిలిచిన ఈ టాక్సీ సేవలు ఇక రానున్న రోజుల్లో పూర్తిగా అంతమవనున్నాయి. ఈ అంబాసిడర్ కారులను హిందుస్థాన్ మోటార్స్ సంస్థ 1958లో ఉత్పత్తి చేయడం మొదలు పెట్టింది. ఇది బ్రిటన్కు చెందిన 1956 నాటి మోరిస్ ఆక్స్ ఫోర్డ్ సిరీస్ 3 ఆధారంగా దీన్ని రూపొందించింది. ఈ అంబాసిడర్ కారు... అప్పటినుంచి బ్రాండ్ గా స్థిరపడిపోయింది.
సెలబ్రెటీల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ కారు ఫేవరేట్ అయిపోయింది. ఒకప్పుడు ఈ ఎల్లో కారులో తిరిగిన కోల్కతా నగర వాసులు.. ఆ కార్ల వైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సిటీ రోడ్లపై తమ ప్రయాణ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ ఎల్లో టాక్సీలు కనుమరుగైనప్పటికీ అవి కోల్కతా నగరానికి సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి ప్రతీక. నగరవాసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ పాత మధుర జ్ఞాపకం.


Click it and Unblock the Notifications








