సెలబ్రిటీల ఫేవరెట్ బ్రాండ్ నుంచి మరో కారు!.. లాంచ్ ఎప్పుడంటే?
ఎంతోమందికి సెలబ్రిటీల మనసుదోచిన ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) భారతదేశంలో ఎప్పటికప్పుడు తన ఉనికిని తెలియజేస్తూ కొత్త వాహనాలను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ వచ్చే నెల 9న (2024 ఆగష్టు 9) సరికొత్త 'ఉరుస్ ఎస్ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్' (PHEV) లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ సరికొత్త కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. లంబోర్ఘిని లాంచ్ చేయనున్న కొత్త కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
లంబోర్ఘిని లాంచ్ చేయనున్న కొత్త ఉరుస్ ఎస్ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్.. లేటెస్ట్ డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించబడే విధంగా ఉంటుంది. ఇది ట్విన్ టర్బో వీ8 ఎలక్ట్రిక్ సహాయంతో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. కంపెనీ ఈ కారు ధరలను ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఈ ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. ఆ తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయి.

త్వరలో లాంచ్ కానున్న లాంబోర్గిని హైబ్రిడ్ కారు డిజైన్ 'ఉరుస్ ఎస్' కంటే కూడా కొంత అప్డేట్ అయి ఉంటుంది. ఇందులో గుర్తించదగిన ఆప్డేట్ జే షేప్ డీఆర్ఎల్తో సన్నగా ఉండే హెడ్ల్యాంప్లు ఉన్నాయి. ఇవి కొత్త బానెట్ గ్రిల్ వరకు విస్తరించి, ముందు బంపర్లోని వెంట్లకు ట్వీక్ చేయబడి ఉంటాయి. బంపర్ మరియు టెయిల్గేట్ రెండూ కొత్తగా కనిపిస్తాయి.
క్యాబిన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. డ్యాష్బోర్డ్ ఎగువ మరియు దిగువ విభాగాలను వేరుచేసే కొత్త ట్రిమ్ ర్యాప్డ్ ప్యానెల్, రివైజ్డ్ స్విచ్ గేర్ మరియు పెద్ద 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్తో సహా కొన్ని డిజైన్ అప్డేట్లను పొందినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

పవర్ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులోని 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 612 Bhp పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పవర్ మరియు టార్క్ రెండూ కూడా స్టాండర్డ్ ఉరుస్ ఎస్ కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ అదనంగా పవర్ మరియు టార్క్ అందిస్తుంది.
లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ 25.9కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు కేవలం 3.4 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గంటకు 0-200 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం కేవలం 11.2 సెకన్స్ మాత్రమే. ఇది కూడా సాధారణ ఉరుస్ కంటే ఎక్కువే. దీని టాప్ స్పీడ్ గంటకు 312 కిమీ.

ఉరుస్ ఎస్ గత సంవత్సరం భారతదేశంలో రూ. 4.18 కోట్ల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ప్రారంభించబడింది. అయితే 2022 చివరలో కంపెనీ లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే రూ. 4.22 కోట్ల వద్ద లాంచ్ అయింది. కాగా ఇప్పుడు వచ్చే నెలలో లాంచ్ అయ్యే లంబోర్ఘిని కొత్త కారు ధర దాని మునుపటి మోడల్స్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








