కారు కొనేటప్పుడు ఆ ఆప్షన్ ఉందో లేదో తెలుసుకుని కొనండి.. ఎందుకంటే దేశంలో ఇకపై ఆ డివైజ్ తప్పనిసరి!!
అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ ఒకటిగా ఉంది. రోజువారి యాక్సిడెంట్స్ శాతం క్రమంగా పెరుగుతుండటం కాస్త కలవరానికి గురిచేస్తుంది. విస్తీర్ణం, జనాభా పరంగా మన దేశం పెద్దదిగా ఉండటంతో ఈ సంఖ్య ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే సాధారణం కంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వాహనాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అందుకే యాక్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ సంఖ్య అధికమవుతోంది. దేశంలో రోడ్డు ప్రమాదాలకు వివిధ కారణాలు ఉన్నాయి. మద్యం మత్తు, నిద్ర, ఓవర్స్పీడ్, రోడ్డు క్రాసింగ్ వంటివి ముఖ్య ప్రమాద కారణాలుగా ఉన్నాయి.
ఇందులో ముఖ్యంగా హైస్పీడ్ వల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. చాలా మంది డ్రైవింగ్ ఔత్సాహికులు ఓవర్స్పీడ్కి వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. దీని వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం డ్రైవర్ నిద్రలోకి జారుకుంటే హెచ్చరించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాగే ఓవర్స్పీడ్లో వెళ్తుంటే దీనికి కూడా డ్రైవర్కి అలర్ట్ అందించే పరికరం వాడుకలో ఉంది. ఈ పరికరాలు ప్రస్తుతం వస్తున్న కార్లలో ప్రామాణికంగా అమర్చబడి వస్తున్నాయి.

దేశంలోని రోడ్లకు తగినట్లుగా హైవేలపై స్పీడింగ్కి సంబంధించిన సైన్బోర్డ్స్ రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. తాజాగా ఈ టెక్నాలజీతో మీ కారు గంటకు 80కిలోమీటర్లు దాటితే డ్రైవర్ను అప్రమత్తం చేయడానికి బీప్ అనే శబ్దం వస్తుంది. భారతీయ మోటారు వాహన చట్టం ప్రకారం గరిష్ట వేగ పరిమితి 120 kmphగా ఉంది. ఈ సంఖ్యను మీరు దాటిన క్రమంలో బీప్ శబ్దం ఓవర్స్పీడ్ తగ్గే వరకు డ్రైవర్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది.
బీప్ సౌండ్తో పాటు కారులోని ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్పై ఓవర్ స్పీడ్ అలర్ట్ వచ్చే విధంగా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ఈ టెక్నాలజీని ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్ట్ (ISA) అని కూడా పిలుస్తారు. ఈ సాంకేతికత ముఖ్య లక్షణం సదరు రహదారిలో అనుమతించబడిన వేగాన్ని బట్టి పని చేస్తుంది. అంటే నగరంలో కారు గరిష్ట వేగం గంటకు 50 కి.మీ మాత్రమే ఇక హైవేలపై గరిష్టంగా 120 kmph లిమిట్ దాటకూడదు.

ఈ సాధనం కారు నడుపుతున్న రహదారిపై ఆధారపడి పనిచేస్తుంది. ఇందుకోసం జీపీఎస్ లింక్డ్ స్పీడ్ లిమిట్ డేటా మరియు కెమెరాను ఇన్స్టాల్ చేసి మానిటర్ చేస్తుంది. ఈ డివైజ్లోనే GPSలో ప్రభుత్వం నిర్దేశించిన వేగ పరిమితి సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. విదేశాలలో ఈ ISA పరికరం కేవలం బీప్ సౌండ్తో అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ వాయిస్ మరియు వీడియో హెచ్చరికలు వచ్చేలా మార్పులు చేయనున్నారు.
జూలై నుంచి యూరప్లోని అన్ని కొత్త కార్లలో ISA తప్పనిసరి చేశారు. అలాగే యూఎస్లో దాదాపు 60% హైవే డ్రైవర్లు తమ వాహనంలో ISAని కలిగి ఉండటాన్ని ఇష్టపడతారని ఒక ప్రముఖ బీమా కంపెనీ నివేదించింది. ISA డివైజ్ కిట్లో పూర్తిగా సేఫ్టీ ఫీచర్లు లింక్ చేయబడతాయి. అందువల్ల డ్రైవర్లను ముందుగానే హెచ్చరిస్తుంది.

ఈ పరికరం త్వరలో USలో తప్పనిసరి చేసే అవకాశం ఉంది. అయితే మన భారతదేశంలో ఇది ఎప్పుడు నుంచి తప్పనిసరి చేస్తారనే విషయం తెలియరాలేదు. రహదారి రవాణాను సురక్షితమైనదిగా చేయడానికి భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక చర్యలు తీసుకుటుంది.. అదేవిధంగా రోడ్ల నాణ్యతను కూడా కేంద్ర రహదారుల శాఖ మెరుగుపరిచింది. అదేవిధంగా ISAని తప్పనిసరి చేస్తే రోడ్డు భద్రత మరింత మెరుగుపడుతుందని దేశ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా ఈ పరికరం గ్రామీణ మరియు చిన్న పట్టణాలలో స్పీడర్లను బాగా నిరోధిస్తుంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల కంటే ఇలాంటి ప్రాంతాల్లో వాహనదారులకు వేగ పరిమితిపై అవగాహన తక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కార్లలో 6 ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి చేయడం కూడా ఉంది. అందువల్ల రాబోయే నెలల్లో కార్లలో ISA పరికరాన్ని తప్పనిసరి చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








