ఇకపై వారికి కూడా సీట్ బెల్ట్ తప్పనిసరి.. లేదంటే అలారం మోగుతుంది.. కేంద్రం కీలక ఆదేశాలు
సాధారణంగా కార్లలో డ్రైవర్తో పాటు ముందు సీట్లో కూర్చున్న ప్రయాణికులు మాత్రమే సీట్ బెల్టు మాత్రమే ధరిస్తారనే విషయం మనకు తెలిసిందే. వెనుక సీటు ప్రయాణికులకు కూడా సీట్ బెల్ట్ సౌకర్యం ఉన్నప్పటికీ చాలా మంది ఇది ఫాలో అవ్వరు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, ఏప్రిల్ 1, 2025 నుంచి తయారయ్యే అన్ని కార్లు తప్పనిసరిగా వెనుక సీట్ బెల్ట్ అలారం సదుపాయాన్ని అందించాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధన తప్పనిసరి చేయడానికి వెనుక కొన్ని కారణాలున్నాయి.

భారత్లో ట్రాఫిక్ నియమ నిబంధనలు, చట్టం ప్రకారం.. కార్లలో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్(Car Rear Seat Belt) ధరించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఈ రూల్ను అతిక్రమిస్తే.. మోటారు వాహన చట్టం ప్రకారం వారికి రూ.1,000 జరిమానా విధిస్తారు. కానీ చాలా మంది వెనుక సీటు ప్రయాణికులు సీటు బెల్టులు ధరించరనేది వాస్తవం.
ఇంకా వివరంగా చెప్పాలంటే, కారులో ముందు సీట్లలో కూర్చున్న వారు మాత్రమే సీటు బెల్టులు ధరించాలి అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ప్రమాదాలు జరిగితే వెనుక సీటులో కూర్చున్న వారి కంటే ముందు సీటు ప్రయాణికులకే ఎక్కువ రిస్క్ అనే కారణంతో వారు ఇలా భావిస్తారు. కానీ నిబంధనల ప్రకారం, కార్లలో ప్రయాణీకులందరూ సీటు బెల్ట్ ధరించాల్సి ఉంటుంది.

కార్లలో వెనుక సీటు ప్రయాణికులు సీట్ బెల్ట్(Rear Seat Belt Alarm Mandatory) ధరించడంలో విఫలమైతే.. రోడ్డు ప్రమాదాల్లో వెనుక సీటు ప్రయాణికులకు తీవ్ర గాయాలు లేదా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని చాలా మంది సీరియస్గా తీసుకోవడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్ను తప్పనిసరి చేసింది.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం నివారణకు కార్లలో వెనుక సీటు బెల్ట్ అలారం సౌకర్యం కల్పించాలని కార్ల తయారీదారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వెనుక సీటు ప్రయాణీకుడు సీట్ బెల్ట్ ధరించకపోతే, ఈ ఫీచర్ అలారం మోగుతుంది. దీని ద్వారా వెనుక సీటు ప్రయాణికులు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి.
ఏప్రిల్ 1 2025 నుంచి తయారయ్యే అన్ని కార్లలో ఈ ఫీచర్ తప్పనిసరిగా ఉండాలని ఆటో మేకర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రూల్ ద్వారా వాహన ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు తీవ్రంగా గాయపడే వారి సంఖ్య కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా రోడ్డు భద్రత మెరుగుపడుతుంది.
డ్రైవ్స్పార్క్ వ్యాఖ్య: కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్స్ ప్రకారం.. వెనుక సీటు బెల్ట్ అలారం సదుపాయాన్ని జోడించడం వల్ల కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటకీ ప్రజలు తమ భద్రత విషయంలో రాజీ పడకూడదని గుర్తుంచుకోవాలి. అయితే ధరలు స్వల్వంగా మాత్రమే పెరగవచ్చని గమనించాలి.
ఇటీవలి కాలం కార్లలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా సేఫ్టీ ఫీచర్లకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. కార్లలో ఎయిర్బ్యాగుల(6 Airbags) సంఖ్యను పెంచడం, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను తీసుకురావడంతో సహా.. తాజాగా రియర్ సీట్ అలారం తప్పనిసరి చేయడం ఇందుకు నిదర్శనం. రాబోయే కాలంలో కూడా మరిన్ని భద్రతా ఫీచర్లు తప్పనిసరి చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








