ఏప్రిల్ 1 నుంచి ఈ కార్ల ధరల పెంపు.. ఏయే కంపెనీలు ఎంత పెంచుతున్నాయంటే.??
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్(Cars Prices Hike) ఏప్రిల్ 1 వ తేదీ నుంచి కార్ల ధరలను పెంచనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టయోటాతో మరో రెండు ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు కూడా ధరలను పెంచనున్నాయి. మరి కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర కార్ల ధరలు పెరగనున్నాయో తెలుసుకుందాం.
మరో రెండు రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకాబోతుంది. ఈ క్రమంలో ఆటో మొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే తన ప్రముఖ మోడళ్లపై 3 శాతం ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు టయోటా కూడా చేరింది.

పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, నిర్వహణ ఖర్చులు అధికం కావడమే ధరల పెంపునకు కారణంగా ఆటో మొబైల్ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్(Toyota Kirloskar Motors).. ఎంపిక చేసిన మోడళ్లపై 1 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
భారత మార్కెట్లో టయోటా మోటార్స్.. హ్యాచ్బ్యాక్ల నుంచి ఎస్యూవీల వరకూ విక్రయిస్తోంది. నాణ్యత, పనితీరు పరంగా టయోటా కార్లకు ప్రజాదరణ అధికంగా ఉంది. సంస్థ ఇప్పటికే 10 మోడళ్ల వరకూ విక్రయిస్తుండగా.. వాటిలో టయోటా ఫార్చ్యూనర్ను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాగా టయోటా మోడళ్ల ధరలు భారత మార్కెట్లో రూ. 6.86 లక్షల నుంచి రూ. 2.10 కోట్ల వరకూ ఉన్నాయి.

టయోటా మోటార్స్ తన కార్లపై ధరలను పెంచడం ఇది రెండోసారి. గత జనవరిలో ఒకసారి ధరల పెంపును చేపట్టగా.. ఇప్పుడు మరోసారి పెంచుతోంది. ఇక ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా(Kia India) మోటార్స్ కూడా.. ఎంపిక చేసిన మోడళ్లపై పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. కియా కార్ల ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 65.95 లక్షల వరకూ ఉన్నాయి.

ఇక జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్కు భారత మార్కెట్లో మంచి సేల్స్తో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు ఈ సంస్థ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఎంత శాతం మేర ధరలు పెరుగుతాయనే దానిపై అధికార సమాచారం అందుబాటులో లేదు.
భారత మార్కెట్లో ప్రస్తుతం హోండా మోటార్స్(Honda Motors).. అమేజ్ , సిటీ, సిటీ హైబ్రిడ్ మరియు ఎలివేట్ అనే మూడు మోడల్లను విక్రయిస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ మోడళ్ల ధరలు పెరగనున్నాయి. హోండా కార్ల ధరలు భారత మార్కెట్లో రూ. 7.16 లక్షల నుండి రూ. 20.39 లక్షల మధ్య ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇక దేశంలో కార్ల విక్రయాల పరంగా టాప్ 4లో కొనసాగుతున్న మారుతీ సుజుకి(Maruti Suzuki), టాటా మోటార్స్(Tata Motors), మహీంద్రా అండ్ మహీంద్రా(Mahindra And Mahindra), హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors).. తమ కార్లపై ధరల పెంపును ప్రకటించనప్పటికీ త్వరలో వీటిపై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఊహించవచ్చు.


Click it and Unblock the Notifications








