ముందుంది ముసళ్ల పండగ అంటున్న ఆ కంపెనీ.. కొత్త కార్ల విడుదలకు రంగం సిద్ధం.. ఇక రచ్చ రచ్చే!
రెనాల్ట్ పూర్తి స్థాయిలో భారతీయ మార్కెట్పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కంపెనీ లోని వివిధ ఫేమస్ లైనప్స్ని విస్తరించాలని యోచిస్తోంది. రానున్న సంవత్సరంలో కొత్త కార్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. త్వరలో లాంచ్ కానున్న కార్లలో డస్టర్ నుంచి అప్డేటెడ్ ట్రైబర్ వరకు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నో కార్లు మార్కెట్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లోనే భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఈ రంగంలో భారత్ దూసుకెళ్తుండటంతో ప్రపంచంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు భారత్లో తమ ఉత్పత్తులను విస్తరించే యోచనలో ఉన్నాయి. వీటిలో పలు కంపెనీలు ఇప్పటికే కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.
దేశీయ మార్కెట్లో ఎస్యూవీల నుంచి ఎలక్ట్రిక్ కార్లు, ఎంపీవీల వరకు ఎన్నో లైనప్ కార్లు కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఇక రెనాల్ట్ భారతీయ మార్కెట్ని ఒడిసిపట్టుకునేందుకు దేశీయ మార్కెట్లో రూ.5,300 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ క్విడ్, ట్రైబర్, కిగర్ కార్లను మాత్రమే విక్రయిస్తోంది. వీటికి కొనసాగింపుగా కొత్త కార్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి కంపెనీ నిర్ణయించింది.

ముందుగా డస్టర్ (Renault Duster), ట్రైబర్ (Triber MPV) అప్డేటెడ్ వెర్షన్లను ప్రవేశపెట్టనున్నారు. ఆటోమొబైల్ ఔత్సాహికులు ఈ మోడళ్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవి మార్కెట్లో అడుగుపెడితే కంపెనీ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న కారు మోడళ్లకంటే వీటిని భారీ ఫీచర్లతో కంపెనీ అప్గ్రేడ్ చేయనుంది. వీటికి సంబంధించిన వివరాలపై ఈ కథనంలో..
రెనాల్ట్ డస్టర్: భారతీయ మార్కెట్లో అత్యంత విప్లవాత్మకమైన కార్లలో రెనాల్ట్ డస్టర్ ఒకటి అని చెప్పవచ్చు. దీని థర్డ్ జనరేషన్ కారును త్వరలోనే భారతీయ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కారును గత ఏడాది అంతర్జాతీయంగా యూరోపియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ కారు 2025 ద్వితీయార్థంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టుంది.

దీనిని ఆ సంస్థకు చెందిన CMF-B ప్లాట్ఫామ్పై నిర్మించనున్నారు. ఇది రెండు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. ఈ రెండు 130 ps పవర్ని ఉత్పత్తి చేసే టర్బో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్తో రానుంది. అలాగే ఆఫ్రోడ్స్ కోసం ఈ కారు 209mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
రెనాల్ట్ బిగ్స్టర్ 7-సీటర్ ఎస్యూవీ: రెనాల్ట్ తన అంతర్జాతీయ అనుబంధ సంస్థ డాసియా బ్రాండ్ కింద బిగ్స్టర్ను విడుదల చేసింది. ఈ కారు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. 5-సీటర్ కారును అంతర్జాతీయంగా విక్రయిస్తుండగా, భారతదేశం విషయానికి వస్తే, దీనిని 7-సీటర్ కారుగా మార్చే యోచనలో కంపెనీ ఉంది. ఇది 7 సీటర్ మార్కెట్ని శాసించే అవకాశం ఉంటుంది. దీనిని కూడా అదే రెనాల్ట్ CMF-B ప్లాట్ఫామ్పై తయారు చేయనున్నారు.

రెనో క్విడ్ ఈవీ: ఇది ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న హ్యాచ్బ్యాక్స్లో మంచి డిమాండ్ని కలిగి ఉంది. దీనిని ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. దీనిని 2025 లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారును ఇప్పటికే డాసియా బ్రాండ్ కింద స్ప్రింగ్ ఈవీ పేరుతో విక్రయిస్తున్నారు. టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
న్యూ జనరేషన్ రెనో ట్రైబర్: ఇది ఇప్పటికే భారత మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ 7 సీటర్కి మార్కెట్లో మంచి వాటా ఉంది. ఈ కారును అప్డేట్ చేసి విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.5.99 లక్షలుగా ఉంది. అప్ డేట్ చేసిన ట్రైబర్ 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్స్పార్క్ ఒపీనియన్: రెనాల్ట్ భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ప్రస్తుతం తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే పనిలో ఈ కంపెనీ ఉంది. ఈ నేపథ్యంలో కొత్త కార్లను ప్రవేశపెట్టడం ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు కంపెనీ యోచిస్తోంది. ఈ కార్లన్నీ లాంచ్ అయితే భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెను విప్లవం తీసుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








