విన్ఫాస్ట్ మూడో తయారీ కేంద్రంగా భారత్.. వేలకోట్ల పెట్టుబడికి సర్వం సిద్ధం!
తమిళనాడు ప్రభుత్వంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న కేవలం 50 రోజుల్లోనే వియత్నాం దేశానికి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'విన్ఫాస్ట్' (VinFast) ఎట్టకేలకు తమ మొదటి ఫ్యాక్టరీ నిర్మించడంలో భాగంగా నిన్న (ఆదివారం) తూత్తుకుడిలో భూమి పూజ పూర్తి చేసింది.
2024 జనవరి 7న ఒప్పందం కుదుర్చుకున్న తరువాత భూమి పూజ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు విన్ఫాస్ట్ ఇండియా సీఈఓ 'ఫామ్ సాన్ చౌ' (Pham Sanh Chau) పాల్గొన్నారు. సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఫ్యాక్టరీ సిలానాథం గ్రామంలోని స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు (SIPCOT) యాజమాన్యంలో రానుంది. త్వరలోనే నిర్మాణపనులు కూడా ప్రారంభమవుతాయి.

టెస్లా మరియు టయోటా కంపెనీల తరువాత అధిక ఈవీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న విన్ఫాస్ట్.. ఇప్పటికే అమెరికాలో టెస్లాకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఈ సంస్థ భారతదేశంలో తన ఉనికిని చాటుకోవడానికి మొదటి దశలో 500 మిలియన్ డాలర్లు లేదా రూ. 4000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడి 2 బిలియన్ డాలర్లకు లేదా రూ. 16000 కోట్లకు చేరనున్నట్లు సమాచారం.
విన్ఫాస్ట్ నిర్మించనున్న ఫ్యాక్టరీ ద్వారా ఏకంగా 10000 మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్లాంట్ నిర్మాణం ఒక ఏడాదిలో పూర్తి చేసి, మరో ఏడాది నాటికి ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఏడాది 1.5 లక్షల కార్లను కంపెనీ తయారు చేయడానికి సంకల్పించింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ కార్లను మన దేశం నుంచి ఎగుమతి చేయనున్నట్లు కూడా తెలుస్తోంది.

భూమి పూజ సందర్భంగా విన్ఫాస్ట్ సీఈఓ మాట్లాడుతూ.. భారతదేశంలో తమ కార్ల మీద రెండు సంవత్సరాలు దిగుమతి సుంకం తగ్గించాలని, అలా చేస్తే కంపెనీ యొక్క ఉత్పత్తులను గురించి కస్టమర్లు తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం కూడా యోచిస్తోంది. ప్రస్తుతం సంస్థ కేంద్రం యొక్క తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు, అంత వరకు ఫ్యాక్టరీ నిర్మాణంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
అంతే కాకుండా తమిళనాడులో వెలది ఉద్యాగాలను సృష్టించడం, వారి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ గణీయంగా పెరుగుతుందని చౌ అన్నారు. వియత్నాం మరియు అమెరికా తరువాత భారత్ మాకు మూడవ తయారీ కేంద్రమని తెలియజేస్తూ.. తమిళనాడు అన్ని విధాలా మాకు అనుకూలమైన ప్రదేశమని, తప్పకుండా ఈవీల తయారీకి మరియు ఎగుమతులకు ఇది చాలా అనువైన ప్రదేశమని తెలిపారు.
2008లో రెనాల్ట్ - నిస్సాన్ ప్రవేశించిన 15 సంవత్సరాల తరువాత తమిళనాడులో అడుగుపెట్టిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారు విన్ఫాస్ట్ కావడం విశేషం. ఈ కంపెనీ అమెరికన్ బ్రాండ్ టెస్లా మరియు చైనా బ్రాండ్ బీవైడీ (BYD) వంటి వాటికి గట్టిపోటీ ఇస్తుంది. ప్రస్తుతం ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి విన్ఫాస్ట్ కంపెనీ ఉత్పత్తులు కూడా తప్పకుండా అధిక ప్రజాదరణ పొందుతాయని విశ్వసిస్తున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








