ఈ ఏడాది కారు కొనాలనుకునేవారికి మంచి ఛాన్స్… ఆటో ఎక్స్పోలో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీలు వచ్చేశాయ్!
దేశంలో ఎస్యూవీల హవా కొనసాగుతోంది. గతేడాది బెస్ట్ సెల్లింగ్ వాహనాల్లో ఎక్కువగా ఎస్యూవీలే ఉన్నాయి. ఈ ఏడాది కూడా వీటి జోరు గట్టిగానే వినిపించనుంది. దిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో.. అనేక దిగ్గజ వాహన తయారీ సంస్థలు తమ కొత్త ఎస్యూవీలను పరిచయం చేసి అదుర్స్ అనిపించాయి. ఇందులో మారుతీ సుజుకీ, హ్యూందాయ్, టయోటా, స్కోడా, ఎంజీ సంస్థలకు చెందిన కార్లు ఉన్నాయి. పైగా అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలే కావడం గమనార్హం. ఈవీలవైపు భారతీయులు ఎక్కువ మక్కువ చూపుతున్న నేపథ్యంలో ఈ సంస్థలు... ఈవీలవైపు దృష్టి పెట్టాయి. టాటా, మహీంద్రా సంస్థలు కూడా ఎస్యూవీలను ప్రదర్శించాయి. ఆ కార్ల పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ఈవెంట్లో లగ్జరీ కార్లకు పేరుగాంచిన మినీ, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, Porsche వంటి సంస్థలు కూడా... తమ నుంచి రానున్న హై- ఎండ్ మోడల్స్ను ప్రదర్శించాయి. అయితే.. ఈ కథనంలో అన్నీ కాకుండా.. ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఐదు మోడల్స్ గురించి తెలుసుకుందాం.

మారుతీ సుజుకీ ఇ- విటారా: ఆటో ఎక్స్పో 2025లో మారుతీ సుజుకీ సంస్థకు చెందిన ఇ- విటారా ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. దేశీయంగా తయారైన ఈ వాహనం.. ఫ్రంట్- వీల్ డ్రైవ్ సిస్టమ్తో రెండు బ్యాటరీ ఆప్షన్లలో ఉంటుంది. ఒకటి 49 kWh మరరొకటి 61 kWh. దీంట్లో టాప్- ఎండ్ మాడల్ ఆల్- వీల్ డ్రైవ్తో ఉంటుంది.
అయితే ఈ కారు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ను గ్లోబల్- స్పెక్ వెర్షన్లో తీసుకువచ్చింది మారుతీ సుజుకీ సంస్థ. దీంట్లోని చిన్న బ్యాటరీ ప్యాక్తో అనుసంధానించిన మోటార్.. 144 PS పవర్, 192.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కి.మీ.ల దూరం ప్రయాణించగలదని మారుతీ సుజుకీ సంస్థ చెబుతోంది.

హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్: హ్యాూందాయ్ తన పాపులర్ క్రెటా మోడల్ కు సంబంధించి ఎలక్ట్రిక్ వెర్షన్ ను ఈ ఈవెంట్లో లాంఛ్ చేసింది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి రూ.23.50 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు సింగిల్ ఛార్జ్తో 473 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. దీంట్లో రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు ఉంటాయి.
ఈ ఈవీ.. ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ అనే నాలుగు వేరియంట్లలో వస్తుంది. దీంట్లో ADAS, పనరోమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్లు, 360 డిగ్రీ కెమెరా వంటి పలు ఫీచర్లు కూడా ఉంటాయి.

టాటా హరియర్ బందీపూర్ ఎడిషన్ & హరియర్ ఈవీ: టాటా మోటార్స్ సంస్థ తన హరియర్ ఎస్యూవీకి సంబంధించి మూడు వెర్షన్లను ఆటో ఎక్స్పోలో లాంఛ్ చేసింది. దాంట్లో బందీపూర్ ఎడిషన్, రెగ్యులర్, స్టెల్త్ వెర్షన్లు ఉన్నాయి. ఈ కారు మెటాలిక్ బ్రోంజ్ ఎక్స్టీరియర్తో ఉంటుంది. కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్కు స్ఫూర్తిగా ఈ మోడల్ను ఈ పేరుతో లాంఛ్ చేసింది.
ఈ కారులో స్టాండర్డ్ హరియర్ మోడల్లో ఉన్నట్లుగా ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. దీంట్లో ప్రొడక్షన్- స్పెక్ హరియర్ ఈవీ... ఆల్- వీల్ డ్రైవ్ సిస్టమ్తో ఉంటుంది. ఇది 500 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక హరియర్ ఈవీ స్టెల్త్ ఎడిషన్.. పూర్తిగా ఆల్- బ్లాక్ ఇంటీరియర్తో ఉంటుంది. matte black రంగు ఎక్స్ టీరియర్తో ఉంటుంది. రెగ్యులర్ హరియర్ ఈవీలో ఉన్నట్లుగానే దీంట్లో పవర్ ట్రెయిన్ ఉంటుంది.
టాటా సియెర్రా: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో టాటా మోటార్స్ సంస్థ ప్రొడక్షన్- స్పెక్ సియెర్రా ఎస్యూవీని ప్రదర్శించింది. ఇది పబ్లిక్తో పాటు, మీడియా దృష్టిని బాగా ఆకర్షించింది. టాటా సియెర్రా ఐసీఈ వెర్షన్... పెట్రోల్, డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో వస్తుంది. దీని ధర రూ.16 లక్షలుగా(ఎక్స్- షోరూమ్) ఉండే అవకాశం ఉంది.
విన్ఫాస్ట్ వీఎఫ్ 3: ఈ ఆటో ఎక్స్పోలో విన్ఫాస్ట్ సంస్థ తన వీఎఫ్3 ఈవీని తీసుకువచ్చి ఆకట్టుకుంది. ఇది కాంపాక్ట్ టూ- డోర్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ. ఇది బాక్సీ డిజైన్తో వస్తుంది. లార్జ్ ప్లాస్టిక్ క్లాడింగ్తో దీనికి రగ్డ్ లుక్ అందిస్తుంది. ఇది మ్యాన్యువల్ ఎయిర్ కండీషనింగ్ కంట్రోల్స్, ఫ్రంట్ పవర్ విండోస్తో ఉంటుంది.
దీంట్లో 10.2 అంగుళాల స్క్రీన్ డిస్ప్లేతో కూడిన మోడర్న్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం ఉంటుంది. ఈ కారు ఒక్కసారి ఫుల్ఛార్జ్ చేస్తే ఏకంగా 215 కి.మీ.ల దూరం ప్రయాణించగలదు. దీంట్లో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ 41PS శక్తిని 110 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








