మొన్నటి వరకు కార్లు.. ఇప్పుడు డ్రోన్లు.. మారుతి సుజుకి ప్లాన్ మామూలుగా లేదు
భారతదేశంలో కార్ల తయారీలో నంబర్ 1 గా ఉన్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), ఇప్పుడు తమ వ్యాపార పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించుకుంది. కార్ల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, కొత్త కాలం అవసరాలకు తగ్గట్లుగా ఇతర రంగాల్లోకి కూడా అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
దీనికోసం కంపెనీ తన మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (MoA) నియమాలను మార్చింది. ఈ మార్పులకు బోర్డు జూలై 31, 2025న ఆమోదం తెలిపింది, ఇప్పుడు ఆగస్టు 28, 2025న జరిగే వార్షిక సాధారణ సమావేశంలో (AGM) షేర్హోల్డర్ల ఆమోదం కోసం ఉంచుతారు.

ఈ కొత్త మార్పుల వల్ల మారుతి ఇప్పుడు డ్రోన్లు, మానవ రహిత ఏరియల్ వెహికల్స్ (UAV), మానవ రహిత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ (UAS) వంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీలను తయారు చేయబోతోంది. అంతేకాకుండా, భవిష్యత్తు మొబిలిటీకి చాలా ముఖ్యమైన ప్రొపల్షన్, కంట్రోల్ సిస్టమ్స్ వంటి టెక్నాలజీల అభివృద్ధిపై కూడా మారుతి దృష్టి పెడుతుంది.
వీటితో పాటు, మారుతి ఇప్పుడు కొత్త వ్యాపార రంగాల్లోకి కూడా వస్తోంది. వాటిలో వెహికల్ లీజింగ్, సబ్స్క్రిప్షన్ మోడల్స్, పాత కార్ల కొనుగోలు, అమ్మకాలు, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, హైడ్రోజన్, బయోగ్యాస్ లాంటి కొత్త ఇంధనాల వ్యాపారం, కార్బన్ క్రెడిట్ లాంటి వ్యాపారాలు, పాత వాహనాల రీసైక్లింగ్ లాంటివి ఉన్నాయి.

ఈ నిర్ణయాలు చూస్తే, మారుతి ఇప్పుడు కేవలం కార్ల తయారీ కంపెనీగా కాకుండా, భవిష్యత్తు కోసం స్మార్ట్, సురక్షితమైన మొబిలిటీ సంస్థగా మారాలని చూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కొత్త వ్యాపార ప్రణాళికలతో పాటు, మారుతి నుంచి రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్ కారు కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు.
ఈ ఎదురుచూపులకు తెరదించుతూ, కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన ఈ-విటారా లాంచ్ తేదీని ఖరారు చేసింది. ఇది సెప్టెంబర్ 3, 2025న భారత మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఈ కారు ఇండియాలోనే కాకుండా యూకే, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ మార్కెట్లలో కూడా అందుబాటులోకి వస్తుంది.

ఈ-విటారా కారు ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు. అంతేకాదు, దీనిపై కంపెనీ 10 సంవత్సరాల వారెంటీ కూడా ఇవ్వనుంది. ఇది మార్కెట్లో గేమ్ ఛేంజర్ అవుతుందని అంచనా. ఈ కారు మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఈవీ, MG ZS EV, MG విండ్సర్ లాంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని అంచనా.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








