కొత్త కార్లు, బైకులు,టెక్ ఇన్నోవేషన్స్కు రెడీ! భారత్ మొబిలిటీ ఎక్స్పోకు సిద్ధమవ్వండి! ఎప్పుడు, ఎక్కడంటే?
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) మూడవ ఎడిషన్ను ఫిబ్రవరి 4 నుండి 9, 2027 మధ్య ఢిల్లీ-NCR ప్రాంతంలో నిర్వహించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దేశంలోని అతిపెద్ద మొబిలిటీ కార్యక్రమాలుగా ఎదిగిన ఈ ఎక్స్పో, ఈసారి మరింత విస్తృత స్థాయిలో, కొత్త విభాగాలతో, ప్రత్యేక సౌకర్యాలతో కొనసాగనుంది. ఇంతకుముందు నిర్వహించినటువంటి మొదటి రెండు ఎడిషన్లు 2024, 2025లో విశేషమైన ప్రజాదరణ పొందాయి. ఈ కార్యక్రమాలకు లక్షల మంది హాజరయ్యారు. వీటి ద్వారా భారతదేశ ఖ్యాతి ప్రపంచానికి తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో మూడవ ఎడిషన్ను కూడా దేశ రాజధాని పరిసరాల్లో ఎంతో అట్టహసంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధం కానున్నారు.
2025 ఎడిషన్ భారత్ మండపం, యశోభూమి, ఇండియా ఎక్స్పో సెంటర్ & మార్ట్, గ్రేటర్ నోయిడా వంటి మూడు వేదికలలో 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరిగింది. 1500 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు దీనిలో పాల్గొన్నారు. ఉత్పత్తి ప్రారంభాలు, సాంకేతిక ప్రదర్శనలు, సమావేశాలు, కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలు, అంతర్జాతీయ ప్రతినిధులతో సహా ఈ కార్యక్రమానికి 9.8 లక్షలకు పైగా సందర్శకులు హాజరయ్యారు.

మునుపటి రెండు ఎడిషన్ల విజయవంతమైన నేపథ్యంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) 2027ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పాత వాటిని కొనసాగిస్తూ, కొత్త వాటిని కూడా దీనిలో చేర్చారు. పాత దానిలో ప్రదర్శనలు, సాంకేతిక సెషన్లు, వాటాదారుల సంప్రదింపులు ఉన్నాయి. ఇవే కాకుండా, ప్రదర్శన స్థాయిని విస్తరించేందుకు ప్రత్యేకంగా కొన్ని కొత్త విభాగాలను ప్రవేశపెట్టే యోచన ఉంది.
ప్రధానంగా, రైలు, రోడ్డు, గాలి, నీరు, పట్టణ, గ్రామీణ మొబిలిటీతో పాటు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ మొబిలిటీ సొల్యూషన్స్కు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. దీనిద్వారా, అన్ని రకాల రవాణా వ్యవస్థల మధ్య సమన్వయం, సులభతరమైన కనెక్టివిటీ, స్మార్ట్ సొల్యూషన్ల ప్రదర్శన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధంగా, ప్రతి వినియోగదారుడికి స్మార్ట్, సస్టైనబుల్, సమగ్ర మొబిలిటీ అనుభవాన్ని అందించడం BMGE ప్రధాన లక్ష్యం.

వాణిజ్యం అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించబడుతున్న ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో అనేది ఆటోమోటివ్, సాంకేతికత, పరిశ్రమల, ప్రభుత్వ రంగాల ప్రతినిధులు, నిపుణులు, పరిశోధకులకు ఒక సమగ్ర వేదికగా నిలుస్తోంది. కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడానికి, వ్యాపార సంబంధాలను ఏర్పరచడానికి, తద్వారా దేశీయంగా,అంతర్జాతీయంగా మొబిలిటీ రంగంలో భారత్ పాత్రను మరింత బలపరిచేలా ఇది సహాయపడనుంది.
ఆటోమోటివ్, ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాలకు చెందిన పలు ప్రఖ్యాత సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి. వాటిలో SIAM, ACMA, ICEMA, ATMA, IESA, ISA, NASSCOM, CII, MRAI, TMA, ఇన్వెస్ట్ ఇండియా, IBEF, ITPO, యశోభూమి, IEML వంటి ప్రతిష్ఠాత్మక భాగస్వామ్యం విశేషమైనది. ఈ మద్దతు, సాంకేతికత, కొత్త ఆవిష్కరణల ప్రదర్శనతో, BMGE 2027 భారత్ మొబిలిటీ రంగంలో గణనీయమైన మైలురాయిగా నిలవనుంది.

ఈ మూడవ ఎడిషన్ ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) లోని మూడు ప్రతిష్టాత్మక వేదికలపై జరగనుంది. అవి న్యూఢిల్లీలోని భారత్ మండపం, ద్వారకలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్ & మార్ట్. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2027, పరిశ్రమలోని ప్రముఖ నాయకులు,అంతర్జాతీయ పరిశ్రమల ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక నిపుణుల భాగస్వామ్యాన్ని విశేషంగా ఆకర్షించే అవకాశముందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








