చైనా ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుంది.. జస్ట్ సింగిల్ ఛార్జ్ చేస్తే చాలు.. లాంచ్ అయ్యేది ఆరోజే
ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు ఏ రేంజ్లో డిమాండ్ ఉందో ఇటీవల కాలంలో జరుగుతున్న అమ్మకాలను చూస్తే తెలిసిపోతుంది. పెట్రోల్, డీజిల్, Cng వంటి సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఈవీ కార్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో దేశీయ, అంతర్జాతీయ వాహన తయారీ కంపెనీలు వరుసగా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే దేశీయంగా టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా, ఇటీవల కొత్త మారుతీ సుజుకీ సైతం ఈవీలపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఇండియా ఈవీ మార్కెట్ రానున్న రోజుల్లో భారీగా విస్తరించే అవకాశం ఉంది. ప్రపంచంలో లేని చాలా అవకాశాలు ఇక్కడ ఉండటం కారణంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈవీ తయారీదారులు ఇప్పుడు భారత్ వైపు చూస్తూ తమ కొత్త పెట్టుబడులను పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే ఇప్పటికే భారత ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు కూడా జరిపాయి.
ప్రపంచంలో అతిపెద్ద ఈవీల తయారీ కంపెనీ టెస్లా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. లోకల్గా అమ్మకాలను పెంచుకోడానికి ఇక్కడే ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలో ప్రపంచంలో టెస్లాకు గట్టి పోటీగా నిలుస్తున్న ప్రముఖ ఈవీ తయారీదారు బీవైడీ (BYD) కంపెనీ సైతం ఇప్పుడు భారత మార్కెట్పై కన్నేసింది. టెస్లాను సవాలు చేయడానికి తన కార్లను ఇండియాలో విడుదల చేస్తుంది.

BYD అనేది చైనాకు చెందిన దిగ్గజ ఈవీ తయారీ సంస్ధ. టెస్లాను కూడా అధిగమించి ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుగా అవతరించింది. ఈ కంపెనీ కార్లు అంతర్జాతీయంగా చాలా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. భారత్లో ఇది మంచి మార్కెట్ కలిగి ఉంది. కంపెనీ ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఈవెంట్లో తన మోడళ్లను ప్రదర్శించింది.
ముఖ్యంగా ఈ ఈవెంట్లో బీవైడీకి చెందిన సీలియన్ 7 (sealion 7 Ev) ఎలక్ట్రిక్ కారు చాలా మందిని ఆకట్టుకుంది. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపల ఫీచర్స్ అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, భారతీయ వినియోగదారులకు అనుగుణంగా ఉంటాయి. అందుకే ఈ కారు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ కారు గురించి కీలక వార్త వచ్చింది.

సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారును ఫిబ్రవరి 17న అధికారికంగా లాంచ్ చేస్తామని BYD ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రాక కోసం చూస్తున్న వారికి ఇది శుభవార్తే. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు రూ.70 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కంపెనీ బంపర్ ఆఫర్ ఇస్తుంది. ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా 17 లోపు కారును బుక్ చేసుకున్నవారికి అదనంగా పలు ప్రయోజనాలు అందిస్తామని కంపెనీ పేర్కొంది.
కస్టమర్లకు 1.50 లక్షల కి.మీ లేదా 7 సంవత్సరాల వారంటీ అలాగే, ఉచిత ఇన్స్టాలేషన్తో ఉచిత 7kW AC ఛార్జర్ను కూడా అందించబోతున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి మొదటి 70 యూనిట్లను మార్చి 7 నుంచి డెలివరీ చేస్తారు. ఈ కారు చైనా, యూరప్ మార్కెట్లో అమ్మకానికి ఉండగా, ఇప్పుడు భారత్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

దీని ప్రీమియం వేరియంట్ సింగిల్ ఛార్జ్తో ఏకంగా 567 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 313 bhp పవర్, 380 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీని RWD వెర్షన్ 6.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుందని బీవైడీ పేర్కొంటుంది. మరో వేరియంట్ ఒక్కసారి ఛార్జ్తో 542 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








