ఒక్కొక్క అడుగు తొక్కుకుంటూ టాప్ 2కు చేరిన టాటా..టాప్ పొజిషన్లో ఏ కంపెనీ ఉందో తెలుసా ?
భారతదేశంలో కార్ల అమ్మకాలు సెప్టెంబర్ 2025లో చాలా ఆసక్తికరంగా మారాయి. జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి నెల ఇదే. పండుగ సీజన్ ఆఫర్లు, తగ్గిన జీఎస్టీ రేట్ల కారణంగా వినియోగదారులు కార్ షోరూమ్లకు పరుగులు తీశారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) నివేదిక ప్రకారం.. సెప్టెంబర్లో ప్రయాణీకుల వాహనాల రిటైల్ అమ్మకాలు 5.8% పెరిగి 2,99,369 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, ఆగస్టుతో పోలిస్తే కొంచెం తగ్గుదల (7.39%) ఉన్నప్పటికీ, మొత్తం సంవత్సరం అమ్మకాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి.
మారుతి సుజుకికి మళ్లీ అగ్రస్థానం
ఎప్పటిలాగే, మారుతి సుజుకి (Maruti Suzuki) అమ్మకాల్లో నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకుంది. సెప్టెంబర్లో కంపెనీ 1,23,242 యూనిట్లను విక్రయించింది. గతేడాది కంటే ఇది మెరుగ్గా ఉంది. మారుతి మార్కెట్ వాటా ఏకంగా 41.17%గా ఉంది. కొత్తగా విడుదలైన విక్టోరిస్ ఎస్యూవీకి వస్తున్న భారీ బుకింగ్స్(25,000 యూనిట్లు దాటింది) కారణంగా రాబోయే నెలల్లో తమ అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

టాటా మోటార్స్: ఈవీలతో భారీ జంప్
సెప్టెంబర్ 2025 నెల టాటా మోటార్స్ (Tata Motors) చరిత్రలోనే అత్యంత అద్భుతమైన నెలగా నిలిచింది. కంపెనీ అమ్మకాలు 41,151 యూనిట్లకు చేరుకున్నాయి. దీని మార్కెట్ వాటా ఏకంగా 13.75% కి పెరిగింది. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్ఫోలియో కారణంగా టాటా ఏకంగా హ్యుందాయ్, మహీంద్రా కంపెనీలను వెనక్కి నెట్టి నంబర్-2 స్థానానికి చేరుకోవడం విశేషం.

హ్యుందాయ్కు గట్టి దెబ్బ
భారత మార్కెట్లో ఎప్పుడూ నంబర్ 2 స్థానంలో ఉండే హ్యుందాయ్ (Hyundai) అమ్మకాలు ఈసారి కొంచెం బలహీనంగా ఉన్నాయి. కంపెనీ సెప్టెంబర్లో 35,812 యూనిట్లను మాత్రమే విక్రయించింది. క్రెటా ఎస్యూవీ తన విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, మొత్తం మీద కంపెనీ మార్కెట్ వాటా 13.72% నుండి 11.96%కి తగ్గింది. ఈ కారణంగా హ్యుందాయ్ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది.

మహీంద్రా స్థిరమైన వృద్ధి
మరోవైపు, మహీంద్రా (Mahindra) తన బలమైన ఎస్యూవీల పోర్ట్ఫోలియోతో స్థిరమైన ప్రదర్శన కొనసాగించింది. కంపెనీ 37,659 యూనిట్ల అమ్మకాలతో నంబర్ 3 స్థానంలో నిలిచింది. స్కార్పియో-ఎన్, థార్, ఎక్స్యూవీ700 వంటి ఎస్యూవీలకు ఉన్న డిమాండ్ ఇంకా బలంగా ఉందని దీని ద్వారా తెలుస్తోంది.

ఇతర కంపెనీల పర్ఫామెన్స్
మిడ్-టేబుల్లో టయోటా (Toyota) 20,303 యూనిట్లు, కియా (Kia) 16,727 యూనిట్ల అమ్మకాలతో పటిష్టంగా ఉన్నాయి. కొత్త ఆక్టావియా వీఆర్ఎస్ (Octavia vRS) లాంచ్ ఆశలతో స్కోడా (Skoda) 6,510 యూనిట్లను విక్రయించింది.
అయితే, హోండా (3,340 యూనిట్లు), నిస్సాన్(1,319 యూనిట్లు) అమ్మకాల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. లగ్జరీ విభాగంలో, బీఎండబ్ల్యూ 1,209 యూనిట్ల అమ్మకాలతో ఈసారి మెర్సిడెస్-బెంజ్ను అధిగమించింది.
భారతదేశంలో కారు విక్రయాల పరంగా సెప్టెంబర్ 2025 నెల చాలా ఆసక్తికరంగా మారింది. వస్తు, సేవల పన్ను (GST) రేటు తగ్గిన తర్వాత వచ్చిన మొదటి నెల ఇది. పండుగల సీజన్, తక్కువ పన్ను రేట్ల ప్రభావం రిటైల్ అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది.


Click it and Unblock the Notifications








