ఒక్క బ్యాన్తో ప్రపంచాన్ని గడగడలాడించిన చైనా! భారత ఎలక్ట్రిక్ వాహనాలకు సైతం బ్రేక్ వేసే నిర్ణయం!
చైనా ప్రభుత్వం అరుదైన భూమి అయస్కాంతాల ఎగుమతిపై నిషేధాన్ని ప్రకటించింది. దీంతో గ్లోబల్ ఆటోమొబైల్ పరిశ్రమతోపాటు పలు కీలక రంగాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలు, డిఫెన్స్ సామగ్రి, శక్తివంతమైన ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి వంటి అనేక రంగాల్లో ఈ అరుదైన భూమి ఖనిజాలు (రేర్ ఎర్త్ మాగ్నెట్స్) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ఎగుమతులు లేకపోవడం వలన కొన్ని ప్రయాణికుల వాహనాలు, టూవీలర్ వాహన అప్లికేషన్స్ తయారీకి తీవ్ర ఆటంకం కలగనుంది. అయస్కాంతాలు, ముఖ్యంగా నియోడిమియం, ప్రాసిడిమియం వంటి పదార్థాలు లేకుండా కీలక రంగాలు ముందుకు సాగటం కష్టమేనని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా నిర్ణయం ప్రకారం ఎగుమతులకు సంబంధించిన నియంత్రణలను కఠినతరం చేయడం, అనుమతుల మంజూరులో జాప్యం వంటి చర్యలు తీసుకోవడం వల్ల సరఫరాకు సంబంధించి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి.
ICRA లిమిటెడ్ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జితిన్ మక్కర్ మాట్లాడుతూ, ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ అరేర్ ఎర్త్ మాగ్నెట్స్ నిల్వలు ఎక్కువగా 2025 జులై మధ్య వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని అంచనా వేశారు. ఈ స్టాక్ పూర్తిగా ఖాళీ అయితే, ఆటోమొబైల్ రంగం నుంచి ప్రారంభించి, హైఎండ్ ఎలక్ట్రానిక్స్ వరకు అనేక రంగాలు ఉత్పత్తిలో అంతరాయం ఎదుర్కొనే అవకాశం ఉంది.

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కోసం చైనాపై ఆధారపడే దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ వనరుల కోసం చూడాలి. భారత వాహన పరిశ్రమ ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. ఈవీలు, ఐసీఈ ప్రయాణికుల వాహనాల తయారీలో ఈ ఖనిజాలు కీలకం కాబట్టి వీటి నిల్వలు సరిపడినంతా అందుబాటులో ఉంచుకోకపోవడం వలన వాహనాల ఉత్పత్తిపై ప్రభావం పడి బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు అనుకున్న సమయనాకి డెలివరీ చేయడానికి వీలుండదు.
తయారీదారులు ఈ అరుదైన భూమి ఖనిజాల కోసం ప్రత్యమ్నాయ మార్గాలపై ఆధారపడే అవకాశం ఉంటుంది. దీంతో వాహనల ధరల్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. భారతదేశం, ఆటోమొటివ్, నాన్-ఆటోమొటివ్ రంగాల్లో అత్యంత కీలకమైన పదార్థాలైన అరుదైన భూమి అయస్కాంత ఖనిజాలపై విదేశీ దిగుమతులపై బాగా ఆధారపడుతోంది. ప్రస్తుతానికి సుమారు $200 మిలియన్ల విలువైన అరుదైన భూమి ఖనిజాలు భారత్ దిగుమతి చేసుకుంటోంది.

ఇందులో సుమారు 85% చైనా నుంచే వస్తోంది, ఇది భారతదేశం విదేశీ ఖనిజ సరఫరాలో అత్యంత ఆధారపడే దశను ప్రతిబింబిస్తుంది. చైనా ఈ అరుదైన భూమి అయస్కాంతాల ఉత్పత్తిలో ప్రపంచ మార్కెట్లో దాదాపు 90% వాటాను కలిగి ఉంది. ఇది 35 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తోంది. అయితే, చైనా ప్రభుత్వం 2025 ఏప్రిల్లో ఎగుమతులను నిలిపివేయడం, వీటిపై నియంత్రణలను మరింత కఠినతరం చేయడం తీవ్రంగా ప్రభావితం చేసింది.
ఈ పరిణామంతో ఆటోమొబైల్ పరిశ్రమ, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన రంగం గందరగోళానికి గురైంది. ఎలక్ట్రిక్ మోటార్లలో కీలకంగా ఉపయోగించే నియోడిమియం, డైస్ప్రోసియం వంటి ఖనిజాల కొరత వలన, వాహనాల ఉత్పత్తి మందగించే అవకాశం ఉంది. ఇది వాహన ధరలపై ప్రభావం చూపి, వినియోగదారులకు కూడా భారమయ్యే అవకాశముంది. చైనా తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఇప్పటికే ఆస్ట్రేలియా, వియత్నాం, అమెరికా వంటి దేశాల్లో కొత్త భాగస్వామ్యాలను చూస్తున్నాయి.

దీనికి ప్రధాన వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ స్పందిస్తూ, "మా కార్యకలాపాల్లో ఎటువంటి అంతరాయం లేదు. పరిస్థితి నిరంతరం మారుతూ ఉంటుంది, మేము దానిని పర్యవేక్షిస్తున్నాము. మా కార్యకలాపాలలో ఎలాంటి ఇబ్బంది రాకుండా, కస్టమర్లకు అందిస్తున్న నాణ్యమైన సేవల్లో రాజీ లేకుండా ఈ సమస్యకు పలు విధాలుగా పరిష్కారాలను అనుసరిస్తున్నామని, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా అన్ని వాటాదారులకు తెలియజేస్తామని మారుతీ సుజుకీ తెలిపింది.


Click it and Unblock the Notifications








