ఈ కారును కనీసం ఒక్కరు కూడా కొనలేదు.. విదేశీ కంపెనీకి పెద్ద షాక్ ఇచ్చిన భారత ప్రజలు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో సుదీర్ఘకాలంగా స్థిరపడే ఆశతో అడుగుపెట్టిన ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం సిట్రోయెన్ (citroen) చాలా కాలంగా అమ్మకాల పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం భారత వాహన మార్కెట్ ఎంతో ఆశాజకంగా ఉంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారుల నుంచి బలమైన పోటీ కారణంగా సిట్రోయెన్ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. తాజాగా 2025 ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలను చూస్తే ఇది అర్థం అవుతుంది. సేల్స్ నివేదిక ప్రకారం, ఏప్రిల్ 2025లో సిట్రోయెన్ భారత్లో కేవలం 339 యూనిట్లను మాత్రమే విక్రయించింది. బ్రాండ్కి ఉన్న అంతర్జాతీయ ఖ్యాతి, యూనిక్ డిజైన్, ప్రీమియం ఫీచర్లకు ఉన్న పేరును బట్టి కంపెనీ అమ్మకాల్లో వృద్ధిని చూపించాలని అనుకున్నప్పటికి క్రమంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతుంది.
ఏప్రిల్ 2025లో సిట్రోయెన్ భారత్లో జరిగిన అమ్మకాలను చూసినట్లయితే వీటిలో C3 హ్యాచ్బ్యాక్ 110 యూనిట్లతో ముందంజలో ఉండగా, దాని ఎలక్ట్రిక్ వేరియంట్ అయిన eC3 109 యూనిట్ల అమ్మకాలతో కాస్త వెనుకపడింది. ఇటీవలే లాంచ్ చేసిన బసాల్ట్ కూపే SUV 66 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ఇక ప్రీమియం SUV విభాగంలో ఉన్న C5 ఎయిర్క్రాస్ అమ్మకాలు 54 యూనిట్లకు పరిమితమయ్యాయి.

అయితే ఇక్కడ గమనించదగ్గ అంశం ఏంటంటే, కంపెనీకి చెందిన మరో మోడల్ అయిన సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ఏప్రిల్ నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపడలేదు. ఇది కంపెనీకి ఓ పెద్ద హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఐదు మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటికీ, కంపెనీకి ఎదురవుతున్న మార్కెట్ స్పందన తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఫ్రెంచ్ బ్రాండ్గా సిట్రోయెన్కు ఉన్న ప్రత్యేకత, రైడ్ క్వాలిటీ వంటి అంశాలను వినియోగదారులు పూర్తిగా స్వీకరించలేకపోతున్నట్టుగా స్పష్టమవుతోంది.
భారతీయ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడంలో ఇప్పటికీ సిట్రోయెన్ పూర్తిగా విజయం సాధించలేదని గణంకాలను చూస్తేనే తెలుస్తుంది. మార్కెట్లోకి అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ, ఈ ఫ్రెంచ్ బ్రాండ్కి వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోవడం పలు కారణాలపై ప్రశ్నలు వేస్తోంది. అయితే, ఈ పరిస్థితికి ఖచ్చితమైన సమాధానం కంపెనీ సైతం వెల్లడించలేకపోతుంది. అయినప్పటికి కూడా సిట్రోయెన్ కొత్త ఆశలతో ఇంకా ముందుకు సాగుతుంది.

ఇటీవల తన వ్యుహాన్ని మార్చుకుని వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను పరిచయం చేసింది. ముఖ్యంగా, C3 హ్యాచ్బ్యాక్, ఎయిర్క్రాస్ SUV, కొత్తగా వచ్చిన బసాల్ట్ కూపే SUV మోడళ్లలో బ్లాక్ ఎడిషన్ వేరియంట్లు వచ్చాయి. ఇవి టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా అమ్మకాలను తిరిగి గాడిలో పెట్టాలనే కంపెనీ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
సిట్రోయెన్ మార్కెట్లో తన డిమాండ్ పెంచేందుకు లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను ప్రవేశపెట్టినప్పటికీ, వాటి ధరలో కొద్దిపాటి వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ C3 డార్క్ ఎడిషన్ రూ. 8,38,300 (ఎక్స్-షోరూమ్) ధరకు లభ్యమవుతోంది. అదే విధంగా, కాంపాక్ట్ SUV విభాగంలో ఉన్న C3 ఎయిర్క్రాస్ డార్క్ ఎడిషన్ రూ.13,13,300కు అందించబడుతోంది.

ఇక ఈ మధ్యే పరిచయమైన కూపే స్టైల్ SUV అయిన బసాల్ట్ బ్లాక్ ఎడిషన్ మోడల్ను రూ.12,80,000 ధరకు మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ బ్లాక్ ఎడిషన్ వేరియంట్ల ధరలు, వాటి స్టాండర్డ్ టాప్-ఎండ్ వేరియంట్ల కంటే సుమారు రూ.19,500 వరకు అధికంగా ఉన్నాయి. ఈ కారు బ్లాక్ కలర్ థీమ్ అప్హోల్స్టరీ, స్పెషల్ బాడీ డెకల్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ వంటి స్టైలిష్ అప్గ్రేడ్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








