జాగ్రత్త! రేపటి నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు పట్టుబడితే జరిమానా, స్వాధీనం! ఆపరేషన్ స్టార్ట్ చేయనున్న అధికారులు
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. వాతావరణ నాణ్యత మరింత దిగజారకూడదని నిర్ణయించిన అధికారులు, రేపటి నుంచే (జులై 1) పాత వాహనాలపై నియంత్రణలు అమలు చేయనున్నారు. జులై 1 నుండి 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, అలాగే 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్ కార్లను అధికారులు సీజ్ చేయడం ప్రారంభిస్తారు. ఇప్పటికే పెద్దఎత్తున వాయు కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలను రోడ్లమీద నడవనీయడం సరి కాదన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే CNG వాహనాల విషయంలో కొంత సడలింపు ఇచ్చారు. 15 ఏళ్ల వయస్సు గల CNG కార్లను కూడా నిషేధించాలనే యోచన ఉన్నప్పటికి, ప్రస్తుతానికి వాటి యజమానులకు ఉపశమనం లభించింది.
మరోసారి నిర్ణయం తీసుకునే వరకు ఈ వాహనాలకు అనుమతి ఉంటుంది. ఇలా, ఈ కొత్త ఆంక్షలతో పాత డీజిల్, పెట్రోల్ వాహన యజమానులు పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ వాహనాలను త్వరగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఢిల్లీ వాసులు పరిశుద్ధ వాతావరణాన్ని అనుభవించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ చర్యలను తీసుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం కలిగించే ప్రభావం ఎంతగానో చర్చకు వస్తుంది.

గతంలోనే ఢిల్లీ వాయు కాలుష్యాన్ని సమూలంగా నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకున్నప్పటికి అవి కొద్ది కాలానికి మాత్రమే మంచి ఫలితాలు ఇచ్చాయి. దీంతో ఈ సారి మాత్రం ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలను తీసుకుంది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) ఇప్పటికే ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, జూలై 1 నుండి పాత వాహనాలపై తీవ్రమైన ఆంక్షలు అమలులోకి రానున్నాయి.
ఇందులో భాగంగా, 10 ఏళ్ల పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలు బహిరంగ ప్రదేశాల్లో లేదా పెట్రోల్ పంపుల వద్ద నిలిపివుంటే, వాటిని అధికారులు స్వాధీనం చేసుకుంటారు. ఇకపై ఈ వాహనాల యజమానులకు పెనాల్టీ కూడా తప్పదు. పాత కార్ల యజమానులకు రూ.10,000 జరిమానా, ద్విచక్ర వాహన యజమానులకు రూ.5,000 జరిమానా విధించబడుతుంది. దీంతో పాత వాహనాలను కలిగిన వారు వాటిని రోడ్డుపై తీసుకురావడం కుదరదు.

వీటికి ఫ్యూయల్ సరఫరా అయ్యే అవకాశమే లేకుండా నిర్ధారించేందుకు, సిటీ అంతటా దాదాపు 500 ఫ్యూయల్ స్టేషన్లలో అత్యాధునిక ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ గుర్తింపు (ANPR) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక వాహనం పెట్రోల్ పంపులోకి వచ్చేసరికి, ఈ కెమెరా నంబర్ ప్లేట్ను స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత సెంట్రల్ వెహికల్ డేటాబేస్కి ఆ డేటా వెళ్లి, వాహనం వయస్సు, ఇంధన రకం, రిజిస్ట్రేషన్ వంటి వివరాలను తక్షణమే ధృవీకరిస్తుంది.
పాత వాహనమని గుర్తిస్తే, ఫ్యూయల్ అందించకూడదని ఆ సిబ్బందికి నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా, వాహన వాడకాన్ని కేవలం రోడ్లపై కాకుండా, ఇంధన సరఫరా స్థాయిలోనే అడ్డుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ విధానాలను అమలు చేస్తోంది. ఇప్పటివరకు సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) పలు సందర్భాల్లో పాత వాహనాలపై నియంత్రణల కోసం ఆదేశాలు జారీ చేశాయి.

వాటి ప్రకారం పాత, అధిక కాలుష్యం ఉత్పత్తి చేసే వాహనాలను దశలవారీగా రోడ్లపై నుంచి తొలగించాలి అని నిర్ణయించారు. కానీ వాస్తవ పరిస్థితిలో, NCR ప్రాంతంలో ఈ నిర్ణయాలను అమలు చేయడంలో ఆశించినంత పురోగతి కనిపించలేదు. పాత వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్లపై తిరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో, వాయు కాలుష్యాన్ని సమూలంగా నియంత్రించడానికి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) మరింత కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications








