అబ్బో కొరియన్ కార్లంటే ఇంత క్రేజా? మూడేళ్లలో 15 లక్షల కార్లు అమ్మేశారుగా!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కొరియన్ కార్ల తయారీదారుల హవా కొనసాగుతోంది. ఏకంగా మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే వారు ఇక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019 ఆగస్టులో తమ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ఏకంగా 15 లక్షల కార్లను విక్రయించి సంచలనం సృష్టించారు.
కియా ఇండియా (Kia India) ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉన్న తమ తయారీ యూనిట్ నుండి 15 లక్షల కారును విడుదల చేయడం ద్వారా ఈ అరుదైన మైలురాయిని చేరుకుంది. విశేషం ఏమిటంటే, 15 లక్షలవ కారుగా కియా కేరెన్స్ (Kia Carens) ఉత్పత్తి కావడం.

536 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనంతపురం ప్లాంట్ కేవలం దేశీయ అమ్మకాలకే కాకుండా ఎగుమతులకు కూడా ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాలకు కార్లు ఎగుమతి అవుతున్నాయి. అమ్మకాల పరంగా చూసినట్లైతే కియా సెల్టోస్ (Seltos) 7,00,668 యూనిట్లతో (46.7%) అగ్రస్థానంలో ఉండగా, సోనెట్ (Sonet) 5,19,064 యూనిట్లతో (34.6%) రెండవ స్థానంలో నిలిచింది.
కేరెన్స్ 2,41,582 యూనిట్ల (16.1%) విక్రయాలతో తనవంతు సహకారం అందించగా, కొత్తగా విడుదలైన సైరస్ (Syros), కార్నివాల్ (Carnival) వంటి మోడళ్లు వరుసగా 23,036 యూనిట్లు (1.5%), 16,172 యూనిట్లు (1.1%) అమ్ముడయ్యాయి. ఈ అద్భుతమైన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి కియా ఇండియా అప్ డేట్ కొత్త కేరెన్స్ విడుదల తేదీని కూడా ప్రకటించింది.

కొత్త కియా కేరెన్స్ మే 8, 2025న విడుదల కాబోతుంది. ఇది మరింత స్మార్ట్, సురక్షితమైన, లేటెస్ట్ ఫీచర్లతో రాబోతోంది. అప్డేటెడ్ ఈ వెర్షన్ మరింత ప్రీమియం ఎక్స్ పీరియన్స్ కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన స్పై షాట్లలో అప్ డేటెడ్ వెర్షన్ ముందు భాగం, కొత్త LED లైటింగ్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ కనిపించాయి.
ఇంటీరియర్లో కొత్త కేరెన్స్ లెవెల్-2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), సెంటర్ కన్సోల్లో చిన్న మార్పులు, 360-డిగ్రీ కెమెరా, కొత్త డ్యాష్బోర్డ్తో రానుందని భావిస్తున్నారు. ప్రీమియం డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీ, వినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చే విధానం కారణంగా కియా చాలా తక్కువ సమయంలోనే భారతదేశంలో అగ్రస్థానానికి చేరుకుంది.

భారతదేశంలో సెల్టోస్తో ప్రవేశించినప్పటి నుండి కియా తన శ్రేణిని సోనెట్, కార్నివాల్, కేరెన్స్, ఇటీవల విడుదలైన సైరస్ కాంపాక్ట్ SUVలతో వేగంగా విస్తరించింది. వినూత్నమైన ఉత్పత్తులను అందించడంలో.. భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో మార్పులు తీసుకురావడంలో తాము స్థిరంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. కియా ఇండియా భవిష్యత్తు చాలా బాగుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
"మా 1.5 మిలియన్ 'మేక్ ఇన్ ఇండియా' వాహనాన్ని విడుదల చేయడం కియా ఇండియాకు.. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ భావోద్వేగ క్షణం. మొదటి సెల్టోస్ నుండి నేటి 1.5 మిలియన్ కేరెన్స్ వరకు ప్రతి కారు మా వినియోగదారులు, భాగస్వాముల నమ్మకం, ప్రేమ, మద్దతుకు నిదర్శనంగా నిలుస్తుంది" అని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గ్వాంగ్గు లీ అన్నారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








