హ్యుందాయ్ సేల్స్ సునామీ.. ఒక్క నెలలో 70 వేల కార్ల అమ్మకాలు..రికార్డు సృష్టించిన వెన్యూ, క్రెటా!
భారతదేశంలో అత్యధికంగా వాహనాలను విక్రయించే కంపెనీలలో ఒకటైన హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors) 2025 అక్టోబర్ అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థ ఒక్క నెలలోనే ఏకంగా 69,894 వాహనాలను విక్రయించింది.
ఈ అమ్మకాల వృద్ధికి ప్రధాన కారణం, హ్యుందాయ్ రెండు అత్యంత పాపులారిటీ సాధించిన మోడల్స్ వెన్యూ (Venue), క్రెటా (Creta). ఈ రెండు ఎస్యూవీ (SUV) మోడళ్లు కలిసి నెలలో 30 వేలకు పైగా యూనిట్లను విక్రయించి, కంపెనీకి రెండవ అత్యధిక నెలవారీ విక్రయాల రికార్డును అందించాయి. పండుగ సీజన్, జీఎస్టీ (GST) తగ్గింపుల కారణంగా ఈ అమ్మకాలు పెరిగాయి.

భారత మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ అక్టోబర్ 2025లో అమ్మకాల పరంగా బలమైన వృద్ధిని సాధించింది. హ్యుందాయ్ మొత్తం 69,894 వాహనాలను విక్రయించింది. ఈ గణాంకం కంపెనీ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన నెలవారీ అమ్మకాలలో రెండవ అత్యధికం. ఇందులో దేశీయంగా 53,792 కార్లు అమ్ముడయ్యాయి. అలాగే, 16,102 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11 శాతం ఎక్కువ.
దసరా, దీపావళి వంటి పండుగ సీజన్, జీఎస్టీ 2.0 అమలుతో వాహనాల ధరలు తగ్గడం అమ్మకాలు పెరగడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. హ్యుందాయ్ అమ్మకాల వృద్ధిలో వెన్యూ, క్రెటా ఎస్యూవీ మోడళ్లదే ప్రధాన పాత్ర. హ్యుందాయ్ అమ్మిన కార్లలో వెన్యూ, క్రెటా మోడళ్లు కలిసి మొత్తం 30,119 యూనిట్లను విక్రయించాయి. కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లలో ఈ రెండు కార్లు బలమైన పోటీని అందిస్తున్నాయి.

చిన్న కార్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టడంతో, హ్యుందాయ్ ప్రస్తుతం ఎక్కువగా ఎస్యూవీ సెగ్మెంట్పైనే దృష్టి సారించింది. గతంలో చిన్న కార్లు హ్యుందాయ్కు భారీ విక్రయాలను తెచ్చిపెట్టాయి. ఈ అమ్మకాల జోరు కొనసాగింపులో భాగంగా, హ్యుందాయ్ త్వరలో వెన్యూ కారు అప్డేట్ మోడల్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
కొత్త వెన్యూ మోడల్కు ఇప్పటికే బుకింగ్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 4న ఇది అధికారికంగా మార్కెట్లోకి రానుంది. ఈ అప్డేటెడ్ వెర్షన్లో కారు బయటి డిజైన్ పెద్ద ఎత్తున మార్చారు. ఇందులో పెద్ద గ్రిల్, స్లిక్ ఎల్ఈడీ లైటింగ్, కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంటీరియర్లలో ప్రీమియం నిర్మాణం, లెవెల్ 2 అడాస్ (ADAS), డ్యూయల్ స్క్రీన్లు, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లు అందించబడ్డాయి. ఇంజిన్ ఆప్షన్లలో 1.2 లీటర్, 1.0 లీటర్ టర్బో, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు, మాన్యువల్/ఆటోమేటిక్ గేర్ ఆప్షన్లు యథావిధిగా ఉన్నాయి. అందుకే కస్టమర్లు ఈ కంపెనీ కార్లు కావాలని కోరుకుంటున్నారు.
మొత్తంగా హ్యుందాయ్ కంపెనీకి జీఎస్టీ తగ్గింపులు, పండుగ సీజన్ బాగానే కలిసొచ్చింది. దీంతో అక్టోబర్ 2025లో 69,894 కార్లను విక్రయించి రెండవ అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును నెలకొల్పింది. వెన్యూ, క్రెటా అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. త్వరలో కొత్త వెన్యూ మోడల్ విడుదల కానుంది. ఇది మార్కెట్లో భారీ సేల్స్ నమోదు చేయడం ఖాయమని ఆటో నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








