హ్యుందాయ్ కొత్త కారు లాంచ్.. కేవలం రూ. 7.50 లక్షలకే 27.1 కి.మీల మైలేజ్.. 5 మంది ఉన్న ఫ్యామిలీకి బెస్ట్
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా (Hyundai India) మార్కెట్లో మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా కొత్త కొత్త కార్లను విడుదల చేస్తుంది. ఎప్పుడూ తన వినియోగదారుల అవసరాలను ముందుగానే గుర్తించి వారికి ఉపయోగకరంగా ఉండే మోడళ్లను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా హ్యుందాయ్ ఎక్స్టర్ ఈఎక్స్ హై-సీఎన్జీ డ్యుయో (Exter Ex Hy-CNG Duo) కారును విడుదల చేసింది. CNG కార్లపై ఎక్కువ దృష్టి పెట్టిన కంపెనీ ఈ మోడల్ను తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ సాధారణంగా మనం చూసే పెద్ద సింగిల్ సిలిండర్లను కాకుండా, రెండు చిన్న సైజ్ CNG సిలిండర్లతో రోడ్డుపైకి అడుగుపెడుతోంది. ఈ డబుల్ సిలిండర్ వ్యవస్థ వల్ల ప్రయాణికులు సులభంగా తమ సామాన్లను ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇది నగరాలలో రోజువారీ వాడకానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU)ను అమర్చింది. ఇది పెట్రోల్ నుండి CNGకి మారడాన్ని మరింత సులభతరం చేస్తుందని హ్యుందాయ్ తెలిపింది. ఈ కొత్త ట్రిమ్ను తీసుకురావడం ద్వారా మార్కెట్లో తన అమ్మకాలు పెరగడానికి వీలవుతుంది. ఎక్స్టర్ ఈఎక్స్ హై-సీఎన్జీ డ్యుయో వేరియంట్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.50 లక్షల నుంచి ఉంది. ఇది ఆన్రోడ్ వచ్చేసరికి మరింత పెరుగుతుంది.

సేఫ్టీ, ఎకానమీ, కంపాక్ట్ డిజైన్ లను దృష్టిలో ఉంచుకుని ఈ కారును హ్యుందాయ్ తీసుకొచ్చింది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, CNG వాహనాల అవసరం మరింతగా పెరుగుతోంది. అటువంటి సమయంలో, హ్యుందాయ్ తీసుకొచ్చిన ఈ డ్యుయో టెక్నాలజీ వినియోగదారులకు సేఫ్టీతో పాటు తక్కువ నిర్వహణ ఖర్చును కూడా అందించనుంది. ప్రధానంగా లోపల ఇంటీరియర్ చాలా విశాలంగా ఉంటుంది. పైగా బూట్ స్పేస్ ఎక్కువగా ఉంది.
డ్యూయల్-సిలిండర్ సెటప్ అందించడం ద్వారా బూట్కు ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది, ప్రయాణీకులు లాంగ్ జర్నీ లాంటివి వెళ్లే సమయంలో ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి ఈ స్థలం బాగా అనుకూలంగా ఉంటుంది. డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు ఫీచర్ ఉంది. దీంతో హైట్కు తగ్గట్టుగా సీటింగ్ పొజిషన్ను సెట్ చేసుకోవచ్చు. అలాగే కీలెస్ ఎంట్రీ, ముందు డాష్లో 4.2-అంగుళాల కలర్ TFT మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంది.
ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత డిజిటల్గా, ఇంటరాక్టివ్గా మారుస్తుంది. వెనుక భాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే H-ఆకారపు LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ పరంగా హ్యుందాయ్ అసలు తగ్గట్లేదు. కారులో కంపెనీ ఆరు ఎయిర్బ్యాగులు ఇచ్చింది. ఇంజిన్ పరంగా చూస్తే, ఇందులో 1.2 లీటర్ ద్వి-ఇంధన (పెట్రోల్ + CNG) ఇంజిన్ ఆప్షన్ ఉంది. ఇది 68 bhp పవర్, 95.2 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
5-స్పీడ్ మాన్యువల్ గెయిర్బాక్స్ను ఇంజిన్కు జోడించారు. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, ఇది కిలో CNGకి 27.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. గతంలో ఎక్స్టర్ హై-సిఎన్జి డుయో అత్యంత సరసమైన వేరియంట్ రూ. 8.64 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈఎక్స్ వేరియంట్ మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
లాంచ్ సందర్భంగా హ్యుందాయ్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, పెరుగుతున్న మా కస్టమర్ల అవసరాలను తీర్చే స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్లను ఇవ్వడానికి ఎల్లప్పుడు కృషి చేస్తాము. హ్యుందాయ్ ఎక్స్ట్రార్ హై-సీఎన్జీ డుయో సిరీస్లో ఈఎక్స్ వేరియంట్ పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా కస్టమర్-కేంద్రీకృత విధానానికి నిదర్శనం అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








