ముంబైలో టెస్లా మొదటి షోరూమ్ రెడీ.. జూలై 15న ఓపెనింగ్.. ఎలాన్ మస్క్ ఇండియాకు వస్తున్నారా ?
టెస్లా కంపెనీ ముంబైలో తన మొదటి షోరూమ్ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్ జూలై 15న ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
టెస్లా ప్రపంచంలోనే అగ్రగామి వాహన తయారీ సంస్థలలో ఒకటి. ఈ కంపెనీ ఆటోమేటిక్గా నడిచే వాహనాలను తయారు చేసి అమెరికా, చైనా వంటి దేశాల్లో విజయవంతంగా విక్రయిస్తోంది. ఇప్పుడు భారతదేశం ఆటోమొబైల్ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్గా మారిన నేపథ్యంలో టెస్లా కూడా ఇక్కడ అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తోంది.

భారతదేశంలో వాహనాలను తక్కువ ధరకు విక్రయించాలంటే టెస్లా ఇక్కడే ఒక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అయితే, అప్పటివరకు కొంత సమయం ఇస్తూ తక్కువ ఇంపోర్టు టారీఫ్తో వాహనాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీనికి టెస్లా అంగీకరించినట్లు సమాచారం.
దీనిలో భాగంగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించాలని టెస్లా నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ షోరూమ్ జూలై 15న ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యే ప్రముఖుల గురించి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. అయితే, మాకు అందిన సమాచారం ప్రకారం.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు.

ముంబైలో సుమారు 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షోరూమ్ ఓపెన్ కాబోతుంది. ఇక్కడ టెస్లా ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతారు. వాహనాల్లో ఉన్న టెక్నాలజీని ఎక్స్ పీరియన్స్ చేయడానికి కూడా ఇక్కడ సదుపాయాలు కల్పించారు. ఇది కాకుండా ఈ షోరూమ్ డైరెక్ట్ సేల్స్ అవుట్ లెట్గా కూడా పనిచేస్తుందని తెలిపారు. ఈ అమ్మకాలను లోకల్ పార్టనర్స్ ద్వారా నిర్వహించాలని టెస్లా నిర్ణయించింది.
టెస్లా భారతదేశంలో తన మొదటి కారుగా మోడల్ Yని దిగుమతి చేసుకుని విక్రయించాలని నిర్ణయించింది. జర్మనీలోని బెర్లిన్లో ఉన్న తమ సొంత ప్లాంట్లో తయారైన కార్లను భారతదేశానికి దిగుమతి చేసుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కారు ప్రారంభంలో దాదాపు రూ. 70 లక్షల ప్రీమియం ధరతో విక్రయానికి వస్తుందని భావిస్తున్నారు.

దీని తర్వాత మోడల్ 3 కారును కూడా భారతదేశానికి తీసుకురావాలని టెస్లా ప్లాన్ చేస్తోంది. ఈ రెండు కార్లు ప్రస్తుతం భారతదేశంలో పరీక్షలలో ఉన్నట్లు గతంలో చూశాం. ఈ కార్లు ప్రీమియం టెక్నాలజీతో వస్తాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని టెస్లా కార్లను భారతదేశంలో విక్రయించనున్నారు.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం: టెస్లా భారతదేశంలో పెద్ద ఎత్తున వృద్ధి సాధిస్తుందని అంచనా. జూలై 15న మొదటి షోరూమ్ ప్రారంభం కావడం ఈ దిశగా ఒక పెద్ద అడుగు, ఇది మార్కెట్లో భారీ అంచనాలను పెంచుతోంది. భారతీయ ఈవీ మార్కెట్కు టెస్లా రాక ఒక గేమ్ చేంజర్ అవుతుంది అనడంలో సందేహం లేదు. భారతీయులకు కూడా టెస్లా కార్ల ద్వారా కొత్త టెక్నాలజీ పరిచయం కాబోతుంది.


Click it and Unblock the Notifications








