కొత్త కారు బుక్ చేశారా? పాత బుకింగ్లకు కూడా కొత్త ధరలు వర్తిస్తాయా? ఈ విషయం తప్పక తెల్సుకోండి
కొత్త కార్ల ధరలు తగ్గనున్నాయని భారీగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కారు కొందామని ఆలోచిస్తున్నారా ? అయితే, కొత్త జీఎస్టీ రేట్లు అనేది సెప్టెంబర్ 22 తర్వాతే అమల్లోకి వస్తుంది. కానీ, అంతకు ముందే కారు బుక్ చేసుకున్న వారికి కూడా ప్రయోజనం లభిస్తుందా ? లేదా ? అనే విషయం మీద చాలా మందికి సందేహాలు ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి ప్రశ్నలతో గందరగోళానికి గురవుతున్నారా? అయితే ఈ వార్తలో వాటికి సమాధానం తెలుసుకోండి.
భారత ప్రభుత్వం కార్లపై జీఎస్టీని తగ్గించి సామాన్య ప్రజలకు పెద్ద ఊరట కల్పించింది. ఈ నిర్ణయంతో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ప్రయోజనం లభిస్తుంది. చాలా కంపెనీలు ఇప్పటికే జీఎస్టీ 2.0 ప్రకారం తమ కొత్త ధరలను ప్రకటించాయి. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.

అయితే, ఇప్పుడు చాలామందికి ఒక ప్రశ్న తలెత్తుతోంది. సెప్టెంబర్ 22 కంటే ముందే కారు బుక్ చేసుకున్న వారికి కూడా ఈ కొత్త జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం లభిస్తుందా? దీనికి సమాధానం అవును అని తెలుస్తోంది. ఈ నిర్ణయం ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక కొత్త ఉత్సాహం ఇస్తుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.
మారుతి సుజుకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 22 లేదా ఆ తర్వాత కారు డెలివరీ తీసుకునే ప్రతి కస్టమర్కు కొత్త జీఎస్టీ ప్రయోజనం లభిస్తుంది. ఎందుకంటే, జీఎస్టీ అనేది కారు ఫైనల్ బిల్లింగ్ సమయంలోనే వర్తిస్తుంది. అంటే, డెలివరీ తీసుకునే రోజున చివరి చెల్లింపు చేసేటప్పుడు, కొత్త జీఎస్టీ రేట్లకు అనుగుణంగా పన్ను వసూలు చేస్తారు.

కాబట్టి, బుకింగ్ ఎప్పుడు చేసినా, డెలివరీ సెప్టెంబర్ 22 తర్వాత తీసుకుంటే, తగ్గిన ధరల ప్రయోజనం కచ్చితంగా లభిస్తుంది. దీంతో నవరాత్రులు, దీపావళి వంటి పండుగల సమయంలో అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
అంతేకాకుండా, సెప్టెంబర్ 22 కంటే ముందు డెలివరీ తీసుకునే వారికి ఈ కొత్త జీఎస్టీ ప్రయోజనం లభించదు. పాత రేట్ల ప్రకారమే వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చాలామంది కారు కొనుగోలుదారులు తమ డెలివరీని సెప్టెంబర్ వరకు వాయిదా వేసుకున్నారు. దీనివల్ల గత ఆగస్టు నెలలో వాహనాల అమ్మకాలు తగ్గాయని వాహన డీలర్ల సంఘం (FADA) తెలిపింది.

కస్టమర్లు తగ్గిన రేట్ల ప్రయోజనం కోసం డెలివరీలను సెప్టెంబర్ వరకు వాయిదా వేయడం అమ్మకాలపై ప్రభావం చూపింది. ఈ నిర్ణయం కస్టమర్ల విశ్వాసాన్ని పెంచి, మార్కెట్ను తిరిగి పుంజుకునేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏ కార్ల ధరలు తగ్గుతాయి?
జీఎస్టీలో ఈ మార్పు వల్ల కొన్ని కార్ల ధరలు భారీగా తగ్గుతాయి. ముఖ్యంగా చిన్న కార్లు, ఎంట్రీ లెవల్ కార్లకు ఇది పెద్ద ప్రయోజనం. పెట్రోల్ లేదా సీఎన్జీతో నడిచే చిన్న కార్లు, 1200 సీసీ ఇంజిన్, 4000 మిమీ పొడవు ఉన్నవాటికి పన్ను 29% నుంచి 18%కి తగ్గింది. మారుతి సుజుకి ఆల్టో కే10, స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20, రెనో క్విడ్, టాటా టియాగో వంటి కార్లు చౌకగా మారతాయి.
1500 సీసీ ఇంజిన్, 4000 మిమీ పొడవు ఉన్న డీజిల్ కార్లపై పన్ను 31% నుంచి 18%కి తగ్గింది. టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ వెన్యూ వంటి మోడల్స్ ధరలు కూడా తగ్గుతాయి.
పెద్ద పెట్రోల్, డీజిల్ కార్లపై పన్ను చిన్న కార్ల కంటే ఎక్కువ ఉన్నప్పటికీ, అవి కూడా పాత రేట్ల కంటే తక్కువకే లభిస్తాయి. 1200 సీసీ ఇంజిన్, 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న కార్లపై పన్ను 45% నుంచి 40%కి తగ్గింది. ఇందులో 28% జీఎస్టీ, 17% సెస్ ఉన్నాయి. మారుతి సుజుకి బ్రెజా, ఎక్స్ఎల్6, హ్యుందాయ్ క్రెటా, హోండా సిటీ వంటి కార్లు ఈ కేటగిరీలో ఉన్నాయి.
1500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న డీజిల్ కార్లపై పన్ను 48% నుంచి 40%కి తగ్గింది. ఇందులో 20% సెస్ కూడా ఉండేది. ఇప్పుడు ఆ సెస్ 12%కి తగ్గింది. టాటా హ్యారియర్, సఫారి, మహీంద్రా స్కార్పియో-ఎన్, ఎక్స్యూవీ700 వంటి కార్లు చౌకగా లభిస్తాయి.
ఈ జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఆటోమొబైల్ మార్కెట్కు ఒక ఊపునిస్తుందని, ముఖ్యంగా పండుగ సీజన్లో అమ్మకాలను పెంచుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చర్య వల్ల వినియోగదారులు కూడా ప్రయోజనం పొందుతారు.


Click it and Unblock the Notifications








