జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లు కావాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.. హ్యాకర్ల దెబ్బకు దుకాణం బంద్
సైబర్ నేరాలు ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. కంపెనీలను, ప్రభుత్వ వ్యవస్థలను టార్గెట్ చేసే హ్యాకర్లు ఇప్పుడు లగ్జరీ కార్ల తయారీ సంస్థలను కూడా విడిచి పెట్టడం లేదు. దీనికి తాజా ఉదాహరణ.. టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్). సెప్టెంబర్ 2న జరిగిన సైబర్ దాడి కారణంగా కంపెనీ తన కార్ల ఉత్పత్తిని వచ్చే అక్టోబర్ 1వరకు నిలిపివేసింది.
టాటా గ్రూప్కు చెందిన బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇప్పుడు ఒక భారీ సైబర్ దాడి కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ దాడి వల్ల కంపెనీ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవడమే కాకుండా రోజుకు వంద కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తోంది.

ఈ సంఘటన వల్ల ఒక్క జేఎల్ఆర్ మాత్రమే కాదు, దాని అనుబంధ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు, వేలాది మంది ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సైబర్ దాడి వల్ల కంపెనీకి ఎంత నష్టం వాటిల్లింది.. దాని ప్రభావం ఏవిధంగా ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టాటా గ్రూప్కు చెందిన బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఒక భారీ సైబర్ దాడి కారణంగా తన ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. ఆగస్టు 30న జరిగిన ఈ సైబర్ దాడి వల్ల కంపెనీ ఇంటర్నల్ సిస్టమ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. గతంలో సెప్టెంబర్ 24 వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ, ఇప్పుడు ఆ గడువును ప్రస్తుతం అక్టోబర్ 1, 2025 వరకు పొడిగించింది.

ఈ ఊహించని పరిణామంతో కంపెనీకి కొన్ని వందల కోట్ల నష్టం వాటిల్లుతోంది. సైబర్ దాడి జరిగిన వెంటనే, దాని ప్రభావం కంపెనీపై తీవ్రంగా పడింది. ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు, డీలర్ల వద్ద కొత్త కార్ల అమ్మకాలు, విడిభాగాల ఆర్డర్లు, రిటైల్ కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. ఈ దాడి రాన్సమ్వేర్ దాడి అయి ఉంటుందని సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అధికారికంగా కంపెనీ దాడి స్వభావం గురించి వివరాలు వెల్లడించలేదు.
ఈ దాడికి "స్కాటర్డ్ ల్యాప్సస్ అండ్ హంటర్స్" అనే హ్యాకర్ల గ్రూప్ బాధ్యత వహించినట్లు సమాచారం. ఈ గ్రూప్లో ఇంగ్లీష్ మాట్లాడే టీనేజర్స్ ఉన్నారని భావిస్తున్నారు. ఈ దాడిపై ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (NCSC), చట్ట అమలు సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

ఈ సైబర్ దాడి వల్ల JLR భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. జేఎల్ఆర్ బ్రిటన్లోని మూడు ప్రధాన ఫ్యాక్టరీలు (సోలిహల్, హేల్వుడ్, వోల్వర్ హాంప్టన్) ఉత్పత్తి నిలిచిపోవడంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్లాంట్లలో రోజుకు దాదాపు 1,000 కార్లు తయారవుతాయి. ఒక అంచనా ప్రకారం.. కంపెనీకి రోజుకు దాదాపు రూ. 60 కోట్లు నష్టం వాటిల్లుతోంది.
ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల కంపెనీకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ నిలిపివేత నవంబర్ వరకు కొనసాగితే, ఆదాయంపై 2.2 బిలియన్ ఫౌండ్ల(రూ. 22,770 కోట్లు), లాభాలపై 150 మిలియన్ ఫౌండ్లు(రూ. 1,552.5 కోట్లు) ప్రభావం పడవచ్చు. ఈ సైబర్ దాడి ప్రభావం కేవలం కంపెనీకే పరిమితం కాలేదు. జేఎల్ఆర్ లో పనిచేసే 33,000 మంది ఉద్యోగులలో చాలా మందిని ఇంటి వద్ద ఉండమని కోరారు. ఇది వారి ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఈ ఉత్పత్తి నిలిపివేత వల్ల బ్రిటన్ వ్యాప్తంగా జేఎల్ఆర్ సరఫరా గొలుసులో భాగమైన లక్షకు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. చాలా చిన్న సరఫరాదారులు ఇప్పటికే తమ ఉత్పత్తిని నిలిపివేసి, ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం ప్రారంభించారు. కార్ల తయారీ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వీరు మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించడానికి సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సైబర్ దాడి జరిగినప్పటికీ, JLR తమ వినియోగదారుల డేటా దొంగిలించబడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. భద్రతను మెరుగుపరచడానికి 2023లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తో £800 మిలియన్ల(రూ. 8,280 కోట్లు) విలువైన ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఈ దాడి జరగడం షాకింగ్ అని చెప్పవచ్చు.
కంపెనీ తన కార్యకలాపాలను సురక్షితంగా, దశలవారీగా పునఃప్రారంభించడానికి నిపుణులతో కలిసి నిరంతరం పని చేస్తోంది. ఈ కష్ట సమయంలో వినియోగదారులు, సరఫరాదారులు, ఉద్యోగులు, డీలర్లకు మద్దతు ఇవ్వడంపైనే దృష్టి సారించినట్లు కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








