మారుతినే అనుకుంటే అన్నీ మొదలు పెట్టాయి.. కియా కూడా కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది
మరికొద్ది రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. దీంతో అన్ని బ్రాండ్లు తమ ధరల పెంపును ప్రకటిస్తున్నాయి. దీని వల్ల కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయక తప్పని పరిస్థితి ఎదురుకాబోతుంది. ధర పెంపునకు బీజం మొదట దేశంలోని అతిపెద్ద కార్ బ్రాండ్ మారుతి సుజుకి వేసింది.
ఏప్రిల్ 1నుంచి తమ కార్ల ధరలను 4శాతం వరకు పెంచుతున్నట్లు మారుతి సోమవారం ప్రకటించింది. దాని తర్వాత నిన్న టాటా కూడా కమర్షియల్ వెహికల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వాటి దారిలోనే ఒక ప్రముఖ కొరియన్ బ్రాండ్ కియా కంపెనీ కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

వచ్చే నెల నుంచి కియా కార్ల ధరలు 3శాతం వరకు పెరగనున్నాయి. కియా తన మొత్తం మోడల్ లైనప్లో ధరల పెరుగుదలను అమలు చేస్తోంది. ధరల పెరుగుదల ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ధరల పెరుగుదలకు ప్రధానంగా అధిక ఇన్పుట్ ఖర్చులు , డిస్ట్రిబ్యూషన్ చైన్కు సంబంధించిన ఖర్చులు పెరిగిపోవడమే కారణం. ఈ కారణాల వల్ల కియా జనవరి 2025లో ధరలను 2 శాతం వరకు పెంచింది.
ఈ నిర్ణయం వినియోగదారుల మీద ధరల ప్రభావం పడినప్పటికీ.. వాహన నాణ్యతను కాపాడుకోవడానికి ఇలాంటి చర్యలు తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. రాబోయే వారాల్లో ఇతర తయారీదారులు కూడా దీనినే ఫాలో అవుతారని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కొత్త ధరల పెరుగుదలతో ఏప్రిల్ 1 నుండి కియా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల ఇంకాస్త మనీ ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కాబట్టి, కియా కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారు మార్చి నెలాఖరులోపే కొనుగోలు చేయడం మంచిది. ఇప్పటివరకు కియా భారత మార్కెట్లో ఏడు వాహనాలను విడుదల చేసింది. అవి సెల్టోస్, సిట్రోయెన్, సోనెట్, కారెన్స్, కార్నివాల్, EV6, EV9. భారత మార్కెట్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే కియా దేశంలో బలమైన ఉనికి ఏర్పాటు చేసుకోగలిగింది.
కియా ఇండియా ఇప్పటివరకు దేశీయ, విదేశీ మార్కెట్లలో సుమారు 1.45 మిలియన్ యూనిట్లను విక్రయించింది. కియా బెస్ట్ సెల్లింగ్ మోడల్ కాంపాక్ట్ SUV సెల్టోస్. ఇండియాలో ప్రవేశపెట్టిన కియా మొట్టమొదటి కారు మోడల్ సెల్టోస్ ఇప్పటివరకు 6,90,000 యూనిట్లను విక్రయించింది. సోనెట్ సబ్-4 మీటర్ SUV 5,00,000 యూనిట్లకు పైగా అమ్మకాలతో కాస్త వెనుకబడి ఉంది. కారెన్స్ (2,32,000), కార్నివాల్ (15,000)యూనిట్లను విక్రయించింది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి అనుబంధంగా కియా 2017 ఏప్రిల్లో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ కంపెనీ ఏపీలోని అనంతపురం జిల్లాలో వాహన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. 2019 ఆగస్టులో దాని కార్యకలాపాలు ప్రారంభించిన ఈ ప్రాంట్ వార్షిక ఉత్పత్తి కెపాసిటీ 3,00,000 యూనిట్లు. ఈ బ్రాండ్కు దేశంలో 725 టచ్ పాయింట్ల విస్తృత నెట్వర్క్ ఉంది.
ఫిబ్రవరి 2025లో కియా భారతదేశంలో 25,026 కార్లను విక్రయించింది. కొత్తగా లాంచ్ చేసిన సిట్రోయెన్ 5425 యూనిట్ల అమ్మకాలను సాధించింది. కంపెనీ తన మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ కొత్త వాహనాలను విడుదల చేయబోతోంది.
ఈ కొరియన్ బ్రాండ్ ఈ ఏడాదిలో దేశంలో కారెన్స్ ఫేస్లిఫ్ట్, కొత్త ఎలక్ట్రిక్ MPVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త కియా కారెన్స్ ఏప్రిల్లో వస్తుంది. ఇంతలో కారెన్స్ ఈవీ జూన్ 2025లో లాంచ్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








