సత్తా చాటిన మహీంద్రా నయా మోడల్.. ప్రతి 10 నిమిషాలకు ఒక కారు డెలివరీ!
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మహీంద్రా దూసుకుపోతోంది. ముఖ్యంగా వారి కొత్త ఎలక్ట్రిక్ కార్లైన XUV 9e, BE 6లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. బుకింగ్లు భారీగా రావడంతో, మహీంద్రా వీటి డెలివరీలను కూడా వేగవంతం చేసింది. కేవలం 70 రోజుల్లోనే 10,000 కార్లను డెలివరీ చేసి ఒక పెద్ద మైలురాయిని చేరుకుంది. ఈ కార్ల డెలివరీల పరిస్థితి ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మహీంద్రా కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ కార్లైన ఎక్స్యూవీ 9ఈ, బీఈ 6లలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ కంపెనీ గత రెండు నెలల్లో పెద్ద సంఖ్యలో కస్టమర్లకు ఈ కార్లను డెలివరీ చేసింది. ఈ కార్లకు భారీగా బుకింగ్లు వస్తున్న నేపథ్యంలో మహీంద్రా వీలైనంత ఎక్కువ మంది కస్టమర్లకు కార్లను డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తోంది.

మహీంద్రా కంపెనీ గత మార్చి 20వ తేదీ నుండి తమ ఎలక్ట్రిక్ కార్లైన ఎక్స్యూవీ 9ఈ, బీఈ 6 ల డెలివరీలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్యాక్ 3 వెర్షన్ డెలివరీలపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది. మార్చి నెలలోనే దాదాపు 6,900 కార్లను కంపెనీ డెలివరీ చేసింది.
తాజాగా ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలు బాగా పెరిగాయి. కేవలం 70 రోజుల్లోనే మొత్తం 10,000 వాహనాలను డెలివరీ చేసినట్లు మహీంద్రా తెలిపింది. ఈ కంపెనీ ప్రతి 10 నిమిషాలకు ఒక కారును డెలివరీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ 10 వేల కార్లలో ఎక్స్యూవీ 9ఈ కారు వాటానే ఎక్కువగా ఉంది.

ఈ కారును బుక్ చేసుకున్న చాలా మంది కస్టమర్లు ప్యాక్ 3 వేరియంట్నే ఎంచుకున్నారు. ఈ కార్ల కోసం బుకింగ్లు భారీగా వస్తుండటంతో, ఎక్స్యూవీ 9ఈ, బీఈ 6 ల ఉత్పత్తిని మహీంద్రా పెంచింది. ఈ రెండు కార్లకు బుకింగ్లు ప్రారంభమైన మొదటి రోజునే 30,179 కార్లను ప్రజలు బుక్ చేసుకున్నారని కంపెనీ తెలిపింది.
మహీంద్రా కంపెనీ ఈ కార్ల మిడ్-స్పెక్ ప్యాక్లను జూలై నెలలో డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది మాత్రమే కాదు, బేస్-లెవెల్ ప్యాక్లను బుక్ చేసుకున్న కస్టమర్లు మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. వారు బుక్ చేసుకున్న కార్ల డెలివరీలు ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్యూవీ 9ఈ, బీఈ 6 కార్లు ఇకూలోవ్ స్కేట్బోర్డ్ ఈవీ ప్లాట్ఫామ్పై తయారు చేయబడ్డాయి. మహీంద్రా తదుపరి ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కూడా ఇదే ప్లాట్ఫామ్పై తయారు చేయాలని నిర్ణయించారు.
ఈ రెండు కార్లు పూర్తి ఛార్జ్తో 500 కి.మీ.ల వరకు ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది రియల్ వరల్డ్ రేంజ్ అని కంపెనీ చెబుతోంది. ఈ రేంజ్ 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో లభిస్తుంది. ఈ కారులో 59 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారు రూ. 21.90 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) అమ్ముడవుతోంది.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కార్లు ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కార్లకు బుకింగ్లు వచ్చినప్పుడే అవి పెద్ద హిట్ అవుతాయని అర్థమైంది. గతంలో మహీంద్రా వాహనాలకు ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండేది. కానీ, ఈసారి వేగవంతమైన డెలివరీ విధానంతో వెయిటింగ్ పిరియడ్ తగ్గించడం అభినందనీయం. ఈ కార్ల అమ్మకాలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








