మహీంద్రా డీజిల్ ఇంజిన్ కార్లకు ఎందుకు డిమాండ్? ఇలా అయితే పెట్రోల్ కార్ల ఉత్పత్తిని ఆపాల్సి వస్తుందా?
భారతదేశంలో రెండవ అతిపెద్ద దేశీయ కార్ల తయారీ సంస్థగా మహీంద్రా కొత్త చరిత్ర సృష్టించింది. దేశీయంగా అత్యాధునిక ఫీచర్స్ కలిగిన కార్లను విడుదల చేస్తూ అమ్మకాల పరంగా సరికొత్త గణంకాలను నమోదు చేస్తుంది. కొంతకాలం క్రితం వరకు మహీంద్రా నాల్గవ స్థానంలోనే స్థిరమై ఉండేది. కానీ గత కొన్ని నెలలుగా, ఈ సంస్థ వేగంగా ఎదుగుతూ హ్యుందాయ్, టాటా మోటార్స్లను అధిగమించింది. ఈ స్థాయికి రావడానికి కంపెనీ ఇటీవల కాలంలో కొత్తగా తీసుకొచ్చిన మోడళ్లు ప్రధాన కారణం. ముఖ్యంగా థార్, స్కార్పియో-N, XUV700 వంటి మోడళ్లకు వినియోగదారుల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇవన్నీ మహీంద్రా వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది.
మహీంద్రా పెట్రోల్ వేరియంట్ల కన్నా డీజిల్ కార్లను విస్తృతంగా విక్రయిస్తోంది. SUV విభాగంలో ఎక్కువగా డీజిల్ ఇంజిన్ వాహనాలనే వినియోగదారులు ఎంచుకుంటున్నారు. అందుకే మహీంద్రా కూడా ప్రధానంగా డీజిల్ వేరియంట్లను దృష్టిలో ఉంచుకుని విస్తరణ కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన సేల్స్ నివేదిక ప్రకారం, 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మహీంద్రా మొత్తం 5,38,597 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ మొత్తంలో 4,25,329 కార్లు డీజిల్ కార్లు అమ్ముడుపోయాయి.

మహీంద్రా కార్ల అమ్మకాలలో డీజిల్ వేరియంట్ల ప్రాధాన్యతను గణాంకాలు బలంగా చూపిస్తున్నాయి. మొత్తం 5,38,597 కార్లలో కేవలం 1,13,268 మాత్రమే పెట్రోల్ ఇంజిన్ కార్లు ఉన్నాయి. అంటే నాలుగు కార్లలో మూడు డీజిల్ వేరియంట్లు కావడం విశేషం. ప్రజల్లో SUVలపై ఉన్న ఆసక్తి, వాటి శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ల సామర్థ్యం, మైలేజి లాంటి అంశాలు ఈ ప్రాధాన్యతకు కారణమవుతున్నాయి. మహీంద్రా స్కార్పియో మరింత అమ్మకాలను సాధించింది.
అమ్మకాల నివేదిక ప్రకారం, సమీక్ష కాలంలో మొత్తం 1,64,842 స్కార్పియో కార్లు అమ్ముడవగా, కేవలం 11,447 యూనిట్లు మాత్రమే పెట్రోల్ ఇంజిన్ కాగా, మిగిలినవి 1,53,395 స్కార్పియో డీజిల్ వేరియంట్లే. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు, మహీంద్రా వ్యూహత్మకంగా డీజిల్ కార్లపై దృష్టి పెట్టి, SUV మార్కెట్లో తమ బలాన్ని మరింత పెంచిందనే మరో సంకేతం. వినియోగదారులు ఎక్కువగా డీజిల్ వేరియంట్లను ఎంచుకుంటున్నారని ఈ గణాంకాలు చాటి చెప్పుతున్నాయి.

మహీంద్రా కార్లలో డీజిల్ ఇంజిన్లకు ఎంతటి ప్రజాదరణ ఉందో గణాంకాలే చెప్పేస్తున్నాయి. స్కార్పియోను కొనుగోలు చేసే ప్రతి 16 మందిలో కేవలం ఒకరే పెట్రోల్ వేరియంట్కి మొగ్గు చూపుతున్నారు. డీజిల్ వేరియంట్తో మాత్రమే లభించే బొలెరో కూడా వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు అందుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 94,750 బొలెరో యూనిట్లు అమ్ముడవడం ఇదే ధోరణికి నిదర్శనం.
అలాగే, మహీంద్రా తన SUV లైన్-అప్లో ఇతర పాపులర్ మోడళ్లలోనూ ఇదే విధమైన పరిస్థితిని చూస్తోంది. XUV700, థార్, థార్ ROXX ఇవన్నీ డీజిల్ వేరియంట్లతోనే అధికంగా విక్రయమవుతున్నాయి. 3-డోర్ల థార్ కూడా విశేషంగా డీజిల్ డిమాండ్ను చూపించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ పెట్రోల్ యూనిట్లు కేవలం 3,235 మాత్రమే అమ్ముడవగా, డీజిల్ వేరియంట్లు దాదాపు 43,009 యూనిట్ల విక్రయాలతో అంచనాలను మించాయి.

5-డోర్ల థార్ ROXX కూడా అదే ట్రెండ్ను కొనసాగించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్కు 32,410 యూనిట్లు డీజిల్ ఇంజిన్తోనే అమ్ముడవగా, పెట్రోల్ వేరియంట్ల అమ్మకాలు కేవలం 6,180 యూనిట్లకు పరిమితమయ్యాయి. అంటే, SUV సెగ్మెంట్లో మహీంద్రా డీజిల్పై పూర్తిగా ఆధారపడినట్లు స్పష్టమవుతుంది. రఫ్ అండ్ టఫ్ఫ్ SUV ఫీలింగ్ రావాలి అని కోరుకునే వినియోగదారులు డీజిల్ వేరియంట్లకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.


Click it and Unblock the Notifications








