12 నెలల్లో కేవలం 166 మంది మాత్రమే కొన్న కారు! దోమలు కొట్టుకుంటున్న డీలర్లు! ఫ్యామిలీ కారుకు ఏమైంది?
దేశీయ ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా (mahindra) మార్కెట్లోకి ప్రతి కొత్త వాహనం విడుదల చేసినప్పుడల్లా మార్కెట్లో మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. సేల్స్ పరంగా ఇతర కంపెనీలకు ధీటుగా మెరుగైన గణంకాలను నమోదు చేయడం మహీంద్రాకు చాలా కాలంగా ఉన్న అలవాటే. ICE ఇంజిన్ వాహనాలు అయినా సరే, ఎలక్ట్రిక్ వేరియంట్లు అయినా సరే, కంపెనీ నుంచి విడుదల అయిన మోడళ్లు చాలా వరకు మర్కెట్లో ప్రజల నుంచి మంచి ఆదరణ సాధిస్తుంటాయి. ఇటీవలి రోజుల్లో టాటా మోటార్స్ను అధిగమించి, దేశంలో మూడవ స్థానాన్ని దక్కించుకున్న మహీంద్రా, కొన్నిసార్లు హ్యుందాయ్ స్థానానికే సవాలు చేసింది. మహీంద్రా కార్లు చాలా బాగా అమ్ముడవుతున్నప్పటికీ, కానీ ఒక కారు మాత్రం ప్రజల నుంచి ఆశించిన విధంగా డిమాండ్ను సాధించలేకపోతుంది.
ఆ మోడల్ పేరే మహీంద్రా మరాజ్జో (Mahindra Marazzo). మార్కెట్లో MPVలకు (మల్టీ పర్పస్ వెహికల్స్) మంచి డిమాండ్ ఉన్నా కూడా, మరాజ్జో మాత్రం వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఇటీవల విడుదలైన సేల్స్ నివేదిక ప్రకారం, ఈ కారు 2025 ఆర్థిక సంవత్సరంలో, కేవలం 166 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. ఇది గత ఏడాది (2024)లో అమ్ముడైన 718 యూనిట్లతో పోల్చితే 77 శాత తగ్గుదల కావడం గమనార్హం.

మరాజ్జో అమ్మకాలు భారీగా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. పోటీకి తగ్గట్లుగా కొత్తగా మారకపోవడం. ఇతర MPV మోడళ్లు అయినటువంటి టయోటా ఇన్నోవా, కియా కారెన్స్, మారుతీ ఎర్టిగా లాంటి వాటితో పోటీ పడటానికి మరాజ్జోకు అవసరమైన లేటెస్ట్ ఫీచర్లు, స్టైల్, మరింత ఫ్యూయల్ ఎఫిషియన్సీ వంటి అంశాలు లేకపోవడం వలన సేల్స్ తగ్గిపోయాయి. అదేవిధంగా కంపెనీ SUV సెగ్మెంట్పై ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా సేల్స్ తగ్గడానికి కారణం.
ఈ పరిస్థితుల్లో, కంపెనీ భవిష్యత్లో మరాజ్జోను మళ్లీ మార్కెట్లో నిలబెట్టే అవకాశం ఉందా లేక దానిని పూర్తిగా నిలిపివేస్తుందా అనే ఆసక్తికర ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఒకవేళ కొత్తగా రీడిజైన్ చేసి, అధునాతన ఫీచర్లతో పాటు అందిరికి అందుబాటు ధరలో మరాజ్జోను తిరిగి విడుదల చేసినట్లయితే, కస్టమర్లను ఆకట్టుకుని ఆశించిన మేరకు అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మహీంద్రా మరాజ్జో, ఎంపీవీ మోడల్గా 2018లో విడుదల అయింది. మార్కెట్లో అప్పటివరకు ఉన్న మారుతీ ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి వాటికి ప్రత్యామ్నాయంగా నిలవాలని లక్ష్యంగా వచ్చింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు దృష్టిలో పెట్టుకుని, స్టైలిష్ డిజైన్తో పాటు ధర పరంగా కొంత అందుబాటులో రూపొందించారు. భారతదేశంలో ఫ్యామిలీ కార్లకు డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోంది.
అయితే ఈ సమయంలో మారుతీ ఎర్టిగా, టయోటా ఇన్నోవా పెద్ద కార్లు మారుతున్న కాలానికి అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్స్లో అప్డేట్ అవుతూ వస్తున్నాయి. కానీ మరాజ్జో విషయానికి వస్తే, అదే పాత మోడల్, తక్కువ అప్డేట్స్, స్పెషలిటీ లేకపోవడం వంటి అంశాలు పెద్ద మైనస్ అయ్యాయి. కొత్త కస్టమర్లు ఏవైతే ఫీచర్లు కోరుకుంటున్నారో అవి ఈ ప్రసిద్ధ కారులో లేకపోవడం వలన ప్రజలను ఆకట్టుకోలేకపోయింది.

మహీంద్రా మరాజ్జో ధర రూ. 14.59 లక్షల నుండి రూ. 17 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. ఇది దాదాపు 18 నుండి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ను ఇంజిన్కు జత చేశారు. ఈ కారులో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. పెద్ద 10.6-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








