గతంలో వద్దనుకున్నారు.. కానీ ఇప్పుడు కావాలంటున్నారు.. సడన్గా ఈ కారుకు పెరిగిన డిమాండ్
ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా (Mahindra), గత కొంతకాలంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తూ వస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ప్రవేశంతో, కంపెనీకి మరింత ఊపు వచ్చి, హ్యుందాయ్ను అధిగమించి దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా అవతరించింది. జూలై 2025లో మహీంద్రా నెలవారీ అమ్మకాలు మళ్లీ అరలక్ష యూనిట్ల మార్క్ను చేరుకున్నాయి. గత నెలలో మాత్రమే కంపెనీ 49,871 యూనిట్లను విక్రయించింది. ఈ గణాంకాలను గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, జూలై 2024లో అమ్ముడైన 41,623 యూనిట్ల నుంచి 2025 జూలైలో 20 శాతం వార్షిక వృద్ధి నమోదు కావడం విశేషం. మహీంద్రా మోడళ్లన్నీ దాదాపుగా ప్రతినెలా కూడా మెరుగైన సేల్స్ను నమోదు చేస్తున్నప్పటికి ఒక్క మోడల్ మాత్రం ఆశించిన మేరకు సేల్స్ సాధించడం లేదు.
మహీంద్రా లైనప్లో గడచిన రెండేళ్లుగా అమ్మకాలలో ఎటువంటి కదలిక చూపలేకపోతోంది, అదే మహీంద్రా మరాజ్జో ఎంపీవీ (Mahindra marazzo Mpv). ఒకప్పుడు ఇన్నోవా క్రిస్టా వంటి బలమైన పోటీదారులతో తలపడేందుకు రంగప్రవేశం చేసిన ఈ MPV, క్రమంగా మార్కెట్లో తన స్థానాన్ని కోల్పోయింది. SUVల పట్ల పెరుగుతున్న ఆసక్తి, MPV విభాగంలో పెరిగిన పోటీ కారణంగా, మరాజ్జోకు కొత్త డిమాండ్ సృష్టించడంలో మహీంద్రా విఫలమైంది.

అయితే గత రెండు సంవత్సరాలుగా అమ్మకాల పరంగా అత్యంత సైలెంట్గా ఉన్న మరాజ్జో జూలై 2025లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రెండేళ్ల తర్వాత, మరాజ్జో అమ్మకాలు మూడు అంకెలను దాటి ఆశ్చర్యపరిచాయి. ఒకే నెలలో 176 యూనిట్లు విక్రయించడం ద్వారా, తన ఉనికిని మళ్లీ గుర్తు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో కేవలం 14 యూనిట్లు మాత్రమే అమ్ముడవడం పరిగణనలోకి తీసుకుంటే, ఇది సంవత్సరానికి దాదాపు భారీ వృద్ధి.
అంతకుముందు కొన్ని నెలలు అమ్మకాలు ఏకంగా 0, 4, 6, 7, 8 యూనిట్లు మాత్రమే నమోదయ్యేవి. అయితే జూలై సేల్స్ చూసినట్లయితే పరిస్థితి కొంత మెరుగైంది అని చెప్పవచ్చు. జూన్ 2025లో కూడా కారు కేవలం 17 యూనిట్లు మాత్రమే అమ్ముడవడం, ఈ మోడల్ స్థితి ఎంత క్లిష్టంగా ఉందో చూపించింది. మార్కెట్లో దాదాపుగా కనుమరుగైపోయినట్లే అనిపించిన కారును జనాలు మెల్లగా ఆదరించడం మొదలుపెట్టారు.

జూలైలో మరాజ్జో అమ్మకాల ఆకస్మిక పెరుగుదల వెనుక ప్రధాన కారణం మహీంద్రా అందించిన భారీ డిస్కౌంట్నే. గతంలో కేవలం రూ.50,000 వరకు మాత్రమే తగ్గింపు ఇచ్చిన కంపెనీ, ఈసారి నేరుగా రూ.2 లక్షల వరకు ధర తగ్గించింది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్తో, గత రెండు సంవత్సరాలుగా దాదాపు మరచిపోయిన ఈ MPVపై మళ్లీ వినియోగదారుల దృష్టి పడింది. ప్రస్తుతం ఈ MPV 7, 8 సీటింగ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
దాని ఎక్స్-షోరూమ్ ధర రూ.14.59 లక్షల నుండి రూ.17 లక్షల వరకు ఉంది. మరాజ్జో1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 121 bhp శక్తిని, 300 Nm టార్క్ను అందించగలదు. ఈ శక్తివంతమైన ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జత చేయబడింది, దీని వల్ల లాంగ్ జర్నీ ప్రయాణాల్లోనూ, నగర ట్రాఫిక్లోనూ సమానంగా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం లభిస్తుంది. మరాజ్జో 18 kmpl నుండి గరిష్టంగా 22 kmpl వరకు మైలేజ్ను అందిస్తుంది.

ఇది రెండు కుటుంబాలు కలిసి ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటుంది. మరాజ్జోను నిజమైన ఫ్యామిలీ కారుగా నిలబెట్టేది దాని ఫీచర్లే. అన్ని వేరియంట్లలోనే ఎయిర్బ్యాగ్లు, ABS, EBD, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి కీలక భద్రతా ఫీచర్లు స్టాండర్డ్గా లభిస్తాయి. వీటితో పాటు సౌకర్యవంతమైన సీటింగ్, పెద్ద లగేజ్ స్పేస్ వంటి అంశాలు మరాజ్జోను పెద్ద కుటుంబాల కోసం మరింత ఆకర్షణీయమైన కారుగా మార్చాయి.


Click it and Unblock the Notifications








