సైనిక బలగాలకు మహీంద్రా సపోర్ట్.. శత్రువులకు చెక్ పెట్టేందుకు భారత ఆర్మీకి పవర్ఫుల్ వాహనం! ఇక ఎదురేలేదు!
దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా (mahindra And mahindra) మరోసారి భారత సాయుధ దళానికి కీలక మద్దతునిచ్చే దిశగా ముందడుగు వేసింది. దేశీయ SUV దిగ్గజం భారత సైన్యానికి 1,986 యూనిట్ల స్కార్పియో పిక్-అప్లను సరఫరా చేయడానికి భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పంద విలువ ఏకంగా రూ.2,700 కోట్ల వరకు ఉండటం గమనార్హం. దీనికి సంబంధించి కంపెనీ ఉన్నతాధికారులు, భారత సాయుధ దళం అధికారుల మధ్య ఒప్పందానికి సంబంధించి సంతకాలు కూడా పూర్తయినట్లు సంబంధిత వర్గాల వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందం మహీంద్రా, భారత రక్షణ దళాల మధ్య దీర్ఘకాలికమైన సహకారానికి మరొక మైలురాయిగా నిలుస్తుంది.
అయితే మహీంద్రా ఆటోమోటివ్ సైన్యానికి వాహనాలను సరఫరా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇరువురి మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి. భారత రక్షణ విభాగానికి మహీంద్రా అనేక రకాల మిలిటరీ-గ్రేడ్ వాహనాలను అందించింది. డీల్ ప్రకారం, మహీంద్రా సైన్యం అవసరాల కోసం శక్తివంతమైన ఇంజిన్ పనితీరును అందించే వాహనాలను ప్రత్యేకంగా తన ప్లాంట్లలో తయారు చేసి సైన్యాధికారులకు అందజేస్తుంది.

తాజా ఒప్పందంతో మహీంద్రా సైన్యానికి సరఫరా చేసే వాహనాల సంఖ్య 4,000 యూనిట్లకు పైగా చేరనుంది. జాబితాలో స్కార్పియో పిక్-అప్, స్కార్పియో N,స్కార్పియో క్లాసిక్, బొలెరో పిక్-అప్ 4WD వాహనాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఇప్పటికే భారత సైన్యంలో 7,000కు పైగా మహీంద్రా స్కార్పియో SUVలు సేవలందిస్తున్నాయి. భారత రక్షణ విభాగానికి అనుగుణంగా రూపొందించిన ఈ వాహనాలు అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులను ఎదుర్కొనేలా, అత్యుత్తమ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి
ఎత్తైన పర్వత ప్రాంతాలు, కఠిన వాతావరణ పరిస్థితులు వంటి పరిస్థితుల్లో, దట్టమైన అడవుల్లో కూడా ఇవి చాలా ఈజీగా ప్రయాణిస్తాయి. ఈ ఒప్పందం ద్వారా భారత సైన్యం తన రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోనుంది. మొత్తంగా, మహీంద్రా మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ, దేశ రక్షణలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఈ ఒప్పందం దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు మాత్రమే కాదు, భారత రక్షణ వ్యవస్థకూ పెద్ద మైలురాయిగా మారనుంది.
మహీంద్రా స్కార్పియో పిక్-అప్ ట్రక్ను ప్రధానంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. దీనిని స్కార్పియో N ఆధారంగా రూపొందించారు. దీన్ని భారత రోడ్లపై పరీక్షిస్తున్నట్లు ఇటీవల పలుమార్లు గుర్తించారు. మహీంద్రా 2023లో ఈ మోడల్ కాన్సెప్ట్ను ప్రదర్శించగా, తాజాగా పరీక్షలో కనిపించిన మోడల్ దానితో అనేక పోలికలను కలిగి ఉంది. దీనికి స్కార్పియో N ఫ్రంట్ డిజైన్ను అనుసరించారని స్పష్టంగా తెలుస్తోంది.
ట్విన్స్పీక్ మహీంద్రా లోగోతో కూడిన కొత్త గ్రిల్, ప్రొజెక్టర్ సెటప్తో కూడిన LED హెడ్ల్యాంప్స్, మస్క్యులర్ బానెట్ అన్నీ స్కార్పియో N లో కనిపించే అంశాలే. ఇది C-ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ లాంప్స్తో మరింత స్టైలిష్గా కనిపిస్తోంది. స్కార్పియో పిక్-అప్ను భారత సాయుధ దళం అవసరాలకు అనుగుణంగా పూర్తిగా కస్టమైజ్ చేస్తోంది. సాధారణ వినియోగదారుల కోసం విడుదలయ్యే వర్షన్కు భిన్నంగా ఉండనుంది.
ఈ ప్రత్యేక మోడల్ ఆర్మీ అవసరాల కోసం శక్తివంతమైన ఇంజిన్, బలమైన నిర్మాణం, అత్యాధునిక సేఫ్టీ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. దీని 4x4 వెర్షన్ను డెలివరీ చేయనున్నారు. ఆర్మీ కోసం రూపొందించే ఈ వాహనంలో స్టీల్ రిమ్స్ను ఉపయోగిస్తారు. ఇవి మిలిటరీ అవసరాలకు అనుగుణంగా మరింత బలమైనవిగా ఉంటాయి. కఠినమైన రహదారి పరిస్థితులను తట్టుకునేలాసస్పెన్షన్, గ్రౌండ్ క్లియరెన్స్ భాగాలను ఆర్మీ అవసరాలకు అనుగుణంగా మార్చనుంది.


Click it and Unblock the Notifications








